Followers

Wednesday 5 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఆరవ అధ్యాయం

ఋషిరువాచ
ఇతి తాసాం స్వశక్తీనాం సతీనామసమేత్య సః
ప్రసుప్తలోకతన్త్రాణాం నిశామ్య గతిమీశ్వరః

కాలసఞ్జ్ఞాం తదా దేవీం బిభ్రచ్ఛక్తిమురుక్రమః
త్రయోవింశతి తత్త్వానాం గణం యుగపదావిశత్

సోऽనుప్రవిష్టో భగవాంశ్చేష్టారూపేణ తం గణమ్
భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్

ప్రబుద్ధకర్మ దైవేన త్రయోవింశతికో గణః
ప్రేరితోऽజనయత్స్వాభిర్మాత్రాభిరధిపూరుషమ్

పరేణ విశతా స్వస్మిన్మాత్రయా విశ్వసృగ్గణః
చుక్షోభాన్యోన్యమాసాద్య యస్మిన్లోకాశ్చరాచరాః

హిరణ్మయః స పురుషః సహస్రపరివత్సరాన్
ఆణ్డకోశ ఉవాసాప్సు సర్వసత్త్వోపబృంహితః

జలములు రెండు రకాలు. ప్రకృతి  జలం, అండ జలం. ఈ అండజలం అండం సృష్టించిన తరువాత వచ్చి ఉండాలి. పుట్టిన బ్రహ్మగారు ఆ జలాన్ని తాగి సృష్టిస్తాడు. అండ సృష్టి కాగానే అండములో ఏర్పడినది జలము.
ఆపోవా ఇదమగ్ర అసీత్ - మొదలు జలమే ఉండెను.బ్రహ్మగారి కంటే ముందు కూడా ఉన్నది జలమే. 23 తత్వములు ఏర్పడ్డాయి. అవి అన్నీ అండముగా ఏర్పడ్డాయి. అందులో పరమాత్మ ప్రవేశించి పరస్పర చోదక శక్తిని ప్రవేశింపచేసినపుడు అవి అన్నీ కలిపి ఒక పురుషున్ని సృష్టి చేయడానికి ముందే అందులో జలం ఉంది. అలాంటి జలంలోనే స్వామి కొంతకాలం ఉన్నాడు. నారములలో ఉన్నడు కాబట్టి నారాయణుడు అంటారు

స వై విశ్వసృజాం గర్భో దేవకర్మాత్మశక్తిమాన్
విబభాజాత్మనాత్మానమేకధా దశధా త్రిధా

లోపల పురుషుడూ ఏర్పడ్డాడు, జలమూ ఏర్పడింది, దీని వలన ఈ గర్భము జ్ఞ్యానేంద్రియములు (దేవ) కర్మేంద్రియములు (కర్మ), ఆత్మ లేదా ఇంద్రియములు (దేవ) విషయములు ఆత్మ (దేవకర్మాత్మశక్తిమాన్). ఇలాంటి మూడు శక్తులకు తగిన రీతిగా విభజన చేయబడింది. తనను తాను ఎలా విభజించాడంటే - ఇంద్రియములు (10 దశద), సత్వ రజ తమ గుణాలు (త్రిధా) మనసు (ఏకధా). వీటిని పది ప్రాణములు అనొచ్చు, పది ఇంద్రియములూ అనొచ్చు, మూడు గుణములూ ,లేదా త్రివృత్ అనొచ్చు (అకార ఉకార మకారములు), ఏకమూ అంటే హృదయమూ అనొచ్చూ మనసూ అనొచ్చూ.

ఏష హ్యశేషసత్త్వానామాత్మాంశః పరమాత్మనః
ఆద్యోऽవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే

ఈ పురుషుడే (విరాట్ పురుషుడు),  అఖిల ప్రాణులకూ ఇదే ఆత్మ (ఇక్కడినుంచే మనందరికీ చలనం కలుగుతుంది). ఇది పరమాత్మ యొక్క ఆత్మ భాగము. దీనినే మనం పరమాత్మ యొక్క మొదటి అవతారం అంటాము. ఈయననే బ్రహ్మ అంటాము, విరాట్ పురుషుడు అంటాము. ఈ అవతారమందే సకల చరాచర ప్రాణుల సమూహం ఆవిర్భవించబడుతుంది, ప్రేరేపించబడుతుంది, సృష్టించబడుతుంది. చేతనాచేతనముల స్వరూప స్వభావాలు ఇక్కడే నిక్షిప్తం చేయబడుతున్నాయి

