Followers

Thursday 26 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం -10 ధ్వజ దత్తుడి కధ -2


–      పుష్కర  ముని ,ధ్వజ దత్తుడి పై కరుణ చూపాడు .  .మంత్రజలాన్ని  శిరసు పై జల్లాడు .శుచి అయి స్నానం చేసి రమ్మన్నాడు . .వెంటనే ధజ దత్తుని అశాంతి అంతా త్రుటి లో మాయ మై పోయింది .అక్కడే కూర్చుని ,హనుమ ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని శ్రద్ధ తో జపించాడు .ఎదుట దేదీప్య మాన మైన వెలుగు ప్రకాశించింది .వెంటనే సువర్చలా సహితుడైన ఆంజనేయ స్వామి అతని ఎదుట ప్రత్యక్ష మైనాడు .వెంటనే వారిద్దరి పాదముల పై పడి స్తోత్రం చేశాడు 
    ”వేద వేద్య మహా భాగ పురాణ పురుషోత్తమ -తవ సందర్శనైవ దురితం మే నివర్తితం 
     తవ సందర్శనా దేవ ,యోగినామపి దుర్లభం -బహుజన్మార్జితాత్   పుణ్యాత్ లబ్ధవా నస్మి సాంప్రతం .
     అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం -గతాన్యహాని సర్వాణి దుర్దినా నితి మే మథిహ్ 
     యస్త్వం సాక్షాత్క్రుతో దేవో బ్రహ్మా దైరపి దుర్లభం -దేవత్వం ప్రాణి తస్య  నమ్ర శిరసా యాచే వరం సాం వ్రతం .
     భావస్తే పద పంకజే ,భవతు మే భక్థిహ్ పరా శాశ్వతీ –త్వద్భావ స్తవ భక్త జాల విషయే భూయాత్త దేవాశ్రాయే 
     స్వాన్తే కాంక్షిత మేవ దేవ హనుమన్నత్వాం పదం ప్రార్ధయే ”
      అంటూ మనసు దీరా స్తుతించాడు .హనుమ ధ్వజదత్తుని ఆప్యాయం గా లేవ దీసి సువర్చలా దేవిని చూసి ”సూర్య   నందినీ !ఇతడు నా ప్రియ భక్తుడు .గురువు గారి అనుగ్రహం తో నేడు మన దర్శనాన్ని పొంద గలిగాడు .ఇతనికి వచ్చిన కష్టాలన్నీ గురు దూషణ వల్లనే వచ్చాయి .ఇప్పుడు ఇతని పూర్వ జన్మ వృత్తాంతాన్ని చెబుతాను విను .పూర్వ జనం లో ఇతని పేరు ధర్మ సారుడు .అన్ని శాస్త్రాలు చదివి ఉత్తమ పురుషుడు  గా   వుండే వాడు .ఎంతో మందికి వేద విద్య నేర్పాడు .ఒక సారి శిష్యులను వెంట తీసుకొని అడవికి పుష్పాలు ఫలాలు దర్భలు తీసుకు రావ టానికి వెళ్ళాడు .కొంత  దూరం వెళ్ళ గానే అక్కడ ”భరతుడు ”అనే రాజు ,నిశ్చల చిత్తం తో జితెన్ద్రియుడై ,”హనుమ సప్తాక్షరి ”మంత్రాన్ని బిగ్గరగా ,అతి వేగం గా జపిస్తుండడం గమనించాడు .రాజు దగరకు వెళ్లి ”మంత్రాన్ని అంత అ గట్టి గా జపిస్తావేం ?”అని కోప పడ్డాడు .రాజుకు బాహ్య స్మ్రుతి లేదు .తదేక  ధ్యానం లో వున్నాడు .ఇలాంటి మూడ్హుడు కి   ఏమి చెప్పినా నిష్ఫలం అనుకొంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు .
