Followers

Friday 7 February 2014

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పన్నెండవ అధ్యాయం



మైత్రేయ ఉవాచ
ధ్రువం నివృత్తం ప్రతిబుద్ధ్య వైశసాదపేతమన్యుం భగవాన్ధనేశ్వరః
తత్రాగతశ్చారణయక్షకిన్నరైః సంస్తూయమానో న్యవదత్కృతాఞ్జలిమ్

కోపము తొలగిపోయి హింసనుండి మరలిన ధృవున్ని తెలుసుకుని మహాత్ముడైన కుబేరుడు శారద యక్ష కిన్నెరాదులచే స్తోత్రం చేయబడుతూ అక్కడికి వచ్చాడు. ధృవుడు కుబేరునికి నమస్కారం చేసాడు. ధృవునితో కుబేరుడిలా అన్నాడు

ధనద ఉవాచ
భో భోః క్షత్రియదాయాద పరితుష్టోऽస్మి తేऽనఘ
యత్త్వం పితామహాదేశాద్వైరం దుస్త్యజమత్యజః

(పెద్దలమాట విన్నాడు ధృవుడు అనఘుడు)
పాప రహితుడవైన ధృవా, నీ పనికి నేను మెచ్చాను (తాతగారి మాట వినడాన్ని, కోపములో ఉన్నవారు ఎవరినీ పట్టించుకోరు). తాత గారి ఆజ్ఞ్య వలన విడిచిపెట్టరాని కోపాన్ని విడిచిపెట్టావు.

న భవానవధీద్యక్షాన్న యక్షా భ్రాతరం తవ
కాల ఏవ హి భూతానాం ప్రభురప్యయభావయోః

నీవు యక్షులనూ చంపలేదూ, యక్షులు  నీ సోదరున్నీ చంపలేదు. ప్రాణి పుట్టాలన్నా మరణించాలన్నా వారి వారి కాలమే కారణం. కాలానుగుణముగానే పుడతారూ, కాలానుగుణముగానే మరణిస్తారు.

అహం త్వమిత్యపార్థా ధీరజ్ఞానాత్పురుషస్య హి
స్వాప్నీవాభాత్యతద్ధ్యానాద్యయా బన్ధవిపర్యయౌ

నేనూ నీవు అన్న వ్యవహారమే అపార్థము. ఇది అజ్ఞ్యానం వలన కలిగేదే తప్ప ఈ భేదము కూడా లేదు. స్వప్నములోని బుద్ధిలాగ, అసత్తును ధ్యానం చేయడం వలన (లేదా భగవంతుని ధ్యానం చేయనందు వలన) . ఈ దృష్టితోటే పుట్టుకా సంసారం నరకం కలుగుతున్నాయి. జగత్తు సంసారము కన్నా భిన్నమైంది అనుకోవడం వలనే కలుగుతున్నాయి

తద్గచ్ఛ ధ్రువ భద్రం తే భగవన్తమధోక్షజమ్
సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మవిగ్రహమ్

నీవు నగరానికి వెళ్ళి, ఇంద్రియ వ్యాపారములను కిందిగా చేసేవాడైన భగవంతుని ఆరాధించు. అన్ని ప్రాణులలో ఆయన అంతర్యామిగా ఉన్నాడు. అన్ని ప్రాణుల శరీరమూ, ఆత్మా, అంతర్యామిగా ఉన్నాడు.

భజస్వ భజనీయాఙ్ఘ్రిమభవాయ భవచ్ఛిదమ్
యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యాత్మమాయయా

అలాంటి పరమాత్మను సేవించు. ఎందరెందరిచేతో సేవించబడిన పాదపద్మములు కలవాడు. మళ్ళీ పుట్టుక లేకుండా చేయగలిగే వాడు. ఆయన సంసారాన్ని చేధిస్తాడు. ఈయన అన్నిటితో కలిసి ఉండీ దేనితోనూ కలవని వాడు. తన యోగమాయ శక్తితో గుణ త్రయముతో కూడిన శక్తితో ఈ పనులు చేస్తాడు

వృణీహి కామం నృప యన్మనోగతం మత్తస్త్వమౌత్తానపదేऽవిశఙ్కితః
వరం వరార్హోऽమ్బుజనాభపాదయోరనన్తరం త్వాం వయమఙ్గ శుశ్రుమ

ఉత్తాన పాదుని పుత్రుడా, ఏ మాత్రం సందేహించకుండా నీకు కావలసిన వరాన్ని కోరుకో.  నిరనతరం శ్రీమన్నారాయణ పాదపద్మాలు సేవిస్తూ ఉంటావని విన్నాను కాబట్టి స్వయముగా వచ్చాను.