సాధ్యాత్మః సాధిదైవశ్చ సాధిభూత ఇతి త్రిధా
విరాట్ప్రాణో దశవిధ ఏకధా హృదయేన చ

సాధ్యాత్మః  - భోక్తృవర్గం - అనుభవించేది సాధిదైవశ్చ - భోగ్యవర్గము - అనుభవించబడేది సాధిభూత - కరణములు (ఇంద్రియములు). శరీరేంద్రియ విషభేదాత్ అంటారు తర్కములో. శరీర ఇంద్రియ విషయములనే భోక్తృవర్గం, భోగ్యవర్గము, కరణములు.
మొదలు తాను అంతటా సంచరించాలి కాబట్టి దశవిధాలైన ప్రాణ వాయువును సృష్టించాడు. లోపల ఉండి మనచే పని చేయించే వాయువులు ఐదు. ఇంద్రియాలలో ఉండి పని చేయించే వాయువులు ఐదు. ప్రతీ కదలికా వాయువు వలననే జరుగుతుంది. వాక్ ద్వారంలో ఉండే వాయువు నాగము. కనులు తెరుచుట మూయుటలో కూర్మ వాయువు, తుమ్మేప్పుడు వచ్చే వాయువు క్రకరం ఆవలించినపుడు దేవదత్తము. చనిపోయిన తరువాత కూడా వదలని వాయువు ధనంజయ.
అలాగే హృదయాన్ని సృష్టించాడు.

స్మరన్విశ్వసృజామీశో విజ్ఞాపితమధోక్షజః
విరాజమతపత్స్వేన తేజసైషాం వివృత్తయే

23 తత్వముల అధిపతి ఈ విరాట్ పురుషుడు, పరమాత్మ, వాటి ప్రార్థనను బట్టి అనుగ్రహించాడు. వాటికి కావలసిన శక్తిని ప్రసాదించాడు. విరాట్ పురుషునిలో సంకల్పించే శక్తి కలిగింపచేసాడు. తక్కినవన్నీ తమ పనులు మానేసి తమ శక్తిని బుద్ధికిస్తేనే బుద్ధి పని చేస్తుంది. అలాగే ఇంద్రియములు తాము చేయవలసిన పనులు మానేసి ప్రవృత్తి నుంచి నివృత్తికి రావడమే తపస్సు. అన్ని ఇంద్రియాలు మూసుకుని ఉండటమే తపస్సు. పరమాత్మ విరాట్ పురుషునికి ఆలోచించగల శక్తిని ప్రసాదించాడు. 23 గణముల వివృత్తి (ప్రసరించుట) చేయుటకు ఆలోచింపచేసాడు.

అథ తస్యాభితప్తస్య కతిధాయతనాని హ
నిరభిద్యన్త దేవానాం తాని మే గదతః శృణు

ఎపుడైతే పరమాత్మ అనుగ్రహంతో ఇవన్నీ కలిసి ఆలోచించడం మొదలుపెట్టాయో, 23 గణములలో ఒక్కొక్క గణం ప్రవర్తించడం వలన కలిగిన మార్పు, ఏర్పడిన స్వరూపం, వాటిని చెబుతున్నాను విను

తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలోऽవిశత్పదమ్
వాచా స్వాంశేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే

మొదలు పని చేయాలన్న శక్తి కావాలి, ఆహారం తీసుకోవాలి. ఆకలవుతుందని అనాలి. ఈ రెంటికీ ప్రథానం ఆస్యం, నోరు ప్రథానం. ఈ నోరుకు అగ్ని ప్రథాన దేవత. దిక్పాలకుడు అగ్ని. మొదలు వాకు ఏర్పడింది, అందులో అగ్ని ప్రవేశించాడు. దాని వలన మాట్లాడే శక్తి ప్రవేశించింది

