Followers

Friday 7 February 2014

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
నిర్వేదవాదినీమేవం మనోర్దుహితరం మునిః
దయాలుః శాలినీమాహ శుక్లాభివ్యాహృతం స్మరన్

నిర్వేదాన్ని పొందిన, బాధపడుతున్న దేవహూతిని చూచి జాలిపడి, పరమాత్మ మాట్లాడిన దాన్ని గుర్తు చేసుకుని, స్మరించుకుని, ఇలా అన్నాడు

ఋషిరువాచ
మా ఖిదో రాజపుత్రీత్థమాత్మానం ప్రత్యనిన్దితే
భగవాంస్తేऽక్షరో గర్భమదూరాత్సమ్ప్రపత్స్యతే

రాజపుత్రీ, నీవు ఉత్తమురాలవు, నీవు అలా బాధపడకూడదు. కొడుకు కావలనుకున్న నీకు త్వరలోనే నాశములేని సాక్షాత్ భగవానుడే కుమారుడుగా పుట్టబోతున్నాడు.

ధృతవ్రతాసి భద్రం తే దమేన నియమేన చ
తపోద్రవిణదానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ

ఇపుడు నీవు గర్భమను స్వీకరించే ఉన్నావు. (భార్య గర్భవతి అయిన సంగతి మొదట భర్తకే తెలుస్తుంది). వ్రతమును ధరించి ఉన్నావు. నీకు మంగళం కలుగుతుంది. నీవు గ్రభవతిగా ఉన్న కాలములో తపసుతో ఇంద్రియ నిగ్రహముతో దానముతో శ్రద్ధతో భగవంతుని సేవించు. అప్పుడు పరమాత్మ నీకు పుత్రునిగా పుడతాడు. కపిలావతారం ఆవేశావతారం. అంశావతారం కళావతారం ఆవేశావతరం అని అవతారలలో రకాలు. కలగబోయే కుమారునిలో పరమాత్మ ఆవేశించడానికి పూర్వ రంగము ఏర్పాటు చేయాడానికి దమము తపస్సుతో దానముతో నియమముతో శ్రద్ధతో ఈ ఐదింటితో పరమాత్మను ఆరాధించు

స త్వయారాధితః శుక్లో వితన్వన్మామకం యశః
ఛేత్తా తే హృదయగ్రన్థిమౌదర్యో బ్రహ్మభావనః

అలా నీ చేతా ఆరాధించబడిన పరమాత్మ నా కీర్తి విస్తరింపచేస్తూ, నీ ఉదరము నుండి పుట్టే కొడుకు బ్రహ్మ భావనుడు (బ్రహ్మగా భావించబడిన వాడు) నీ మాయను చేధిస్తాడు. హృదయ గ్రంధి అంటే అహంకారం. అహంకారం తొలగాలి. దేహాత్మభావం పోవాలి. పరమాత్మ నీ హృదయగ్రంధిని చేదిస్తాడు

మైత్రేయ ఉవాచ
దేవహూత్యపి సన్దేశం గౌరవేణ ప్రజాపతేః
సమ్యక్శ్రద్ధాయ పురుషం కూటస్థమభజద్గురుమ్

ఇలా కర్దముడు చెప్పిన మాట విన్న దేవహూతి, ఆ మాటను నమ్మి సర్వ వ్యాపకుడైన, ఎపుడూ ఒకే రకముగా ఉండే పరమాత్మను ఆరాధించింది

తస్యాం బహుతిథే కాలే భగవాన్మధుసూదనః
కార్దమం వీర్యమాపన్నో జజ్ఞేऽగ్నిరివ దారుణి

కొంతకాలము తరువాత పరమాత్మ తన అంశతో కర్దమ ప్రజాపతి వీర్యములో దారువులో (కట్టెలో) అగ్ని ఉంటుందో అలా చేరాడు

అవాదయంస్తదా వ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాః
గాయన్తి తం స్మ గన్ధర్వా నృత్యన్త్యప్సరసో ముదా

ఇలా కర్దముని వీర్యము ద్వారా దేవహూతిలో పరమాత్మ ప్రవేశించడం తెలుసుకున్న దేవతలు ఆకాశములో మంగళ వాద్యాలను మ్రోగించారు. గంధర్వులు గానం చేసారు. అప్సరసలు నృత్యం చేసారు

పేతుః సుమనసో దివ్యాః ఖేచరైరపవర్జితాః
ప్రసేదుశ్చ దిశః సర్వా అమ్భాంసి చ మనాంసి చ

కింద ఉన్న వీరిపై దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అన్ని దిక్కులూ జలములూ అందరి మనస్సులూ ప్రసన్నమయ్యాయి.