మైత్రేయ ఉవాచ
స రాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతిః
హరౌ స వవ్రేऽచలితాం స్మృతిం యయా తరత్యయత్నేన దురత్యయం తమః

అలా కుబేరుడు అడిగితే పరమాత్మ భక్తులలో అగ్రగణ్యుడూ, మహామతీ అయిన ధృవుడు, "శ్రీమన్నారాయణుడి యందు స్మర్ణ తొలగకుండా ఉండు గాక" అని కోరాడు. పరమాత్మను స్మరించడం వలన ఇతరుల చేత దాట శక్యం కాని అజ్ఞ్యానన్ని అప్రయత్నముగా తొలగించుకుంటాము.

తస్య ప్రీతేన మనసా తాం దత్త్వైడవిడస్తతః
పశ్యతోऽన్తర్దధే సోऽపి స్వపురం ప్రత్యపద్యత

ఇలా ధృవుడు అడిగితే కుబేరుడు ఆ వరాన్ని ఇచ్చాడు. ఇచ్చి తన నగరానికి వెళ్ళిపోయాడు.

అథాయజత యజ్ఞేశం క్రతుభిర్భూరిదక్షిణైః
ద్రవ్యక్రియాదేవతానాం కర్మ కర్మఫలప్రదమ్

ధృవుడు అనేక యజ్ఞ్యాలు ఆచరించాడు. యజ్ఞ్యమంటే పరమాత్మ ఆరాధనమే. దక్షిణలతో కూడిన యజ్ఞ్యాలు ఆచరించాడు. యజ్ఞ్యములతో యజ్ఞ్యపతిని ఆరాధించాడు. అంటే "నేనే యజ్ఞ్యం చేస్తున్నాను" అన్న కర్తృత్వాభిమానాన్ని వదిలిపెట్టాడు. యజ్ఞ్యములో ద్రవ్యమూ క్రియా దేవతా ఉంటాయి. దేవతా మంత్రమూ క్రియా ఉండాలి. ఏ ద్రవ్యాన్ని ఏ దేవతకి ఇవ్వాలో ఆ దేవతకివ్వాలి. అలా హవిస్సులిచ్చి ఆరాధించాడు. ఇది కర్మఫలప్రదం. చేసిన కర్మ యొక్క ఫలితాన్ని ఇస్తుంది.

సర్వాత్మన్యచ్యుతేऽసర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్
దదర్శాత్మని భూతేషు తమేవావస్థితం విభుమ్

ధృవుడీరీతిలో అద్భుతమైన యజ్ఞ్య యాగాలు చేసాడు. అందరిలో అంతరాత్మగ ఉండి ఏమీ అంటని పరమాత్మలో తీవ్రమైన భక్తిని ధరించి, తన ఆత్మలోనూ సకలప్రాణులలోనూ పరమాత్మే ఉన్నడన్న విషయాన్ని సాక్షాత్కరించుకున్నాడు. ఇదే కర్మ ఫల ప్రదం. ఇదే ఫలితం.

తమేవం శీలసమ్పన్నం బ్రహ్మణ్యం దీనవత్సలమ్
గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజాః

శీలసంపన్నుడు ధృవుడు. బ్రాహ్మణుల ఎడ గౌరవం ఉన్నావాడు. దీనుల మీద ప్రేమ చూపేవాడు. ధర్మ నియమాలను జాగ్రత్తగా కాపాడేవాడు. ప్రజలందరూ ఇతన్ని తండ్రిగా చూసారు.

