Followers

Sunday 24 March 2013

ఆదర్శ జీవనం(Adharsha Jeevanam)

మనిషి సృష్టిలోచాల చిత్రం. ఎందుకంటే అతనికో మెదడు, ఆలోచించే నేర్పు ఉంది. ఆ నేర్పుతో ఎన్నో విజయాలను, అసాధ్యం అనుకొన్న దాన్ని సుసాధ్యం చేస్తుంటాడు. చెమర్చే కనులు, రసాలూరే వీనులు, తన్మయత్వం చెందే మనసు కూడా మనిషికే సొంతం అయ్యాయ. ఇతర జీవులల్లో కూడా అంటే పశువుల్లో, చెట్లల్లో కూడా ఈ మనసును గుర్తిస్తున్నాం. కాని ఇవి అన్నీ మనిషి మనసుకు సరితూగవు. మనిషి మనసు ఎవరికీ సాటిరాని ప్రత్యేకతను కలిగుంది.
అలాంటి మనసును స్వంతం చేసుకొన్న మానవుడు తనను తాను ఉన్నత పథంలో నిలుపుకోవడానికి అనేకానేక కష్టాలు పడ్తాడు. ఈ ఉన్నత పథం అన్న దానిలోనూ తారతమ్యాలున్నాయ. కొందరు ఈ భౌతిక జీవనంలో అగ్రగామిగా ఉండాలని నిత్యం పోరాడుతుంటారు. ఇది అంతా జీవన పోరాటం. మనుగడ కోసం పోట్లాట. ఇది జీవి మరణానికి దగ్గరైతే పోరాటం కూడా ఆగిపోతుంది. కాని మరికొందరు ఆధ్యాత్మిక పథంలో ముందుండాలని నిత్యం శ్రమిస్తుంటారు. ఈ శ్రమ అటు పారమార్థికంలో ముందువరసలో నిలబెట్టడమే కాదు. భౌతిక జీవనాధారాలకూ ఆధారం అవుతుందంటారు కొందరు పెద్దలు. అయతే ఈ శ్రమకు ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయ. వాటిని నెదుర్కొంటూ విజయ సోపానంలో సాగిపోవాలి. అపుడే విజయపథం అందుతుంది.
అసలు ఏ కార్యాన్నీ మొదలుపెడితే అది పూర్తిఅయ్యేవరకు అవిశ్రాంతంగా శ్రమపడాలి. అతడి శ్రమలో ఏ మాత్రం లోపం కనిపించినా ఆ పని విజయవంతంగా పూర్తవదు. మొదలుపెట్టిన కార్యం పూర్తయేలోపు ఎన్నో విఘ్నాలు అతడిని నిరాశకు గురిచేస్తూ ఉంటాయి. అయితే వాటిని లెక్కచేయకుండా లక్ష్యాన్ని ముందుంచుకుని కార్యదీక్షతో సాగిపోయే వ్యక్తికి అవరోధాలు,ఆటంకాలు లెక్కలోవి కావు. కార్యసాధనలో ‘రామదూత’ ఆంజనేయుడు మనకు స్ఫూర్తిదాయకుడు.
రామాయణంలోని సుందరాకాండలో హనుమంతుడు శ్రీరాముని ఆదేశానుసారం సీతానే్వషణకు బయలుదేరుతాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకలో సీత జాడ గ్రహించాలి. ఆంజనేయుడు సముద్రంపై ప్రయాణం మొదలుపెట్టగానే మైనాకుడనే పర్వతశ్రేష్ఠుడు తనపై విశ్రాంతి తీసుకోమంటాడు. కానీ కార్యదీక్షాతత్పరుడైన హనుమంతుడు విశ్రాంతికిది సమయం కాదంటాడు. మైనాకుడిని స్నేహపూర్వకంగా స్పృశించి తిరిగి ప్రయాణం మొదలుపెడతాడు. అలాగే కార్యసాధకుడు కూడా సన్మాన, సత్కారాలను తిరస్కరించక చాలా నేర్పుగా వాటినుంచి తప్పించుకోవాలంటారు విజ్ఞులు.
కొంతదూరంలో హనుమకి సురస అడ్డువస్తుంది. ఆమెను శిక్షించగల సామర్థ్యం ఉన్నప్పటికీ తొందరపడి శిక్షింపడు. ఆమె ఆకారాన్ని బట్టి తాను శరీరాన్ని పెంచుకుంటూ చివరకు సూక్ష్మరూపంలో ఆమె నోటిలోకి వెళ్ళి వచ్చి, శత్రువు తలవంచేలా చేశాడు. అలాగే కార్యసాధకుడు తమ సాధనాల్లో విఘ్నాలు కలిగించే వారిపట్ల సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ శత్రువు తలవంచేలా చేయాలే గాని అన్నివేళలా భుజబలం ప్రదర్శించడం కాకుండా బుద్ధిబలాన్ని చూపించాలని హనుమంతుడు మానవులకు ఉపదేశం ఇస్తున్నాడంటారు జిజ్ఞాసువులు.
మరికొంత దూరం తర్వాత ఆంజనేయునికి ఎదురొచ్చిన మరో విఘ్నం సింహిక. సింహిక హనుమంతుని నీడని పట్టుకుంటుంది. అతని వేగాన్ని కుంటుపరుస్తుంది. సింహిక ఈర్ష్యకు సంకేతం. హనుమంతుడు తన భుజబలంతో సింహికను సంహరిస్తాడు. అందుకే మనుషులల్లో ఈర్ష్యాద్వేషాలు ఉండకూడదు. ఎప్పటికప్పుడు మానవులు తమ లోని అసూయాలక్షణాలను కడిగివేసుకోవాలని ఈ ఘట్టం మనకు చెప్తుంది. చివరకు ఎదురైన విఘ్నం లంకిణి. ఆమెను లేవలేని గుద్దు గ్రుద్దుతాడు. ఏ కష్టం వచ్చినా సరే తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మెలగాలి. అలా మానవుడు తన్ను తాను సన్మార్గంలో నడిచేలా చేసుకొంటూ ఇతరులకు ఆదర్శంగా ఉండేలా జీవనం సాగించాలి.

Popular Posts