తత్కర్దమాశ్రమపదం సరస్వత్యా పరిశ్రితమ్
స్వయమ్భూః సాకమృషిభిర్మరీచ్యాదిభిరభ్యయాత్

ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ, మరీచ్యాది ప్రజాపతులు అమ్మవారితో బాటుగా అక్కడికి వేంచేసారు

భగవన్తం పరం బ్రహ్మ సత్త్వేనాంశేన శత్రుహన్
తత్త్వసఙ్ఖ్యానవిజ్ఞప్త్యై జాతం విద్వానజః స్వరాట్

సాత్వికాంశతో వచ్చిన పరమాత్మ ఎందుకు వస్తున్నాడో స్యంభువైన బ్రహ్మ తెలుసుకున్నాడు. కేవల జ్ఞ్యాన ప్రదమైనది కపిలావతారం. తత్వములెన్నో తెలియని (తత్వములెన్ని అనే సంఖ్య తెలియని) వారి కొరకు సంఖ్యా నిర్ణయం చేయడానికి పరమాత్మ పుడుతున్న్నడు, అని తెలుసుకున్నాడు

సభాజయన్విశుద్ధేన చేతసా తచ్చికీర్షితమ్
ప్రహృష్యమాణైరసుభిః కర్దమం చేదమభ్యధాత్

పరమాత్మ చేయదలచుకున్న దాన్ని  (స్తుస్తిస్తూ)అన్ని ప్రాణాలూ (ఇంద్రియాలూ) సంతోషించాయి. కర్దముడితో కూడా ఇలా మాట్లాడాడు

బ్రహ్మోవాచ
త్వయా మేऽపచితిస్తాత కల్పితా నిర్వ్యలీకతః
యన్మే సఞ్జగృహే వాక్యం భవాన్మానద మానయన్

నీవు నిజముగా కృతజ్ఞ్యతను తెలిపావు. పుత్రునిగా నీ ప్రతిక్రియనూ ధర్మాన్నీ కపటములేకుండా నిర్వహించావు. నీవు నేను చెప్పిన మాట స్వీకరించావు. నా మాటను గౌరవించావు.

ఏతావత్యేవ శుశ్రూషా కార్యా పితరి పుత్రకైః
బాఢమిత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచః

కుమారులు తండ్రికి చేయవలసిన సేవ ఒకటే. తండ్రిగారు చెప్పిన మాటను గౌరవముతో ఆమోదించుటే.

ఇమా దుహితరః సత్యస్తవ వత్స సుమధ్యమాః
సర్గమేతం ప్రభావైః స్వైర్బృంహయిష్యన్త్యనేకధా

నేను సృష్టిని విస్తరించమని చెప్పిన నా సంకల్పాన్ని పాటించావు. తమ దివ్యమైన ప్రభావముతో ఈ సృష్టిని ఎన్నో రకాలుగా విస్తరిస్తారు

అతస్త్వమృషిముఖ్యేభ్యో యథాశీలం యథారుచి
ఆత్మజాః పరిదేహ్యద్య విస్తృణీహి యశో భువి

వీరందరికీ తగిన భర్తలను ఏరి నిశ్చయించి జరపవలసింది. వారి వారి ఇష్టాలను, స్వభావాన్ని బట్టి వివాహము చేయి. అలాంటి వివాహం జరిపి నీ కీర్తిని విస్తరింపచేయి

వేదాహమాద్యం పురుషమవతీర్ణం స్వమాయయా
భూతానాం శేవధిం దేహం బిభ్రాణం కపిలం మునే

నేను తెలుసుకున్నాను. త్వరలో, పరమాత్మ, ఆదిపురుషుడు, అన్ని భూతములకూ నిధి అయిన స్వామి, కపిల దేహమును ధరించి వస్తున్నాను. బ్రహ్మాస్వాదన పరుడు, పరమాత్మ స్వరూపం బోధించేవాడు, ఆ స్వరూపాన్ని తెలుసుకున్న వారిని ఆరాధించేవాడు. తోక కనులు గిట్టలు ముఖము పృష్ట భాగం ఉదరము దగ్గర తెల్ల మచ్చలుండి మిగతా చోట్ల గోధుమ రంగులో ఉన్న ఆవులను కపిల గోవులంటారు. ఇది రజస్సు కాదూ, తమస్సూ కాదూ, తెలుపూ కాదూ. అలాంటిది కపిల దేహం.