షట్త్రింశద్వర్షసాహస్రం శశాస క్షితిమణ్డలమ్
భోగైః పుణ్యక్షయం కుర్వన్నభోగైరశుభక్షయమ్

స్వామిచెప్పినట్లుగా ధృవుడు 36000 సంవత్సరాలు పరిపాలించాడు. కేవలం రాజ్యపరిపాలనే కాకుండా దుర్మార్గులను శిక్షిస్తూ కూడా ఉన్నాడు. రాజ్య పరిపాలన చేసినప్పుడు వచ్చిన భోగాలన్నె అనుభవించాడు. కానీ అవి భోగమని అనుభవించలేదు. సుఖపడడం వలన పుణ్యం వ్యయమవుతుంది, కష్టాలు పడడం వలన పాపం పోతుంది. ధృవుడు ఈ రెండూ కర్చుపెట్టాలని ధృవుడు భోగాలు అనుభవించి పుణ్యాన్నీ, కష్టములనుభవించి పాపాన్ని పోగొట్టుకున్నాడు

ఏవం బహుసవం కాలం మహాత్మావిచలేన్ద్రియః
త్రివర్గౌపయికం నీత్వా పుత్రాయాదాన్నృపాసనమ్

ఇలా చాలా కాలం ఇంద్రియములు పక్కకు పోకుండా చూసుకున్నాడు. ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థములకు కావలసిన పనులు చేసి, ఇంక చేయవలసిన పని లేదు అని కుమారునికి రాజ్యమిచ్చాడు

మన్యమాన ఇదం విశ్వం మాయారచితమాత్మని
అవిద్యారచితస్వప్నగన్ధర్వనగరోపమమ్

ఈ ప్రపంచనమంతా పరమాత్మ యొక్క మాయ అని తెలుసుకుని, ఏదీ ఉండేది కాదు, ఏదీ లేనిది కాదు అని తెలుసుకుని, ఇదంతా అవిద్యా రచితమైనదనీ, స్వప్నములో ఉన్న గంధర్వ నగరము లాంటిది అని తెలుసుకున్నాడు. 

ఆత్మస్త్ర్యపత్యసుహృదో బలమృద్ధకోశమ్
అన్తఃపురం పరివిహారభువశ్చ రమ్యాః
భూమణ్డలం జలధిమేఖలమాకలయ్య
కాలోపసృష్టమితి స ప్రయయౌ విశాలామ్

తాను గానీ శరీరము గానీ స్త్రీ కానీ సైన్యమూ అంతఃపురమూ ఇవన్నీ కూడా చూడటానికి సుందరముగా కనపడతాయి. ఈ భూమండలమంతా ఎన్నటికో ఒక నాటికి కాలము చేత కబళింపబడేదే. 
కాలోపసృష్టమితి   - ఇవన్నీ కాలము చేత కబళింపబడేవే. పాము నోట్లో కప్ప ఉన్నట్లు కాలము నోట్లో ఉన్నాము మనము. ఈ విషయం తెలుసుకున్నాడు ధృవుడు. ఇంతటి భోగాలనుభవించి వెళ్ళిపోవాలంటే ఎంతో వైరాగ్యం ఉండాలి. 
ధృవుడు విశాలాకు (బదరికాశ్రమానికి) వెళ్ళాడు. 

తస్యాం విశుద్ధకరణః శివవార్విగాహ్య
బద్ధ్వాసనం జితమరున్మనసాహృతాక్షః
స్థూలే దధార భగవత్ప్రతిరూప ఏతద్
ధ్యాయంస్తదవ్యవహితో వ్యసృజత్సమాధౌ

ఆ బదరికాశ్రమములో పరిశుద్ధమైన ఇంద్రియములు కలవాడై పరమ మంగళ కరములైన నదులలో స్నానం చేసి, యమ నియమ ఆసనాదులతో (విశుద్ధకరణః  - యమ, శివవా - నియమ బద్ధ్వాసనం  - ఆసన జితమరున్మనసాహృతాక్షః - ప్రాణాయామమూ ప్రత్యాహారము స్థూలే దధార భగవాన్ - ధారణ వ్యసృజత్సమాధౌ - సమాధి) 

భక్తిం హరౌ భగవతి ప్రవహన్నజస్రమ్
ఆనన్దబాష్పకలయా ముహురర్ద్యమానః
విక్లిద్యమానహృదయః పులకాచితాఙ్గో
నాత్మానమస్మరదసావితి ముక్తలిఙ్గః

పరమాత్మ యందు భక్తి కలిగి, ప్రత్యక్షముగా తాను చూసిన భగవానుని రూపాన్ని తలచుకుని కన్నీళ్ళతో మాటి మాటికీ అడ్డగింపబడిన వాడై పులకిత గాత్రుడై శరీరము మీద ధ్యాస వదిలిపెట్టి తనను కూడా తాను తలచుకోలేదు.

