Followers

Saturday 16 March 2013

శివుడు గరళకంఠుడు(SivuduGaralakantudu)

గరళకంఠుడు
సృష్టి మేలుకోసం తానే సర్వమూ అయ్యే సర్వాత్ముడు శివుడు. అమృతోత్పత్తి కోసం దేవతలు, దానవులు అత్యంత ఉత్సాహంతో క్షీరసాగర మథనంలో పాలు పంచుకున్నప్పుడు ముందుగా ఆవిర్భవించింది 'హాలాహలం'. గరళాన్ని సేవించి స్థిరంగా తనలో నిలుపుకోగల మహితమైన దైవం శివుడే అని తలచిన దేవదానవులు పాపహరుడైన హరుని ప్రార్థించగానే చిరునవ్వుతో ఆ కాలకూట విషాన్ని తన గొంతులో నింపుకుని గరళకంఠుడయ్యాడు స్వామి. ఈ మహత్తర కార్యంతో లోకాలకు ఎటువంటి కీడూ వాటిల్లకుండా చేసిన వాత్సల్య సింధువు నీలకంధరుడు.

పంచభూతాల్లో ముఖ్యమైనది, ప్రాణికోటికి అత్యంత ఆవశ్యకమైనది జలం. భగీరధుడు దివి నుంచి భువికి గంగను తీసుకు వచ్చినప్పుడు బిరబిర జరజర దూసుకువచ్చే గంగమ్మను క్షణాన నిలువరించి, విశేషమైన జలధారలను తాను ఒడిసిపట్టి, ఆ వేగాన్ని అదుపుచేసి, తగినంతగా ఆ జలధారలను భూమి మీదకు వదిలి భూమి మీద జీవులకు ప్రాణాధారమైన జలాన్ని అందించడమే ఆ శివమూర్తి అపారమైన కారుణ్యానికి ఉదాహరణ. ఈ జగాన మహోన్నతమైన శక్తిగా మహేశ్వరుడు లింగాకృతిలో ఆవిర్భవించిన బృహత్సమయమే మహాశివరాత్రిగా వాసికెక్కింది.


మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయాన ఆవిర్భవించిన ఆ దివ్యఘడియలే మహాశివరాత్రిగా ప్రసిద్ధమైనదే గాక, ఆ పుణ్య ఘడియలలో శివుని అర్చించి పూజించిన వారికి కైవల్యం ప్రాప్తిస్తుందని సాక్షాత్తూ శివుడే అనుగ్రహించినట్లు శివపురాణం స్పష్టం చేస్తోంది. శివునికి నిష్ఠతో మహాశివరాత్రి పుణ్యదినాన అభిషేకాన్ని పవిత్రజలంతో నిర్వహించి, బిల్వపత్రంతో పూజిస్తే పునర్జన్మ ఉండదనేది పురాణ ప్రోక్తంగా చెప్పబడింది.

Popular Posts