జ్ఞానవిజ్ఞానయోగేన కర్మణాముద్ధరన్జటాః
హిరణ్యకేశః పద్మాక్షః పద్మముద్రాపదామ్బుజః

దేవహూతీ, ఈయన జ్ఞ్యాన విజ్ఞ్యాన యోగముతో కర్మలను తొలగిస్తూ, బంగారు రంగులో పద్మము వంటి పాదములు కలవాడు నీ గర్భములో ప్రవేసించాడు. కైటబున్ని సంహరించినవాడు

ఏష మానవి తే గర్భం ప్రవిష్టః కైటభార్దనః
అవిద్యాసంశయగ్రన్థిం ఛిత్త్వా గాం విచరిష్యతి

అజ్ఞ్యానాన్ని సంహరిస్తూ భూమండలం అంతా సంచరిస్తాడు
అయం సిద్ధగణాధీశః సాఙ్ఖ్యాచార్యైః సుసమ్మతః
లోకే కపిల ఇత్యాఖ్యాం గన్తా తే కీర్తివర్ధనః

ఇతను సిద్ధగణములకు అధిపతి, సాంఖ్య జ్ఞ్యానము గల ఆచార్యులందరు ఇతన్ని ఆచరిస్తారు. ఈయన కపిలుడన్న పేరుతో లోకములో ప్రసిద్ధి పొంది నీ కీర్తిని పెంచుతాడు

మైత్రేయ ఉవాచ
తావాశ్వాస్య జగత్స్రష్టా కుమారైః సహనారదః
హంసో హంసేన యానేన త్రిధామపరమం యయౌ

ఇలా దేవహూతీ కర్దములతో మాట్లాడి, తన వాహమైన హంసతో, ఆకాశ మార్గములో (హంసేన యానేన) తన సత్యలోకమునకు చేరాడు. (బ్రహ్మ పేరే హంస, హంస వాహనములో వెళ్ళాడు, వెళ్ళిన దారి కూడా హంస. హంస మార్గం అంటే విశుద్ధమైన జ్ఞ్యాన మార్గములో వెళ్ళాడు). సత్యమూ జ్ఞ్యానమూ తపస్సు ఉండే లోకం సత్యలోకం. దానికి వెళ్ళాలంటే హంసలే వెళ్ళగలరు. సంసారములో ఉండి కూడా మురికి అంటకుండా పరమాత్మనే చూసే వారిని హంస అంటారు. మనలాగే లొకములో ఉండి పెరిగీ, "ఇదంతా ఆశించవలసినదీ అనుసరించవలసినదీ అభిలషించవలసినదీ కాదు" అని తెలుసుకుని వాటికి దూరముగా ఉండే వారు పరమ హంసలు. బ్రహ్మగారు హంస. జ్ఞ్యాన మార్గముతో జ్ఞ్యాన వాహనుడై తన లోకానికి వెళ్ళారు.

గతే శతధృతౌ క్షత్తః కర్దమస్తేన చోదితః
యథోదితం స్వదుహిత్ః ప్రాదాద్విశ్వసృజాం తతః

ఇలా చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయిన తరువాత, బ్రహ్మ చెప్పినట్లుగా తన పుత్రికలను ప్రజాపతులకి ఇచ్చి వివాహం చేసాడు

మరీచయే కలాం ప్రాదాదనసూయామథాత్రయే
శ్రద్ధామఙ్గిరసేऽయచ్ఛత్పులస్త్యాయ హవిర్భువమ్
పులహాయ గతిం యుక్తాం క్రతవే చ క్రియాం సతీమ్
ఖ్యాతిం చ భృగవేऽయచ్ఛద్వసిష్ఠాయాప్యరున్ధతీమ్
అథర్వణేऽదదాచ్ఛాన్తిం యయా యజ్ఞో వితన్యతే
విప్రర్షభాన్కృతోద్వాహాన్సదారాన్సమలాలయత్