స దదర్శ విమానాగ్ర్యం నభసోऽవతరద్ధ్రువః
విభ్రాజయద్దశ దిశో రాకాపతిమివోదితమ్

ఎప్పుడైతే తన శరీరము కూడా తాను చూచుకోని స్థితికి వెళ్ళాడో అప్పుడు ఆకాశములో ఒక విమానం తన కోసం వచ్చింది. దాన్ని చూచాడు

తత్రాను దేవప్రవరౌ చతుర్భుజౌ
శ్యామౌ కిశోరావరుణామ్బుజేక్షణౌ
స్థితావవష్టభ్య గదాం సువాససౌ
కిరీటహారాఙ్గదచారుకుణ్డలౌ

ఆ విమానం నుండి ఇద్దరు దిగారు. వారు శ్రీమన్నారాయణుని ఆకారముతో ఉన్నాను, విశాల నేత్రాలు గలిగి, యవ్వనానికీ బాల్యానికి మధ్య ఉన్న వయసు కలిగి ఉన్నారు (కిశోర) .

విజ్ఞాయ తావుత్తమగాయకిఙ్కరావ్
అభ్యుత్థితః సాధ్వసవిస్మృతక్రమః
ననామ నామాని గృణన్మధుద్విషః
పార్షత్ప్రధానావితి సంహతాఞ్జలిః

శ్రీమన్నారాయణుని కింకరులు వచ్చారని తెలుసుకున్న ధృవునికి ఒళ్ళు పులకించి వణికి తొట్రుపాటు పడి క్రమమును మరచిపోయాడు. పరమాత్మ నామాలను పలుకుతూ నమస్కారం చేసాడు. పలుకుతూ నమస్కారం చేయాలా, నమస్కారం చేసి నామం పలకాలా అన్న విషయం జ్ఞ్యప్తికి రాలేదు. (కృష్ణ పరమాత్మ బృందావనములో వేణువులూదుతుంటే ఆ తొందరలో మొలత్రాడుని మెడలో వేసుకుని హారమును నడుముకు వేసుకున్నారు. సంతోషములో మనకు క్రమము తెలియదు) 

తం కృష్ణపాదాభినివిష్టచేతసం
బద్ధాఞ్జలిం ప్రశ్రయనమ్రకన్ధరమ్
సునన్దనన్దావుపసృత్య సస్మితం
ప్రత్యూచతుః పుష్కరనాభసమ్మతౌ

నమస్కారము చేస్తూ అక్కడే కూర్చున్నాడు. వినయముతో తల వచుకుని ఉన్నాడు. వచ్చిన వారు సునంద నందులు. వారు దగ్గరకు వచ్చి చిరునవ్వుతో పరమాత్మకు అనుకూలముగా ఉన్న మాటను పలుకుతున్నారు

సునన్దనన్దావూచతుః
భో భో రాజన్సుభద్రం తే వాచం నోऽవహితః శృణు
యః పఞ్చవర్షస్తపసా భవాన్దేవమతీతృపత్

రాజా! నీకు శుభము కలుగు గాక. నీవు ఐదేళ్ళ వయసులోనే శ్రీమన్నారాయణున్ని సంతృప్తి పరచావు. 