నిర్భిన్నం తాలు వరుణో లోకపాలోऽవిశద్ధరేః
జిహ్వయాంశేన చ రసం యయాసౌ ప్రతిపద్యతే

దవడల కింది భాగాన్ని తాఉ అంటారు. దీనికి అధిదేవత వరుణుడు. నిప్పు ఎక్కడ ఉంటే అక్కడ నీరు ఉంటుంది. అగ్ని నుండే నీరు పుట్టింది. వరుణాంశంతో రసమును జిహ్వ గ్రహిస్తుంది. జిహ్వ అనేది వరుణుని అంశము. ఆయన రసాన్ని జిహ్వతో స్వీకరిస్తాడు

నిర్భిన్నే అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదమ్
ఘ్రాణేనాంశేన గన్ధస్య ప్రతిపత్తిర్యతో భవేత్

తరువాత ఈ మహాపురుషునికి నాసికా రంధ్రం ఏర్పడింది. అందులో అశ్వనీ దేవతలు ప్రవేశించారు. దాని తరువాత ఈ నాసిక లో ఘ్రాణ ఇంద్రియం ఆవిర్భవించింది. దీనితో గంధమును స్వీకరిస్తున్నాము.

నిర్భిన్నే అక్షిణీ త్వష్టా లోకపాలోऽవిశద్విభోః
చక్షుషాంశేన రూపాణాం ప్రతిపత్తిర్యతో భవేత్

తరువాత స్వామికి కన్నులు ఏర్పడ్డాయి. త్వష్ట అనే లోకపాలకుడు ప్రవేశించాడు. దానిలో చక్షు ఇంద్రియం ప్రవేశించింది

నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకపాలోऽనిలోऽవిశత్
ప్రాణేనాంశేన సంస్పర్శం యేనాసౌ ప్రతిపద్యతే

తరువాత చర్మం ఏర్పడింది.ఇందులో వాయువు ప్రవేశించాడు,. ఈ వాయువులో ఉన్నది త్వక్ అనే ఇంద్రియం. ఈ ఇంద్రియం స్పర్శను గ్రహిస్తుంది. ఇది ప్రాణం (వాయువు). స్పర్శ జ్ఞ్యానం కలగాలంటే ప్రాణ వాయువు ఉండాలి.

కర్ణావస్య వినిర్భిన్నౌ ధిష్ణ్యం స్వం వివిశుర్దిశః
శ్రోత్రేణాంశేన శబ్దస్య సిద్ధిం యేన ప్రపద్యతే

దిక్కులనే దేవతలు అధిపతిగా కర్ణ రంధ్రాలు ఏర్పడ్డాయి, దాని ఇంద్రియం శ్రోత్రం. ఈ శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది

త్వచమస్య వినిర్భిన్నాం వివిశుర్ధిష్ణ్యమోషధీః
అంశేన రోమభిః కణ్డూం యైరసౌ ప్రతిపద్యతే

త్వక్ ఇంద్రియం (ఇది వేరు చర్మం వేరు). దురద వేస్తే తెలిసేది త్వక్ వలన. ఇందులో దేవత ఔషధీ. దీని వలన మనకు రోమములతో కండూయనం (దురద) తెలుస్తుంది. అవి లేకపోతే దురద కలిగినా, కలిగినట్లు తెలీదు.

మేఢ్రం తస్య వినిర్భిన్నం స్వధిష్ణ్యం క ఉపావిశత్
రేతసాంశేన యేనాసావానన్దం ప్రతిపద్యతే

జననీంద్రియానికి అధిపతి ప్రజాపతి. రేతస్సుతో ప్రజాపతి ఆనందములాంటిది పొందుతాడు

గుదం పుంసో వినిర్భిన్నం మిత్రో లోకేశ ఆవిశత్
పాయునాంశేన యేనాసౌ విసర్గం ప్రతిపద్యతే

మిత్రుడు అధిదేవతగా పాయు ఇంద్రియం విసర్జించడానికి ఉపయోగపడుతుంది

హస్తావస్య వినిర్భిన్నావిన్ద్రః స్వర్పతిరావిశత్
వార్తయాంశేన పురుషో యయా వృత్తిం ప్రపద్యతే

చేతులకి ఇంద్రుడు అధిదేవత, పాణి అనే ఇంద్రియం. బ్రతుకు తెరువుకి (వార్తయాంశేన ) ఈ చేతులు ఆధారం