      కొంత దూరం లో శిష్యులతో వస్తున్న ”మృకండ మహర్షి ”దర్శనమిచ్చాడు .ఋషిని ప్రసన్నం చేస్సుకొని ,ఆయన అనుగ్రహం  తో హస్తన్యాస  కరన్యాసాలు తో ”సప్తాక్షరి ”ని ఉపదేశం గా పొంది ,జపించాడు .యెంత కాల మైనా మంత్ర సిద్ధి కలుగ లేదు .మంత్రం మీద ,గురువు మీద కోపం వచ్చి దూషించాడు .మంత్రోపాసన మానేశాడు .గురుదూషణ,మంత్ర త్యాగం  చేసిన ఈ ధ్వజ దత్తుడే ఆ నాటి ధర్మ సారుడు .ఈ జన్మ లో  గురువు అనుగ్రహం పొంది ,మన దర్శనం తోపాపాలన్నీ   పోగొట్టుకొని,కోర్కెలను   జయించిన వాడు అయ్యాడు .యితడు తన దరిద్రాన్ని దూరం చేసుకోవా టానికే తపస్సు చేశాడు .కనుక అనుగ్రహించి ఇతడిని భాగ్య వంతుడిని చేయాలి .ఈ నీ పుత్రు డికి ఐశ్వర్యం ప్రసాదించు ”అని కోరాడు 
         సువర్చలాదేవి సరే నని అనుగ్రహించింది .మళ్ళీ గురువును దర్శించి ,అనుమతితీసుకొని ఇంటికి వెళ్ళ మని ద్ధ్వజ దత్తుడికి చెప్పి సువర్చ లాంజనేయులు అడ్రుష్యమైనారు . అతడు పుష్కర గురువును దర్శించి ,అనుగ్రహం కోసం పాదాల పై పడ్డాడు .ఆయన ఆప్యాయం గా లేవ నెత్తి ”దత్తా ! జరిగినది అంతా  నాకు తెలిసింది .ఇంటికి వెళ్లి సుఖం గా వుండు ”అని దీవించి పంపించాడు 
         ధ్వజ దత్తుడు గురువుకు మాటి మాటికీ నమస్కారం చేస్తూ వెళ్ళ లేక  , వెళ్ళ లేక ఇంటి ముఖం పట్టాడు .ఇంటి దగ్గర కు రాగానే తానుండే ఇల్లు మారి పోయి ,అక్కడ దివ్య సౌధం కనిపించింది .బంగారపు కాంతి తో అది ధగ ధగ లాడు తోంది .మేడ మీద వున్న అతని భార్య ”శీలా దేవి ‘ సంతానం తో సహా ‘కిందికి దిగి వచ్చి ,భర్త కు స్వాగతం చెప్పి ,ఆయన పాదాలకు నమస్కరించి ,పాదోదకాన్ని శిరసున చల్లు కొన్నది .బంధుగణం అంతా వచ్చి చేరి ,అపూర్వ స్వా గతం పలికారు .ద్వజ దత్తుడు తమకు ఈ సంపద లభించ టానికి గురువు అనుగ్రహం ,శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహం కారణం అని అతి వినయం గా వివ రించాడు .ఇక నుండి తమ వారందరికీ సిద్ధాశ్రమం లో వున్న  పుష్కర మునియే  గురువు అని నిర్ద్వంద్వం గా తెలియ జేశాడు .తమ కందరకు  రక్ష, హనుమంతుడే నని చెప్పాడు .అంతా చాలా సంతోషించారు .అందరు ”ఆంజనేయ పాహిమాం ,ఆంజనేయ రక్షమాం ”అంటూ ,అక్కడి నుంచి వెళ్లి పోయారు .ధ్వజ దత్తుడు మానసిక ప్రశాంతితో సుఖ సంతోషాలతో కల కాలమ్ జీవించి దాన ధర్మాలు చేస్తూ ,చివరికి శ్రీ హరి లో ఐక్యమయాడు .ధ్వజ దత్తుడి కధ సంమాప్తం .తరువాత ”కపిలుని కధ ”ఇంకోసారి తెలుసు కొందాం 
              సశేషం 


Popular Posts