తస్యాఖిలజగద్ధాతురావాం దేవస్య శార్ఙ్గిణః
పార్షదావిహ సమ్ప్రాప్తౌ నేతుం త్వాం భగవత్పదమ్

సకల చరాచర జగత్తుని పరిపాలించే శ్రీమన్నారాయణుని పార్షదులము

సుదుర్జయం విష్ణుపదం జితం త్వయా యత్సూరయోऽప్రాప్య విచక్షతే పరమ్
ఆతిష్ఠ తచ్చన్ద్రదివాకరాదయో గ్రహర్క్షతారాః పరియన్తి దక్షిణమ్

ఎలాంటి వారికైన దుర్లభమైన పరమాత్మ పదమును నీవు గెలిచావు. మహాత్ములు కూడా దేనిగురించి ధ్యానిస్తూ ఉంటారో, ఏ స్థానాన్ని సూర్య చంద్ర ఋషులు ప్రదక్షిణం చేస్తారో ఆ స్థానన్ని నీవు పొందబోతున్నావు

అనాస్థితం తే పితృభిరన్యైరప్యఙ్గ కర్హిచిత్
ఆతిష్ఠ జగతాం వన్ద్యం తద్విష్ణోః పరమం పదమ్

ఎవ్వరూ ఇటువంటి స్థానాన్ని పొంది ఉండలేదు. అలాంటి ఉత్తమ స్థానాన్ని, పరమపదముగా భాసించే ఆ స్థానాన్ని నీవు చేరుకో. 

ఏతద్విమానప్రవరముత్తమశ్లోకమౌలినా
ఉపస్థాపితమాయుష్మన్నధిరోఢుం త్వమర్హసి

పరమాత్మ తన శిరస్సును కదల్చి ఈ విమానము నీ కొరకు తీసుకుపొమ్మని చెప్పాడు. నీవు దీన్ని అధిరోహించవలసినది 

మైత్రేయ ఉవాచ
నిశమ్య వైకుణ్ఠనియోజ్యముఖ్యయోర్మధుచ్యుతం వాచమురుక్రమప్రియః
కృతాభిషేకః కృతనిత్యమఙ్గలో మునీన్ప్రణమ్యాశిషమభ్యవాదయత్

పరమాత్మే కాదు, పరమాత్మ దాసులు కూడా తీయగా మాట్లాడగలరు. వారి మాటలు విని సరస్సులో మునిగి స్నాన సంధ్యాదులు ముగించుకొని (కృతనిత్యమఙ్గలో ) మళ్ళీ వచ్చి వారికి నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని కోరాడు

పరీత్యాభ్యర్చ్య ధిష్ణ్యాగ్ర్యం పార్షదావభివన్ద్య చ
ఇయేష తదధిష్ఠాతుం బిభ్రద్రూపం హిరణ్మయమ్

విమానం దగ్గరకు వెళ్ళి, దాని చుట్టూ ప్రదక్షిణం చేసి, పూజించి ఉత్తమ విమానాన్ని, ద్వారపాలకు నమస్కరించి, బంగారు మయమైన విమానాన్ని చూచి ఎక్కాలనుకున్నాడు

తదోత్తానపదః పుత్రో దదర్శాన్తకమాగతమ్
మృత్యోర్మూర్ధ్ని పదం దత్త్వా ఆరురోహాద్భుతం గృహమ్

ఇలా విమానాన్ని అధిరోహించాలనుకుంటూ ఉండగా, మృత్యువు వచ్చింది (అంతకమాగతం). మృత్యువు నెత్తిన కాలు పెట్టి ఆ విమానాన్ని ఎక్కాడు ధృవుడు. 

తదా దున్దుభయో నేదుర్మృదఙ్గపణవాదయః
గన్ధర్వముఖ్యాః ప్రజగుః పేతుః కుసుమవృష్టయః

ఇలా ధృవుడు విమానం ఎక్కుతూ ఉంటే దుంధుబులు మ్రోగాయి, గంధర్వులు గానం చేసారు, పుష్ప వర్షాన్ని కురిపించారు. 

స చ స్వర్లోకమారోక్ష్యన్సునీతిం జననీం ధ్రువః
అన్వస్మరదగం హిత్వా దీనాం యాస్యే త్రివిష్టపమ్

ఇలా విమానం ఎక్కి వైకుంఠానికి వెళుతున్నాప్పుడు తన తల్లిని తలచాడు. ఇది చాలా పాపము. తన తల్లి పరమ దీనురాలు. తల్లిని వదిలి స్వామి దగ్గరకు వెళ్ళడం పుత్ర ధర్మము కాదు. అని తల్లిని తలచుకున్నాడు. 

