Followers

Saturday 19 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఐదవ అధ్యాయం

               ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
నన్దస్త్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాః
ఆహూయ విప్రాన్వేదజ్ఞాన్స్నాతః శుచిరలఙ్కృతః

నందుడు కుమారుడు కలగడము వలన మహా సంతోషం కలవాడై వేదం బ్రాహ్మణులను పిలిచి స్వస్తి పుణ్యాహవచనములను చేయించుకుని జాతకర్మ చేసి పితృదేవతలను అర్చించాడు

వాచయిత్వా స్వస్త్యయనం జాతకర్మాత్మజస్య వై
కారయామాస విధివత్పితృదేవార్చనం తథా

ధేనూనాం నియుతే ప్రాదాద్విప్రేభ్యః సమలఙ్కృతే
తిలాద్రీన్సప్త రత్నౌఘ శాతకౌమ్భామ్బరావృతాన్

బాగుగా అలంకరించబడి ఉన్న రెండు లక్షల గోవులను బ్రాహ్మణులకు దానం చేసాడు

కాలేన స్నానశౌచాభ్యాం సంస్కారైస్తపసేజ్యయా
శుధ్యన్తి దానైః సన్తుష్ట్యా ద్రవ్యాణ్యాత్మాత్మవిద్యయా

అద్రి దానం చేసాడు. రత్నపు రాసులూ బంగారమూ వస్త్రాలతో కప్పబడిన ఏడు గుట్టలను దానం చేసాడు. ఒక్కో దాని శుద్ధికీ ఒక్కోటి అవసరం. పది రోజులు ఐతే కానీ     తల్లి తండ్రులు శుద్ధి చెందుతారు. స్నానముతో శరీరం శుద్ధమవుతుంది. శౌచముతో బుద్ధి శుద్ధి పొందుతుంది. సంస్కారముతో మనసు శుద్ధి చెందుతుంది, పూజతో సంకల్పం శుద్ధి చెందుతుంది, దానముతో ద్రవ్యం శుద్ధి చెందుతుంది. నాది అన్న అహంకార గ్రస్థమై మురికి పట్టి ఉంటుంది ద్రవ్యానికి. దానము వలన ఆ మురికి పోతుంది.

సౌమఙ్గల్యగిరో విప్రాః సూతమాగధవన్దినః
గాయకాశ్చ జగుర్నేదుర్భేర్యో దున్దుభయో ముహుః

 అందరూ మంగళ వాక్యములు పలుకుతూ బ్రాహ్మణులూ సూతులూ మాగధులూ వందులూ గానం చేసారు

వ్రజః సమ్మృష్టసంసిక్త ద్వారాజిరగృహాన్తరః
చిత్రధ్వజపతాకాస్రక్ చైలపల్లవతోరణైః

 వ్రేపల్లె మొత్తం వీధులలో ప్రతి ఇంటి ముందరా గంధ జలం చల్లారు

గావో వృషా వత్సతరా హరిద్రాతైలరూషితాః
విచిత్రధాతుబర్హస్రగ్ వస్త్రకాఞ్చనమాలినః

మహార్హవస్త్రాభరణ కఞ్చుకోష్ణీషభూషితాః
గోపాః సమాయయూ రాజన్నానోపాయనపాణయః


ముత్యాలతో ముగ్గులు పెట్టారు.ద్వారములకూ ఇంటిలోపలా ముందరా అలంకరించి రకరకాల పూల మాలలూ దండలూ వస్త్రాలూ చిగురుటాకులూ తోరణాలతో ఆవులూ  ఎద్దులూ దూడలనూ అలంకరించి పసుపూ నూనే కలిపి రాసారు. వారు కూడా రక రకాలైన వస్త్రాభరణాలు ధరించారు. తలపాగాలు బంగారు భాగాలు ధరించిన గోపికలందరూ"మన రాజుకు కొడుకు పుట్టాడు " అని కానుకలు పట్టుకుని గోపికలుకూడా " మా యశోదామ్మకు కొడుకు పుట్టాడు" అని స్నానం చేసి అలంకరించుకున్నారు

గోప్యశ్చాకర్ణ్య ముదితా యశోదాయాః సుతోద్భవమ్
ఆత్మానం భూషయాం చక్రుర్వస్త్రాకల్పాఞ్జనాదిభిః

నవకుఙ్కుమకిఞ్జల్క ముఖపఙ్కజభూతయః
బలిభిస్త్వరితం జగ్ముః పృథుశ్రోణ్యశ్చలత్కుచాః

గోప్యః సుమృష్టమణికుణ్డలనిష్కకణ్ఠ్యశ్
చిత్రామ్బరాః పథి శిఖాచ్యుతమాల్యవర్షాః
నన్దాలయం సవలయా వ్రజతీర్విరేజుర్
వ్యాలోలకుణ్డలపయోధరహారశోభాః

