Followers

Saturday 16 November 2013

చిన్ని కృష్ణుడు (Lord Krishna In Child hood)



శ్రీకృష్ణావతారం దాల్చిన శ్రీమహావిష్ణువుకు ఆయన చేసిన గొప్ప గొప్ప పనుల ఆధారంగా అనేకానేక నామాలు వచ్చాయి. భాగవత కథాకథనాన్ని అనుసరించి గోకులంలో పెరుగుతున్న బాలకృష్ణుడిని ఎలాగైనా సంహరించాలని కంసుడు ఎప్పటికప్పుడు పథకాలు పన్నుతూ ఉండేవాడు. కంసుడి దురాలోచనలకు అతడి మిత్రులైన రాక్షసులు సహకారం అందిస్తుండేవారు. అయితే ఈ రాక్షసులంతా ఏదో ఒక విధంగా బాలకృష్ణుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా జరిగినప్పుడల్లా గోకులంలోని గోపాలురకు, కంసుడికి కూడా ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. పసిబాలుడు మహాబలవంతుడైన రాక్షసులను ఎలా సంహరించగలుగుతున్నాడని వారంతా విస్తుపోతుండేవారు. అయితే తాను సామాన్య మానవుడిని కానని కారణజన్ముడినని తెలియచెప్పటం కోసం కృష్ణుడి లీలలు సాగుతూ ఉండేవి. ఒకసారి కంసుడు తన స్నేహితుడైన కేశి అనే రాక్షసుడిని కృష్ణ సంహారం కోసం పంపాడు. కేశి ఒక గుర్రం రూపంలో గోకులంలో ప్రవేశించాడు. ఆ గుర్రం భీకరాకృతిని కలిగి ఉండి దాని సకిలింతలు అందరినీ భయపెట్టాయి. ఆ గుర్రం కదలికలతో గోకులంలోని వారందరూ భయకంపితులయ్యారు. ఆ గుర్రం చివరకు కృష్ణుడి కంట్లో పడింది. అది సాధారణమైన గుర్రం కాదని రాక్షసుడని కృష్ణుడు గ్రహించాడు. వెంటనే ఆ గుర్రం మీదకు లంఘించాడు. ఆ గుర్రం కోపావేశంతో ముందరి కాళ్లను ఎత్తి గట్టిగా కృష్ణుడిని తన్నింది. అయితే ఏమాత్రం ఆ దెబ్బకు చలించక దాని ముందరి రెండు కాళ్లు పట్టి ఒక్కసారి విసురుగా పైకెత్తి ఆ గుర్రాన్ని నేలకేసి కొట్టాడు కృష్ణుడు. ఆ దెబ్బతో ఆ రాక్షసుడు కొద్దిసేపు అచేతనంగా నేల మీద పడినా మళ్లీ వెంటనే శక్తిని పుంజుకుని కృష్ణుడి మీదకు దూకాడు. ఈసారి శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని ఆ గుర్రం నోట్లో గట్టిగా తిప్పడంతో వాడిగా ఉన్న దాని దంతాలన్నీ జారి నేల మీద పడ్డాయి. గుర్రం నోట్లో ఉన్న కృష్ణుడి చెయ్యి క్షణక్షణానికి ఉబ్బినట్లుగా అయి కేశికి శపిరాడలేదు. వెంటనే ఆ రాక్షసుడు నోరు చీలి కిందపడి చచ్చాడు. రాక్షసుడి పీడ విరగడ కావడంతో గోపాలకులంతా ఆనందంతో పొంగిపోయారు. ఇలా కేశి అనే రాక్షసుడు సంహరించడం వల్లనే శ్రీకృష్ణుడికి కేశవుడు అనే పేరు వచ్చింది. కంసుడు పంపిన రాక్షసుల్లో అరిష్టుడు అనే రాక్షసుడు భయంకరమైన వృషభ రూపంలో వచ్చి కృష్ణుడిని వధించాలని ప్రయత్నించగా ఆ వృషభాసురుడిని కూడా అవలీలగా కృష్ణుడు సంహరించాడు. అలాగే వ్యోమాసురుడు అనే రాక్షసుడు కృష్ణ సంహర లక్ష్యంతో వచ్చాడు. ఆ రాక్షసుడు మయుడికి కుమారుడు. ఎన్నో మాయలు సృష్టిస్తూ గోప బాలకులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఒకరోజున వాడు గోపబాలకులందరినీ బంధించి తీసుకువెళ్లి ఒక కొండ గుహలో దాచిపెట్టి ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండరాయితో మూసివేశాడు. కృష్ణుడు ఈ విషయాన్ని గ్రహించి వ్యోమాసురుడి మీదకు వెళ్లాడు. ఆ రాక్షసుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచి తన బలానంతా ప్రదర్శించాడు. అయితే కృష్ణుడు ఎంత మాత్రం చలించకుండా ఆ రాక్షసుడిని పట్టి తన భుజబలంతో మట్టి కరిపించాడు. ఆ తరువాత గుహ ద్వారానికి అడ్డంగా పెట్టి ఉన్న బండను తొలగించి గోప బాలకులందరినీ రక్షించాడు. ఇలా చిన్నతనంలోనే బాలకృష్ణుడు తన ఎన్నెన్నో మాయలను చూపి శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేశాడు.

Popular Posts