మరీచ ప్రజాపతికి కల అనే పుత్రికతో,
అనసూయను అత్రికి ఇచ్చి
శ్రద్ధను అంగీరసునికి
పులస్త్యునికి హవిర్భూ అనే పుత్రికను
పులహునికి గతినీ
క్రతువుకూ క్రియను
బృగువుకి ఖ్యాతిని
అరుంధతిని వశిష్టునికి
అధర్వునికి శాంతిని
శాంతి లేకుండా యజ్ఞ్యము ఉండదు.యజ్ఞ్య ప్రక్రియను బోధించినది అధర్వణ వేదం.
అల్లుళ్ళను పుత్రికలనూ లాలించాడు.

తతస్త ఋషయః క్షత్తః కృతదారా నిమన్త్ర్య తమ్
ప్రాతిష్ఠన్నన్దిమాపన్నాః స్వం స్వమాశ్రమమణ్డలమ్

వారు వివాహం చేసుకుని అత్త మామలకు నమస్కరించి ఆశ్రమాలకు బయలుదేరారు.

స చావతీర్ణం త్రియుగమాజ్ఞాయ విబుధర్షభమ్
వివిక్త ఉపసఙ్గమ్య ప్రణమ్య సమభాషత

కపిలుడు పుట్టాడని తెలుసుకుని, ఆయన పరమాత్మ అని తెలుసుకుని, ఒంటిగా ఉన్నప్పుడు దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు

అహో పాపచ్యమానానాం నిరయే స్వైరమఙ్గలైః
కాలేన భూయసా నూనం ప్రసీదన్తీహ దేవతాః

పరమాత్మను స్తోత్రం చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. 1. పరమాత్మను పొగడటం 2. లోకాన్ని నిందించడం 3. దేవతలు మానవులకు ఇచ్చే వరముల గురించి చెబుతూ, అవి మనలను ఎలా బంధిస్తున్నాయో చెప్పడం.
తాము ఆచరించిన అశుభ కర్మలతో నరకములలో మగ్గుతున్నవారికి ఎంతో కాలం తరువాత దేవతలు ప్రసన్నమవుతారు.

బహుజన్మవిపక్వేన సమ్యగ్యోగసమాధినా
ద్రష్టుం యతన్తే యతయః శూన్యాగారేషు యత్పదమ్

పరమాత్మను చూడటానికి ఎన్నో జన్మల తరువాత కలిగిన బుద్ధితో ప్రయత్నిస్తారు. అలా యోగం కుదిరితే అంతర్యామిగా ఉన్న పరమాత్మని చూడగలరు

స ఏవ భగవానద్య హేలనం న గణయ్య నః
గృహేషు జాతో గ్రామ్యాణాం యః స్వానాం పక్షపోషణః

ఇలా ఎన్నో జన్మల సాధనతో ప్రత్యక్షమయ్యే పరమాత్మే, మా అజ్ఞ్యానాన్ని లెక్కించకుండా, మావంటి పామరుల జ్ఞ్యానములేని  వారి ఇంట నీవు పుట్టావు. నీకు కూడా పక్షపాతం ఉంది. నీ పక్షం వారిని పోషిస్తావు. (నన్ను సేవించే వాడు ఎన్ని చెడ్డపనులు చేసినా మంచివాడే అని స్వామి అన్నాడు)

స్వీయం వాక్యమృతం కర్తుమవతీర్ణోऽసి మే గృహే
చికీర్షుర్భగవాన్జ్ఞానం భక్తానాం మానవర్ధనః

మీరు చెప్పిన మీ మాటను నిజము చేసుకోవడానికే మా ఇంటిలో అవతరించారు. భక్తులకు గొప్పదనం తేవడానికి పుట్టావు.  భక్తులకు జ్ఞ్యానం కలిగించడానికి పుట్టావు

తాన్యేవ తేऽభిరూపాణి రూపాణి భగవంస్తవ
యాని యాని చ రోచన్తే స్వజనానామరూపిణః

ఏ గుణాలూ లేని వాడివి నీవు. నీ ఆకరం ఏమిటో మాకు అర్థమయ్యింది. ఏ భక్తుడు ఏ రూపం కోరితే నీవు ఆ రూపం ధరిస్తావు. భక్తులు ఏ రూపం కోరితే అదే నీ రూపం. ప్రకృతి సంబంధంలేని ఆకారం లేని నీవు, ప్రకృతి సంబంధం ఉన్న భక్తులు కోరిన రూపాన్నే నీ ఆకారముగా ధరించి వస్తావు. నీవు సహజముగా రూపము లేని వాడవు