పాదావస్య వినిర్భిన్నౌ లోకేశో విష్ణురావిశత్
గత్యా స్వాంశేన పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే

విష్ణువు పాదములకు అధిదేవత, పాదం అనేది ఇంద్రియం. చేరవలసిన చోటుకు చేరుస్తుంది. మనందరికి గమ్యాన్ని చేర్చేది పాదములు (అలాగే మనందరి గమ్యానికి చేర్చేది విష్ణువే)

బుద్ధిం చాస్య వినిర్భిన్నాం వాగీశో ధిష్ణ్యమావిశత్
బోధేనాంశేన బోద్ధవ్యమ్ప్రతిపత్తిర్యతో భవేత్

తరువాత బుద్ధి ఏర్పడింది. దానికి వాగీశుడు (బ్రహ్మ) అధిపతి. బోధన అనే అంశముతో తెలియవలసిన దాన్ని తెలుసుకుంటాము.

హృదయం చాస్య నిర్భిన్నం చన్ద్రమా ధిష్ణ్యమావిశత్
మనసాంశేన యేనాసౌ విక్రియాం ప్రతిపద్యతే

హృదయానికి చంద్రుడు అధిపతి.  (చంద్రమా మనసో జాతా). ఇందులో ఇంద్రియం పేరు మనసు. ఈ మనసు వికారం పొందుతుంది. దాని స్వభావమే వికారం పొందడం

ఆత్మానం చాస్య నిర్భిన్నమభిమానోऽవిశత్పదమ్
కర్మణాంశేన యేనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే

తరువాత అంతఃకరణం, (దీనినే అభిమానం అహంకారం అని కూడా అంటారు) అధిదేవత శంకరుడు, ఆయన అంతఃఅకరణ అధిస్టాత. ఈ అంతఃకరణం ఏ పని చేయాలో దాన్ని  నిశ్చయిస్తుంది. బుద్ధి ఆలోచిస్తుంది, మనసు సంకల్పిస్తుంది. ఆలోచించిన దాన్ని నిశ్చయించేది అంతఃకరణం

సత్త్వం చాస్య వినిర్భిన్నం మహాన్ధిష్ణ్యముపావిశత్
చిత్తేనాంశేన యేనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే

సత్వం (చిత్తం) లో కి ఆత్మాశ ప్రవేశిస్తే చిత్తమనే ఇంద్రియం ప్రవేశిస్తే విజ్ఞ్యానం ఏర్పడుతుంది. ప్రతీ దానిలో ఉన్న సూక్ష్మ పరిశీలనాత్మక బుద్ధిని చిత్తం అంటారు. పరిశీలించే పని చిత్తానిది. నిశ్చయించే పని అంతఃకరణానిది ఆలోచించే పని బుద్ధిది, మార్పు చెందే పని మనసుది. ఈ నాలుగూ వేరు.

శీర్ష్ణోऽస్య ద్యౌర్ధరా పద్భ్యాం ఖం నాభేరుదపద్యత
గుణానాం వృత్తయో యేషు ప్రతీయన్తే సురాదయః

ఈయన శిరస్సు నుండి ద్వి లోకం (అంతరిక్షం) పాదములనుండి భూమి, నాభి నుండి ఆకాశం. అంతరిక్షం భూమి ఆకాశం, ఈ మూడులోకాల (భూః భువః సువః - ద్విలోకం భూలోకం అంతరిక్షం),  ఈ మూడులోకాలూ మూడు గుణములు కలవారికి నిలయాలు. సత్వ గుణం ఉన్నవారు, దేవతలు ఆకాశంలో, రజోగుణం ఉన్న మానవాది జీవులు భూమి మీద, భూత ప్రేత పిశాచాలు, తమో గుణం కలవారు అంతరిక్షంలో.