ఇతి వ్యవసితం తస్య వ్యవసాయ సురోత్తమౌ
దర్శయామాసతుర్దేవీం పురో యానేన గచ్ఛతీమ్

వారు దేవతలూ, పరమాత్మ పార్షదులు కాబట్టి ధృవుని మనస్సు తెలుసుకున్నారు. "దిగులు పడకు, నీ ముందర విమానములో నీ తల్లి ఉంది, చూడు" 

తత్ర తత్ర ప్రశంసద్భిః పథి వైమానికైః సురైః
అవకీర్యమాణో దదృశే కుసుమైః క్రమశో గ్రహాన్

ఇలా వెళుతున్న ధృవుని విమానాలు చూసి దారిలో ఉన్న గంధర్వ యక్ష కిన్నరుల విమానాలలోంచి చూసి పూలవాన కురిపించారు. ఒక్కో గ్రహాన్నీ లోకాన్నీ దాటుకుంటూ వెళుతున్నారు. 

త్రిలోకీం దేవయానేన సోऽతివ్రజ్య మునీనపి
పరస్తాద్యద్ధ్రువగతిర్విష్ణోః పదమథాభ్యగాత్

ఈ మూటినీ దాటి, పరమాత్మ స్థానముగా ఉన్న పరమపదాన్ని చేరాడు. తన దివ్య మైన కాంతితోటే సకల బ్రహ్మాండములో ఉన్న లోకాలన్నీ ప్రకాశింపచేస్తోంది. 

యద్భ్రాజమానం స్వరుచైవ సర్వతో లోకాస్త్రయో హ్యను విభ్రాజన్త ఏతే
యన్నావ్రజన్జన్తుషు యేऽననుగ్రహా వ్రజన్తి భద్రాణి చరన్తి యేऽనిశమ్

ఆ లోకము వలన మూడు లోకాలు కూడా ప్రకాశిస్తున్నాయి. నిరంతరమూ ఎవరు మంగళములను ఆచరిస్తూ ముందుకు వెళతారో, పరి శాంతి పొందిన మనసు గలవారూ, పరిశుద్ధులూ, సకల ప్రాణులనూ ఆనందింపచేసే వారు, వారు సులభముగా పరమాత్మ పదమును చేరతారు.

శాన్తాః సమదృశః శుద్ధాః సర్వభూతానురఞ్జనాః
యాన్త్యఞ్జసాచ్యుతపదమచ్యుతప్రియబాన్ధవాః

ఎవరైతే భగవంతునికి ప్రీతి కలిగించే వారికి భక్తులుగా ఉంటారో, వారు పరమాత్మని చేరతారు

ఇత్యుత్తానపదః పుత్రో ధ్రువః కృష్ణపరాయణః
అభూత్త్రయాణాం లోకానాం చూడామణిరివామలః

ఉత్తాన పాదుని కొడుకైన ధృవుడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు. మూడు లోకములకు పరిశుద్ధమైన చూడామణి లాగ ప్రకాశిస్తున్నాడు

గమ్భీరవేగోऽనిమిషం జ్యోతిషాం చక్రమాహితమ్
యస్మిన్భ్రమతి కౌరవ్య మేఢ్యామివ గవాం గణః

అక్కడి నుంచి కాస్త పైకి వెళితే అద్భుతమైన వేగం కలిగి, జ్యోతిష చక్రం ఉంది. నక్షత్ర మండలం అంతా ధృవ మండలాన్ని ఆధారం చేసుకునే తిరుగుతుంది. 

మహిమానం విలోక్యాస్య నారదో భగవానృషిః
ఆతోద్యం వితుదఞ్శ్లోకాన్సత్రేऽగాయత్ప్రచేతసామ్

పరమాత్మ చేత పంపబడిన విమానం ఎక్కి పరమాత్మను చేరాడు ధృవుడు. ఈ మహిమను నారదుడు గానం చేసాడు. తన వీణను మీటుతూ ప్రచేతసుల యజ్ఞ్యములో ధృవుని ప్రభావాన్ని గానం చేసాడు. 