పూజా ద్రవ్యాలు చేతిలో పట్టుకుని చాలా మంది పరిగెత్తుకుని వచ్చారు. వారు తొందరగా వెళుతూ ఉంటే కదులుతున్న గొప్ప స్తనములూ పిరుదులూ కలవారై వచ్చారు.
ఇక్కడ వారు పురుషున్ని చూడటానికి వెళుతున్నారు అని ఉంది. యశోదమ్మ పురుషున్ని ఎలా కన్నది? ఆయన పరమ పురుషుడు. వారు పరమాత్మను చూడడానికి వెళుతున్నాము అన్న భావనతో వెళ్ళారు. ఇక్కడ స్తనం అంటే భక్తి. ఆ భక్తి సౌందర్యము చేతనే పురుషుడైన పరమాత్మ ఆకర్షించబడతాడు
పర భకతి పరమ భక్తి అని రెండు రకముల భక్తి. ఆ భక్తే వారి స్తనములుగా కదిలాయి. పరమాత్మను సాత్క్షాత్కరించుకున్నామన్న దృఢమైన బుద్ధి పర భక్తి. సాక్షాత్కరించుకున్న పరమాత్మనుండి విడిపోతామేమో అన్న భయం పరంభక్తి. వేదాంత శాస్త్రములో భక్తిని స్తనములతో పోలుస్తారు. నడుము ఎంత సన్నగా ఉన్నా స్తనములకు ఆధారం. నడుము భక్తిని మోసేది. అదే వైరాగ్యం. నడుమును మోసేది పిరుదులు. పిరుదులంటే  జ్ఞ్యానం. పరమాత్మను చూడకుండా బతకలేని పారవశ్య స్థ్తిని వర్ణించాలని చెప్పిన మాటలు ఇవి
గోపికలు వెళుతూ ఉంటే వారి కొప్పులోంచి పూలు జారిపడి వారు అనుకోకుండానే మార్గాన్ని పూలతో అలంకరించారు
చేతులకి కంకణాలు పెట్టుకుని మెళ్ళో హారాలు ధరించి నంద భవనానికి వెళ్ళారు. వారంతా పరమాత్మా మా పిల్లవాన్ని కాపాడు . అని ఒకరి మీద ఒకరు పసుపు నీళ్ళు జల్లుకున్నారు

తా ఆశిషః ప్రయుఞ్జానాశ్చిరం పాహీతి బాలకే
హరిద్రాచూర్ణతైలాద్భిః సిఞ్చన్త్యోऽజనముజ్జగుః

అవాద్యన్త విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే
కృష్ణే విశ్వేశ్వరేऽనన్తే నన్దస్య వ్రజమాగతే

పెద్దగా పాడుకుంటూ వెళ్ళారు, గొప్ప వాద్యాలు మోగించారు.

గోపాః పరస్పరం హృష్టా దధిక్షీరఘృతామ్బుభిః
ఆసిఞ్చన్తో విలిమ్పన్తో నవనీతైశ్చ చిక్షిపుః

గోపాలకులు పరస్పరం ఆనందించారు.పాలూ పెరుగూ వెన్నా పూసుకున్నారు

నన్దో మహామనాస్తేభ్యో వాసోऽలఙ్కారగోధనమ్
సూతమాగధవన్దిభ్యో యేऽన్యే విద్యోపజీవినః

తైస్తైః కామైరదీనాత్మా యథోచితమపూజయత్
విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్యోదయాయ చ

అలా చల్లుతున్నారూ రాసుకుంటూ ఉన్నారు. అలా వచ్చిన వారికి నందుడుకొత్తబట్టలు ఇచ్చాడు. ఆభరణాలిచ్చాడు. సూత మాగధ వందులకు గోవులను ఇచ్చాడు. ఎవరెవరు ఏమేమి కావాలనుకున్నారో వరందరికీ అవి ఇచ్చాడు

రోహిణీ చ మహాభాగా నన్దగోపాభినన్దితా
వ్యచరద్దివ్యవాసస్రక్ కణ్ఠాభరణభూషితా

తన కుమారుడు వృద్ధి పొందడానికి రోహిణి కూడా ఆ ప్రాంగణమంతా తిరిగింది కొత్తబట్టలూ ఆభరణాలూ ధరించి

తత ఆరభ్య నన్దస్య వ్రజః సర్వసమృద్ధిమాన్
హరేర్నివాసాత్మగుణై రమాక్రీడమభూన్నృప

ఆనాటి నుండి వ్రేపల్లె అన్ని సమృద్ధులూ కలిగి ఉంది. దేనికీ లోటు లేకుండా
పరమాత్మ యొక్క నివాసము వలన ఏర్పడిన అనంతమైన ఆత్మ గుణములు కలిగి ఉండుటతో వ్రేపల్లె అమ్మవారి ఆట భూమి అయ్యింది (సంపదలు బాగా పెరిగాయి) వ్రేపల్లె కాస్తా శ్రీనివాసమయ్యింది

గోపాన్గోకులరక్షాయాం నిరూప్య మథురాం గతః
నన్దః కంసస్య వార్షిక్యం కరం దాతుం కురూద్వహ