త్వాం సూరిభిస్తత్త్వబుభుత్సయాద్ధా సదాభివాదార్హణపాదపీఠమ్
ఐశ్వర్యవైరాగ్యయశోऽవబోధ వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే

జ్ఞ్యానులందరూ తత్వమును గోరి నిన్ను చేరుతారు. నిరంతరమూ నమస్కరించదగినవైనవి నీ పాదాలు. జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనే ఆరు గుణాలతో ఉన్న భగవంతుండవైన నిన్ను శరణు వేడుతున్నాను.

పరం ప్రధానం పురుషం మహాన్తం కాలం కవిం త్రివృతం లోకపాలమ్
ఆత్మానుభూత్యానుగతప్రపఞ్చం స్వచ్ఛన్దశక్తిం కపిలం ప్రపద్యే

నీవు ప్రకృతి కంటే పరుడవు. ప్రకృతివి కూడా నీవే. ప్రకృతి పురుషుల కంటే నీవు విలక్షణుడవు. మహాన్తం - మహత్ తత్వం కూడా నీవే. నీవే కాలానివి. ప్రళయ కాలములో అన్నీ మింగి, సృష్టి కాలములో అన్నీ బయటకు వదులుతావు. ఏ ఏ కాలములో ఏ ఏ పనులు చేయాలో బోధించే వాడివి నీవే. (కవి). కవి అంటే ద్రష్ట. గర్భములో ఉన్న లోకాలను బయటకి తెచ్చి కూరుస్తాడు. అందుకు కవి. త్రివృత్ - అంటే ఓంకారము. సత్వ రజ తమస్సులు నీవే. నీ సంకల్పాను సారముగా జగత్తుని సృష్టి చేసేవాడివి. నీది స్వచ్చంద శక్తి. స్వచ్చంద శక్తి - అనుకున్నప్పుడు అనుకున్నంత శక్తిని పొందుటాడు. ఏ సమయములో ఎంత శక్తి అవసరమో అంత శక్తి తెచ్చుకుంటాడు.

అ స్మాభిపృచ్ఛేऽద్య పతిం ప్రజానాం త్వయావతీర్ణర్ణ ఉతాప్తకామః
పరివ్రజత్పదవీమాస్థితోऽహం చరిష్యే త్వాం హృది యుఞ్జన్విశోకః

ప్రజాపతులము మేము కాదు. నీవు. నిన్ను నేను అనుమతి కోరుతున్నాను వీడుకోలు పలకడానికి. నీ వలన నేను సంసారాన్ని దాటాను. అన్ని కోరికలూ తీరిన నేను  ఇపుడు అన్నీ విడిచిపెట్టి సన్యాసము తీసుకుంటున్నాను. నిన్నే హృదయములో నిలుపుకుని అన్ని శోకములూ తొలగించుకుని ప్రపంచమంతా సంచరిస్తాను.

శ్రీభగవానువాచ
మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే
అథాజని మయా తుభ్యం యదవోచమృతం మునే

ఏతన్మే జన్మ లోకేऽస్మిన్ముముక్షూణాం దురాశయాత్
ప్రసఙ్ఖ్యానాయ తత్త్వానాం సమ్మతాయాత్మదర్శనే

కపిలావతారం  కేవలం తత్వ నిరూపణకు వచ్చింది

ఏష ఆత్మపథోऽవ్యక్తో నష్టః కాలేన భూయసా
తం ప్రవర్తయితుం దేహమిమం విద్ధి మయా భృతమ్

నేను ఈ సాంఖ్యమార్గాన్ని చాలా సార్లు చెప్పాను. ఇది ఆత్మ స్వరూపానికి మార్గం, ఇది సులభముగా అర్థమయ్యేది కాదు. ఎంతో కాలం గడిచిపోయింది కాబట్టి నేను చెప్పినది కూడా లుబ్దమైపోయింది.  అలా నశించిన ఆత్మ మార్గాన్ని ప్రవర్తింపచేయడానికి నేను వచ్చాను అని తెలుసుకో.