ఆత్యన్తికేన సత్త్వేన దివం దేవాః ప్రపేదిరే
ధరాం రజఃస్వభావేన పణయో యే చ తానను

పూర్తి సత్వ గుణంతో దేవతలు ద్విలోకాన్ని చేరుతున్నారు. మానవులు (పణయులు - బేరంతో బ్రతికేవారు - వినిమయంతో బ్రతికేవారు), మానవులని అనుసరించే పశు పక్షాదులు భూమి మీద

తార్తీయేన స్వభావేన భగవన్నాభిమాశ్రితాః
ఉభయోరన్తరం వ్యోమ యే రుద్రపార్షదాం గణాః

మూడవ గుణం (తమో గుణం ) ఉన్నవారు పరమాత్మ యొక్క నాభిని ఆశ్రయించారు (ఖం) అంతరిక్షాన్ని ఆశ్రయించారు. ఈ భూమికీ ఆకాశానికి మధ్యనున్న దానిని అంతరిక్షం అంటాం, అక్కడ రుద్ర పార్షదులు ఉంటాయి.

ముఖతోऽవర్తత బ్రహ్మ పురుషస్య కురూద్వహ
యస్తూన్ముఖత్వాద్వర్ణానాం ముఖ్యోऽభూద్బ్రాహ్మణో గురుః

ముఖం యొక్క వ్యాపారం ప్రధానముగా కలవారు బ్రాహ్మణులు (చదువు చెప్పే వారు చదువుకొనేవారు) . బ్రాహ్మణుడు ముఖముతో (అధ్యాయంతో) బ్రతుకుతారు. అందుకు బ్రాహ్మణుడు "ముఖ్యుడు" అయ్యాడు

బాహుభ్యోऽవర్తత క్షత్రం క్షత్రియస్తదనువ్రతః
యో జాతస్త్రాయతే వర్ణాన్పౌరుషః కణ్టకక్షతాత్

క్షత్రియుడు అందరినీ పాలించేవాడు. బాహువులతో బ్రతికేవారు క్షత్రియులు. ఆపద నుండి కలిగిన గాయ్ము నుండి ఎవరు కాపాడతారో వారు క్షత్రియులు

విశోऽవర్తన్త తస్యోర్వోర్లోకవృత్తికరీర్విభోః
వైశ్యస్తదుద్భవో వార్తాం నృణాం యః సమవర్తయత్

పరమాత్మ ఊరువులు ధాన్యమునకూ ధనమునకూ మూలము, ప్రతీ చోటా ప్రవేశించేవారు వైశ్యులు. అందుకు పిక్కబలం ఉండాలి. అందుకే ఊరువునుంచి పుట్టారు అని అంటారు

పద్భ్యాం భగవతో జజ్ఞే శుశ్రూషా ధర్మసిద్ధయే
తస్యాం జాతః పురా శూద్రో యద్వృత్త్యా తుష్యతే హరిః

తక్కిన వారు వారి వారి పని సక్రమంగా చేయాలంటే వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు అందించగల వారు ఉండాలి. అందువలన ధర్మాన్ని కాపాడేవారు శూద్రులు. అందుకే వారు పుట్టింది పాదముల నుండి, అంటే గమనాగమన వ్యాపారంతోటే వారి పని ఉంటుంది. తక్కిన మూడు వర్ణాల సిద్ధికి కావల్సింది శూద్రులు.

ఏతే వర్ణాః స్వధర్మేణ యజన్తి స్వగురుం హరిమ్
శ్రద్ధయాత్మవిశుద్ధ్యర్థం యజ్జాతాః సహ వృత్తిభిః

ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకంటే పరమాత్మ శూద్ర వృత్తితోనే సంతోషిస్తాడు. విష్ణుపురాణం చివర శూద్ర సాధుః - అందరికంటే ఉత్తముడు శూద్రుడే అని వ్యాసుడు ప్రకటిస్తాడు, స్త్రీ సాధుః, కలిసాధుః, స్త్రీ, శూదురులు, కలి ఉత్తమం. యమ నియమాది నియమాలేమీ లేకుండా సేవ ద్వారా ముక్తి పొందేవాడు శూద్రుడు, భర్త సేవచే మోక్షం పొందేవారు స్త్రీలు, స్మరణ మాత్రంచే మోక్షం వచ్చే యుగం కలియుగం. ఈ నాలుగు వర్ణాలు తమ తమ ధర్మాలతో తమ అధిపతి అయిన పరమాత్మ ఆరాధిస్తారు. వికారం పొందే మనసు వికారం పొందకుండ పరిశుద్ధి పొందేందుకు  పరమాత్మ ఆరాధన శ్రద్ధగా చేస్తారు

ఏతత్క్షత్తర్భగవతో దైవకర్మాత్మరూపిణః
కః శ్రద్దధ్యాదుపాకర్తుం యోగమాయాబలోదయమ్

శరీర ఇంద్రియ విషయములు ( భోక్తు భోగ్యం భోక్త ) యొక్క విశ్వరూపం. సృష్టియొక్క రూపం. పరమాత్మ యొక్క అద్వితీయమైన యోగమాయా బలం ఎవరు తెలియగలరు, ఎవరు నమ్మగలరు.

