Followers

Friday 29 May 2015

తిరుప్పావై 1వ రోజు పాశురము


1వ రోజు - భగవంతుని మొదటి స్థానం నారాయణతత్వం

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్


నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం


"మార్గళి త్తింగళ్" మార్గశిర్షం మంచి మాసం, ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే, అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షినాయిణం వారికి రాత్రి అయితే ఉత్తరాయిణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షినాయిణం నుండి ఉత్తరాయిణంకు మారుతాడు, అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. "మది నిఱైంద నన్నాళాల్" చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం, చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. "నీరాడ ప్పోదువీర్ పోదుమినో" స్నానం చేయటానికి వెల్దాం! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. "నేరిళైయీర్" భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే.


"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి" పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని "చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్" సంపన్నులైన గోప పిల్లల్లా, మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం. ఏ భయమూ అవసరం లేదు. "కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్" పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ, ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా! "ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం" మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందించి పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. "కార్మేని" నల్లని మేఘంలాంటి ధివ్య కాంతులతో, అంతం లేని గుణాలు కల్గి, "చ్చెంగణ్ " వాత్సల్యం కల్గినవాడు. "కదిర్మదియం పోల్ ముగత్తాన్" చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గినవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. "నారాయణనే నమక్కే పఱైతరువాన్" నారాయణ అనే మంత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా "పారోర్ పుగళప్పడింద్" ఫలం సాక్షాత్తు పరమాత్మే, ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.


నారాయణ మంత్రం


ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి. ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణగుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయన గుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూడా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.


ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ". విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు-ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు, ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది, ఎందుకు వ్యాపించి ఉంటాడని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాడని తెలియజేస్తుంది, ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.


నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సఖల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దంలోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సఖల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు, లోపల-బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపల మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు, వారిలోని దోషాలను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు, దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.


అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మంత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్యమంత్రంగా అందించింది.


ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి, నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది, దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.


శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం

Popular Posts