Followers

Monday 27 April 2015

శ్రీ మహాభారతంలో కథలు ---సైంధవ వధ


సూర్యుడు మెల్లగా ఎర్రబడడం చూసి దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వచ్చాడు. "రాధేయా! సాత్యకీ, భీముడూ సహాయంగా అర్జునుడు సైంధవుణ్ణి తరుముకొస్తున్నారు. ఇంకెంచెం సేపు వాణ్ణి ముందుకు వెళ్ళకుండా నిలబెట్టగలిగావంటే సూర్యుడు అస్తమిస్తాడు. అర్జునుడు చస్తాడు. వాడితోపాటే మిగిలినవాళ్లూనూ! ' పద్మప్యూహంలో అభిమన్యుణ్ణి చంపడానికి సహయపడిన సైంధవుణ్ణి రేపు సుర్యాస్తమయం లోగా చంపుతాను ' అని డాంబికాలు పలికాడు. చేటుకాలం వచ్చే ఇలాంటి ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు కాస్త శ్రమకోర్చి నిలబడ్డామంటే ఇంక రాజ్యమంతా మనదే" అన్నడు.

కర్ణుడు సరేనని విల్లందుకున్నాడు.

కర్ణుడికి, అర్జునుడికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది.

అందరినీ తరిమికొట్టి సైంధవుడి దగ్గరకు చేరాడు అర్జునుడు.

అతనిని చంపబోయే లోపల కౌరవదొరలంతా సైంధవుడికి అడ్డంగా నిలబడ్డారు. పొద్దుగుంకే లోపల వాళ్ళను జయించి సైంధవుణ్ణి చంపే వ్యవధి కనిపించక దిక్కులు చూస్తున్నాడు అర్జునుడు.

అది చూసి, అర్జునా! ఇంక వీళ్ళతో ఇలా యుద్ధం చేస్తూ కూర్చుంటే లాభం లేదు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. దీనికి నేనో ఉపాయం చేస్తాను! దాంతో కాని సైంధవుడు చావడు. సూర్యుణ్ణి మబ్బులతో కప్పేస్తారు. ఆ చీకటి చూసి అందరూ సూర్యాస్తమయమైందనుకుని సంతోషంతో ఒకరినొకరు పొగుడుకుంటూ విచ్చిపోతారు. అప్పుడు నీ ప్రతిజ్ఞ చెల్లించుకో" అన్నాడు కృష్ణుడు. "బావా! ఇంత పరాక్రమం వుండి కూడా ఇలాంటి మిషతో ప్రతిజ్ఞ తీర్చుకోమంటావా?" అని అర్జునుడు బాధగా అన్నాడు.

"దుర్మార్గుల్ని దుర్మార్గంతోనూ, మోసగాళ్ళను మోసంతోనూ చంపడం తప్పు కాదు! నువ్వేం బాధపడకు" అంటూ మాధవుడు మాయాతిమిరంతో మార్తాండ మండలాన్ని మరుగుపరచాడు. అది చూసి సూర్యుడు అస్తమించాడనుకుని కౌరవ సైన్యాలన్నీ సింహనాదాలు చేస్తూ చెదిరిపోయాయి. సైంధవుడు సంతోషం పట్టలేక రథమెక్కి నిలబడ్డాడు. "అర్జునా! అడుగో సైంధవుడు. ఆలస్యం చెయ్యకు" అని కృష్ణుడు తొందరపెట్టాడు.

తక్షణం బాణం సంధించాడు అర్జునుడు. దాంతో సైంధవుడి తల తెగింది.

"పార్ధా! ఆ తల కింద పడనియ్యకు! అలాగే ఆకాశంలో ఆడించు. దాని సంగతి తరువాత చెబుతా నీకు" అన్నాడు కృష్ణుడు కంగారుపడుతూ. వెనక్కీ ముందుకీ కిందకీ పైకీ బాణాలు వేసి ఆ తలను ఆకాశంలో బంతిలా ఆడించాడు అర్జునుడు. ఇంతలో మాయచీకటి తొలిగి సూర్యబింబం ప్రకాశించింది. కౌరవులు దిక్కుతొచక పరుగులుపెట్టారు.

"బావా! వీడి తలకాయ ఇలా ఎంతసేపు వుంచమంటావు? దీన్ని ఎక్కడ పడెయ్యాలి? అసలు కధేమిటో చెప్పు?" అని అర్జునుడు అడిగాడు.

వృద్ధక్షత్రుడనే సింధురాజు పుత్రులకోసం ఎన్నెన్నో పూజలూ, తపస్సులూ చేసి చివరకు జయద్రథుణ్ణి కన్నాడు. వీడి చిన్నతనంలో ఒకనాడు 'వీడు యుద్ధంలో ఏమరి వున్నప్పుడు చంపబడతాడు' అని అశరీరవాణి పలికింది. వృద్ధక్షత్రుడు అది విని ఎంతో విచారించాడు. 'సైంధవుడి(జయద్రథుడు) తల ఎవడు నేల పడేస్తాడో వాడి తల నూరు చెక్కలగుగాక ' అని అతడు తన తపోబలంతో పలికాడు. అతనిప్పుడు శమంతపంచక సమీపంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ తల వెళ్ళి ఇప్పుడతని తొడమీద పడాలి. పాశుపతాస్త్రాన్ని ప్రార్థించు " అన్నాడు కృష్ణుడు.

అర్జునుడు వేసిన పాశుపతం అనేక బాణాల ఆకారం ధరించి అ శిరస్సును తీసుకువెళ్ళి వృద్ధక్షత్రుడి తొడమీద పడేసింది. తపస్సులో వున్న వృద్ధక్షత్రుడు స్పర్శకు ఖంగారుపడి దానిని కిందకు తోశాడు. వెంటనే అతని తల నూరు చెక్కలైంది. చిత్రమేమంటే సైంధవుడి తల నేల పడేవరకూ అతని మొండెం అలా రథం మీద నిలబడే వుంది.

ఇదంతా చూసి కౌవర సేనలు నిర్ఘాంతిపోయరు. తమ్ముడి ప్రతిజ్ఞ నెరవేరినందుకు ధర్మరాజు సంతోషించాడు.

Popular Posts