గచ్ఛ కామం మయాపృష్టో మయి సన్న్యస్తకర్మణా
జిత్వా సుదుర్జయం మృత్యుమమృతత్వాయ మాం భజ

మీ ఇష్టానుగుణముగా నా అంగీకారాన్ని పొందిన మీరు వెళ్ళవచ్చు. నీవు ఆచరించే అన్ని కర్మలను నా యందు అర్పించు. సంసారాన్ని గెలువు. అహంకార మమకారాలని గెలువు. శరీరమే ఆత్మ అనుకోవడమే మృతువు. దాన్ని గెలవడానికి  మార్గం అన్ని కర్మలూ నాకు అర్పించడమే. మోక్షము కొరకు నన్ను సేవించు.

మామాత్మానం స్వయంజ్యోతిః సర్వభూతగుహాశయమ్
ఆత్మన్యేవాత్మనా వీక్ష్య విశోకోऽభయమృచ్ఛసి

అన్ని ఆత్మలకూ ఆత్మనైన నేను (శరీరం అంటే పరమాత్మ ఆత్మగా ఉన్న, జీవాత్మ ఆత్మ గా ఉన్న శరీరం).నేను అనుకుంటేనే నన్ను నీవు తెలుసుకోగలవు. నేను ప్రతీ ప్రాణి యొక్క దహరాకాశములో ఉంటాను. నన్ను చూడటానికి ఎక్కడికో పోవాల్సిన అవసరము లేదు. నీ ఆత్మలో అంతర్యామిగా ఉన్న నన్ను మనసుతో పరిశీలించు (ఆత్మన్యేవాత్మనా ). నేను నీలో ఉన్న అని తెలుసుకున్నాక దుఃఖం ఉండదు. అభయం (అంటే క్షేమం) పొందుతావు.

మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణామ్
వితరిష్యే యయా చాసౌ భయం చాతితరిష్యతి

నేను తల్లికి, అన్ని కర్మలనూ తొలగించేదైన ఆధ్యాత్మ విద్య బోధిస్తాను, ఉపదేశిస్తాను. నేను ఉపదేశించిన ఆధ్యాత్మిక విద్యతో నా తల్లి సంసారాన్ని హాయిగా దాటుతుంది.

మైత్రేయ ఉవాచ
ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతిః
దక్షిణీకృత్య తం ప్రీతో వనమేవ జగామ హ

ఈ రీతిలో కపిలుడు కర్దమ ప్రజాపతికి చెబితే, కర్దముడు ప్రదక్షిణం చేసి వనానికి వెళ్ళాడు.

వ్రతం స ఆస్థితో మౌనమాత్మైకశరణో మునిః
నిఃసఙ్గో వ్యచరత్క్షోణీమనగ్నిరనికేతనః

అరణ్యమునకు వెళ్ళి మౌన వ్రతాన్ని ఆచరించాడు (జితం సర్వం జితే రసే - నాలుకకు రెండు పనులు ఉన్నాయి. మౌన వ్రతం, రోజులో ఎప్పుడు ఎక్కువ మాట్లాడతామో ఆ సమయాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. మౌనం రెండు రకాలు వాచా మౌనం, హృదా మౌనం. వాక్కును నియమించినపుడు మనసును కూడా నియమించాలి.  ). పరమాత్మని మాత్రమే రక్షకునిగా భావించాడు.  మౌనం ఆశ్రయించాడు కాబట్టి ముని అయ్యాడు. ఇంద్రియార్థములయందు ఎ మాత్రం ఆసక్తి లేని వాడు. గార్హపత్యాగ్ని(నిత్యాగ్ని హోత్రాన్ని తనలో ఆవాహన చేసుకుని సన్యాసం స్వీకరించాడు), అనికేతన (ఇల్లు కూడా లేని వాడయ్యాడు). అన్ని మమకారాలకు మూలమైనది గృహం. ( అందుకే ధర్మ శాస్త్రం "ఇల్లు ఇల్లు కాదు - అసలైన ఇల్లు ఇల్లాలే అని చెబుతుంది)