నారద ఉవాచ
నూనం సునీతేః పతిదేవతాయాస్తపఃప్రభావస్య సుతస్య తాం గతిమ్
దృష్ట్వాభ్యుపాయానపి వేదవాదినో నైవాధిగన్తుం ప్రభవన్తి కిం నృపాః

పరమ పతివ్రత అయిన సునీతి పుత్రుడు ఆమె తపః ప్రభావము వలన చేసిన తపస్సు చూడండి. తల్లి తపోనిష్ఠురాలు కాకుంటే ఇంత ఉత్తముడైన పుత్రుడు పుడతాడా? ఇది సార్వ కాలికమైన సత్యం. మనలో ఏదో ఒక రకమైన చాతుర్యముంటే అది మన గొప్ప కాదు, మన పెద్దలు చేసిన పుణ్యం, వారు చేసిన తపస్సు. వారు భగవదారాధన చేస్తుంటే ఆ ఫలం కొంత మనకు వస్తుంది. ఏడు తరాలలో ఏ ఒక్కరు మహానుభావులున్నా, వారు తమ ముందు ఏడు తరాల వారినీ, వెనక ఏడు తరాల వారిని పావనం చేస్తారు. వారి ఆశీర్వాదం ప్రభావం అలవాట్లు భక్తి ప్రపతీ మంగళాశాసనం మన మీద ప్రభావం పడి ఉంటుంది. అందుకే నారదుడు " పరమ పతివ్రత అయిన సునీతి పైత్ భక్తి అనే తపసు వలన్ పుట్టిన ధృవుని తపస్సు వలన సునీతి పొందిన ఉత్తమలోకాన్ని చూడు"
ఇలాంటి దాన్ని చూచినా, ధృవున్ని అనుసరించడం ఎవరి వలనా కాదు. మహానుభావులకీ యోగులకి కూడా ధృవుని స్థితి పొందటం సాధ్యం కాదు. ఇంక రాజులకు ఏమి సాధ్యమవుతుంది

యః పఞ్చవర్షో గురుదారవాక్శరైర్భిన్నేన యాతో హృదయేన దూయతా
వనం మదాదేశకరోऽజితం ప్రభుం జిగాయ తద్భక్తగుణైః పరాజితమ్

ఐదేళ్ళ వయసులోనే పిన తల్లి వాక్కుతో మనసు కలవరపడి నా ఆజ్ఞ్యను పొంది వనానికి వెళ్ళాడు. పరమాత్మను గానము చేసాడు. 

యః క్షత్రబన్ధుర్భువి తస్యాధిరూఢమన్వారురుక్షేదపి వర్షపూగైః
షట్పఞ్చవర్షో యదహోభిరల్పైః ప్రసాద్య వైకుణ్ఠమవాప తత్పదమ్

మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల వరకూ ఎవరినా ధృవునిలా ఆ పరమాత్మ పదాన్ని చేరుకుంటారా? ఐదారేళ్ళ పిల్లవాడు ఆరు నెలలలో చాలా తక్కువ రోజులలో పరమాత్మను ప్రసన్నం చేసుకుని పరమపదాన్ని పొందాడంటే ఆయన్ని ఎవరు తెలుసుకోగలరు అని ప్రాచేతసుల సభలో నారదుడు గానము చేసాడు

మైత్రేయ ఉవాచ
ఏతత్తేऽభిహితం సర్వం యత్పృష్టోऽహమిహ త్వయా
ధ్రువస్యోద్దామయశసశ్చరితం సమ్మతం సతామ్

నీవు ఏమేమి అడిగావో అది అంతా నీకు చెప్పాను. సజ్జనుల సమ్మతమైన ధృవుని చరితను నీకు చెప్పాను

ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్
స్వర్గ్యం ధ్రౌవ్యం సౌమనస్యం ప్రశస్యమఘమర్షణమ్

ధృవ చరిత్రం ఎంత గొప్పది? ఇది ధన్యమైనది. ధనమును అందించేది. కృతార్థమైంది. కీర్తినీ ఆయుస్షునూ కలిగించేది. పవిత్రమైనది, మంగళములకు నెలవు. గొప్పది, స్వర్గాన్నిచ్చేది. ధృవం (శాశ్వతం), మంచి మనసుని ప్రసాదించేది, అందరిచేతా కొనియాడబడేది, అందరి పాపాలను పోగొట్టేది. 