తథాపి కీర్తయామ్యఙ్గ యథామతి యథాశ్రుతమ్
కీర్తిం హరేః స్వాం సత్కర్తుం గిరమన్యాభిధాసతీమ్

ఆ యోగమాయా బలాన్ని సంపూర్ణంగా ఎవరూ చెప్పలేరు. నేను కూడ ఎంత విన్నానో, విన్న దానిలో ఎంత గుర్తుందో అంత నీకు చెబుతున్నాను. ఈ మాత్రం చెప్పడానికి కారణం, నా వాక్కు ఆ కాసేపయిన వేరే విషయాల వైపుకు వెళ్ళకుండా ఉంటుందని చెబుతున్నాను. ఆ నాలుకకు కీర్తి ఇప్పిద్దామని చెబుతున్నాను. ఇతరమైన వాటిని చెప్పడంతో దుష్టమైన వాక్కును (గిరం) సన్మానించడానికి ఈ మాట చెబుతున్నాను. వేరే మాటలు చెప్తే అది అసత్తవుతుంది (అన్యాభిధాసతీమ్)

ఏకాన్తలాభం వచసో ను పుంసాం సుశ్లోకమౌలేర్గుణవాదమాహుః
శ్రుతేశ్చ విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాముపసమ్ప్రయోగమ్

ప్రపంచంలో మానవుల వాక్కుకు ఉన్న ఒకే ఒక లాభం ఏమిటంటే పరమాత్మ గుణానుసంధానమే. అంటే మిగతావన్నీ నష్టమన్నమాట. మన చెవులకు లాభం, పండితులు చెప్పే కథా సుధలను గ్రోలుట చెవులకు లాభం, పలుకుట నోటికి లాభం

ఆత్మనోऽవసితో వత్స మహిమా కవినాదినా
సంవత్సరసహస్రాన్తే ధియా యోగవిపక్కయా

ఇలా అండములో ఆవిర్భవించిన బ్రహ్మ ఎంతో కాలం అక్కడున్న నీటిలోనే ఉండి, యోగంతో బుద్ధి పరిపక్వం చేసుకుని పరమాత్మ ప్రభావాన్ని తెలుసుకోలేమని తెలుసుకున్నాడు

అతో భగవతో మాయా మాయినామపి మోహినీ
యత్స్వయం చాత్మవర్త్మాత్మా న వేద కిముతాపరే

ప్రపంచంలో మహామాయావులని కూడా మోహం చేసేది పరమాత్మ మాయ. స్వయముగా తాను తన స్వరూపాని మనకు చెప్పడానికి, బ్రహ్మగారికే అర్థం కాలేదు. (పరమాత్మే బ్రహ్మ అయినా, మనందరికీ ప్రతినిధి అవడం వలన, తన మార్గం వ్యాపింపచేసే వాడైనా, పరమాత్మ మహిమ తెలియరాలేదు), ఇంక మిగతా వరి గురించి చెప్పేది ఏమి ఉంది.

యతోऽప్రాప్య న్యవర్తన్త వాచశ్చ మనసా సహ
అహం చాన్య ఇమే దేవాస్తస్మై భగవతే నమః

ఎక్కడిదాకా వాక్కూ మనసు వెళ్ళి, అందలేదని తిరిగి వస్తాయో, అందులో బ్రహ్మాది దేవతలు కూడా ఎక్కడిదాకా వెళ్ళి, తెలియక వెనక్కి వస్తారో, ఆ భగవంతునికి నమస్కారం. వేదములకూ వేదజ్ఞ్యులకూ, దేవతలకూ, వారి వాక్కులకూ మనసుకూ అందని పరమాత్మకు నమస్కారం

Popular Posts