మనో బ్రహ్మణి యుఞ్జానో యత్తత్సదసతః పరమ్
గుణావభాసే విగుణ ఏకభక్త్యానుభావితే

తన మనసుని పరమాత్మ యందు లగ్నం చేసాడు. పరమాత్మ సత్అసత్ రెండూ అయిన్ పరమాత్మ యందు లగ్నం చేసి . గుణావభాసములైన (గుణాలలా అనిపించే) శబ్ద స్పర్శ రూప రస గంధములు వంటి గుణాలు లేని వాడు, కళ్యాణ గుణములు గలవాడైన పరమాత్మ, భక్తితో మాత్రమే ధ్యానించడానికి దొరికేవాడు అయిన పరమాత్మ యందు మనసు లగ్నం చేసాడు

నిరహఙ్కృతిర్నిర్మమశ్చ నిర్ద్వన్ద్వః సమదృక్స్వదృక్
ప్రత్యక్ప్రశాన్తధీర్ధీరః ప్రశాన్తోర్మిరివోదధిః

నిరహంకారం ( దేహాత్మాభిమానం లేక) , మమకారం (ఆత్మగా భావించే దేహం కొరకు, దేహం వలన వచ్చిన వారి యందు ఉండేది. అవిద్య అనే మహా వృక్షం నుండి సంసారానికి రెండు బీజాలు పుట్టాయి. తనది కాని దాన్ని తనది అనుకోవాడు, తాను కాని దానిని తాను అనుకోవడం),  శీతోష్ణ సుఖదుఖాలను సమముగా చూచేవాడు (అందుకే వేసవిలో పంచాగ్నుల మధ్యా, వర్షాకాలములో పైకప్పులేని ఆకాశములో ఉండి, చలికాలములో చల్ల నీటిలో ఉండి తపస్సు చేయాలి) , సకల ప్రాణులనూ సమానముగా చూసేవాడు (ప్రతీ జీవికి, వారు వారు ఆయా జన్మలలో చేసుకున్న పాప పుణ్య కర్మల వలన వచ్చిన శరీరాలే. పరమాత్మ ప్రసాదమే ఈ శరీరాలన్నీ. పరమాత్మ అన్నింటిలోనూ ఉన్నాడు. ) ,  స్వదృక్ - అంతటా తనను చూచేవాడు, తనలో అందరినీ చూచేవాడు. ప్రపంచములో పరమాత్మనీ, పరమాత్మలో ప్రపంచాన్ని చూచుట స్వదృక్. ప్రత్యక్ - జీవాత్మ. ఎలాంటి ఒడిదుడుకులూ లేని జీవాత్మ.

ఈ లక్షణాలు ఉన్న వాడు ధీర. బుద్ధి యందు ఆనందించే వాడు ధీర. పరమాత్మ యందు బుద్ధి లగ్నమయ్యే వాడు ధీరః. వాడికి భయం ఉండది. ఊర్మి ( తరగము) లేని సముద్రములా ప్రశాంతముగా ఉన్నాడు. ఆకలి దప్పి శోక మోహములూ జరా మరణం అనేవి అందరికీ ఉండే ఊర్ములు. సముద్రములో తరంగము ఎలా వచ్చి పోతుందో ఇవి కూడా అలాగే వచ్చిపోతాయి. షడూర్ములు లేని సంసారములో ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు

వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యగాత్మని
పరేణ భక్తిభావేన లబ్ధాత్మా ముక్తబన్ధనః

సర్వజ్ఞ్యుడైన పరమాత్మ యందు, సర్వోత్కృష్టమైన భక్తి భావముతో తన ఆత్మను సమర్పించాడు. అలా సమర్పించి బంధము నుండి ముక్తుడయ్యాడు.

ఆత్మానం సర్వభూతేషు భగవన్తమవస్థితమ్
అపశ్యత్సర్వభూతాని భగవత్యపి చాత్మని

పరమాత్మ యందు తన ఆత్మను సమర్పించడం వలన సర్వ భూతములయందు పరమాత్మ ఉన్నాడనీ భావన కలిగి

ఇచ్ఛాద్వేషవిహీనేన సర్వత్ర సమచేతసా
భగవద్భక్తియుక్తేన ప్రాప్తా భాగవతీ గతిః

అంతటా సమబుద్ధి కలుగుటచే కోరికా వైరమూ అనే రెండూ పోయాయి, ఇలాంటి స్థితితో పరమాత్మ యందు భక్తి కలవాడై పరమపదమును పొందాడు

Popular Posts