శ్రుత్వైతచ్ఛ్రద్ధయాభీక్ష్ణమచ్యుతప్రియచేష్టితమ్
భవేద్భక్తిర్భగవతి యయా స్యాత్క్లేశసఙ్క్షయః

పరమాత్మను పరమ ప్రియభక్తుడైన ధృవుడు చేసిన ఈ చరిత్రను శ్రద్ధగా విన్నావారికి "పరమాత్మ యందు భక్తి కలుగుతుంది". ఆ భక్తి వలన ప్రయోజనం ఏమిటి? ఆ భక్తి వలనే అన్ని కష్టాలు తొలగుతాయి. ఇప్పుడు మనం పడుతున్న కష్టాలకు కారణం భగత్భక్తి లేకపోవడమే. 

మహత్త్వమిచ్ఛతాం తీర్థం శ్రోతుః శీలాదయో గుణాః
యత్ర తేజస్తదిచ్ఛూనాం మానో యత్ర మనస్వినామ్

పరమపవిత్రమైన పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణాలు వింటే మనసు గలిగిన వారికి అభిమానమూ గౌరవమూ తేజస్సూ, కీర్తీ వస్తాయి. 

ప్రయతః కీర్తయేత్ప్రాతః సమవాయే ద్విజన్మనామ్
సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్

మనో నిగ్రహముతో ప్రొద్దున్నే లేచి బ్రాహ్మణోత్తముల సమూహములో కూర్చుని చదవండి. సాయంకాలము కూడా చదవండి. 

పౌర్ణమాస్యాం సినీవాల్యాం ద్వాదశ్యాం శ్రవణేऽథవా
దినక్షయే వ్యతీపాతే సఙ్క్రమేऽర్కదినేऽపి వా

పున్నమి నాడూ, అమావాస్యనాడు, ద్వాదశి నాడూ, శ్రవణా నక్షత్రం నాడూ, సంక్రమణం నాడూ, రథ సప్తమి నాడు గానీ (అర్క దినం నాడు గానీ)

శ్రావయేచ్ఛ్రద్దధానానాం తీర్థపాదపదాశ్రయః
నేచ్ఛంస్తత్రాత్మనాత్మానం సన్తుష్ట ఇతి సిధ్యతి

పరమాత్మ పాదములని ఆశ్రయించిన భక్తులు అందరినీ కూర్చోబెట్టి వినిపించాలి. తన విషయం ఏమీ ఆలోచించకుండా కోరికలు లేకుండా, సాంసారిక విషయభోగములయందు ఆసక్తి లేని వాడై పరిశుద్ధం మనసుక్డై సిద్ధులన్నీ పొందుతాడు. 

జ్ఞానమజ్ఞాతతత్త్వాయ యో దద్యాత్సత్పథేऽమృతమ్
కృపాలోర్దీననాథస్య దేవాస్తస్యానుగృహ్ణతే

ఇలాంటి పరమాత్మ గాధను చెప్పినా విన్నా తత్వం తెలియని వారికి తత్వ జ్ఞ్యానం కలుగుతుంది. మంచి దారిలో లేని వాడు మంచి దారిలో ఉంటాడు, విషాన్ని తీసుకునే వాడు (సంసారములో ఉండేవాడు) అమృతాన్ని (మోక్షాన్ని) పొందుతాడు
పరమాత్మ దీన నాధుడు, పరమ దయాళువు. అతని చరిత్ర చదువుకుంటే అలాంటి భక్తున్ని దేవతలు అనుగ్రహిస్తారు. 

ఇదం మయా తేऽభిహితం కురూద్వహ ధ్రువస్య విఖ్యాతవిశుద్ధకర్మణః
హిత్వార్భకః క్రీడనకాని మాతుర్గృహం చ విష్ణుం శరణం యో జగామ

కురుకుల భూషణా, నీకు ప్రసిద్ధమైనా, పవిత్రమైన పనులు చేసిన ధృవుని చరిత్రను చెపాను. చిన్నపిల్లవాడిగా ఉండి, ఆటబొమ్మలతో ఆటాడుకొనే వాడు, ఆటబొమ్మలనూ తల్లినీ ఇంటినీ విడిచిపెట్టి, పరమాత్మను శరణు వేడటానికి అరణ్యానికి వెళ్ళాడు.

Popular Posts