నందుడు కూడా ఆనందముతో పాలూ పెరుగూ మొదలైనవీ తీసుకుని, కట్టవలసిన పన్ను తీసుకుని, అక్కడున్నవారికి వ్రేపల్లె అప్పగించి పన్ను ఇవ్వడానికి మధుర వచ్చాడు. కంసునికి నందుడు పన్ను కట్టాడన్న విషయం తెలుసుకున్న వసుదేవుడు అతను దిగిన ప్రదేశానికి వెళ్ళాడు

వసుదేవ ఉపశ్రుత్య భ్రాతరం నన్దమాగతమ్
జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తదవమోచనమ్

తం దృష్ట్వా సహసోత్థాయ దేహః ప్రాణమివాగతమ్
ప్రీతః ప్రియతమం దోర్భ్యాం సస్వజే ప్రేమవిహ్వలః

అలా వచ్చిన వసుదేవున్ని చూచి ప్రాణాలు వస్తే శరీరమెలా లేచి కూర్చుంటుందో అలా లేచి వెంటనే బాహువులతో మిత్రున్ని ప్రేమతో విహ్వలుడై ఆలింగనం చేసుకుని పూజించాడు

పూజితః సుఖమాసీనః పృష్ట్వానామయమాదృతః
ప్రసక్తధీః స్వాత్మజయోరిదమాహ విశామ్పతే

అందరి క్షేమాలూ విచారించాక తన పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు

దిష్ట్యా భ్రాతః ప్రవయస ఇదానీమప్రజస్య తే
ప్రజాశాయా నివృత్తస్య ప్రజా యత్సమపద్యత

భగవంతుని దయతో చాలా కాలం సంతానం లేకున్నా సంతానం కలిగే వయసుదాటిన తరువాత నీకు సంతానం కలిగింది

దిష్ట్యా సంసారచక్రేऽస్మిన్వర్తమానః పునర్భవః
ఉపలబ్ధో భవానద్య దుర్లభం ప్రియదర్శనమ్

నీవు మళ్ళీ పుట్టావు నీ కొడుకు రూపములో. ఈ రోజున నీవు మాకు దొరికావు. ప్రపంచములో అన్నీ దొరుకుతాయి కానీ మనకు ఇష్టమైనవి దొరకవు. (నేను ఈ సంసార చక్రములో ఉండి మళ్ళీ బయటకు వస్తానో లేదో అనుకున్న నేను మళ్ళీ పుట్టాను.అలాంటి నేను మళ్ళీ నిన్ను చూస్తా అని అనుకోలేదు. ఇది రెండవ అర్థం. సంసారం అనే చక్రములో తిరుగ్తూ మాటిమాటికీ పుట్టే జీవుడు పరమాత్మ సంకల్పముతో భగవంతుని సాక్షాత్కారాన్ని పొందుతాడు. మనకు ప్రియమైన పరమాత్మను సాక్షాత్కరానం చేసుకోవడం దుర్లభం కదా. ఇది ఇంకో అర్థం)

నైకత్ర ప్రియసంవాసః సుహృదాం చిత్రకర్మణామ్
ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథా

ఎంత స్నేహం ప్రీతీ ఎక్కువ ఉంటే వారు అంత దూరముగా ఉంటారు. ఎవరి పనులు వారికుంటాయి.
పడవలు తనతట తాము పోతే ఒకే దిక్కున పోగలవు కానీ ప్రవాహముతో కొట్టుకుపోతే ఒకే దిక్కుకు పోతాయా

కచ్చిత్పశవ్యం నిరుజం భూర్యమ్బుతృణవీరుధమ్
బృహద్వనం తదధునా యత్రాస్సే త్వం సుహృద్వృతః

నీ పశువులకు ఏ రోగాలూ లేకుండా ఉన్నాయా, గడ్డీపంటలూ బాగా పండుతూ ఉన్నాయా. వ్రేపల్లె (బృహద్వనం - బృందావననానికి ఇంకో పేరు ). ఇపుడు నీవెక్కడ ఉన్నావో అది  బాగుందా.

భ్రాతర్మమ సుతః కచ్చిన్మాత్రా సహ భవద్వ్రజే
తాతం భవన్తం మన్వానో భవద్భ్యాముపలాలితః

సోదరా నా కుమారుడు తన తల్లితో నీ ఇంటిలో నీవు పోషిస్తుండగా లాలిస్తుండగా బాగున్నాడా. (దీనికి బలరాముడూ కృష్ణుడూ అన్న అర్థం వస్తుంది)

పుంసస్త్రివర్గో విహితః సుహృదో హ్యనుభావితః
న తేషు క్లిశ్యమానేషు త్రివర్గోऽర్థాయ కల్పతే

భగవంతుడు ఒక వైపు ధర్మార్థ కామాలనూ ఇచ్చాడు, మంచి మిత్రుడూ ఇచ్చాడు. మిత్రుడు బాగుంటేనే ఇవన్నీ బాగుంటాయి. నీవు బాగుంటేనే నా ధర్మార్థ కామాలు (త్రివర్గములు) బాగుంటాయి.

శ్రీనన్ద ఉవాచ
అహో తే దేవకీపుత్రాః కంసేన బహవో హతాః
ఏకావశిష్టావరజా కన్యా సాపి దివం గతా

అయ్యో! దేవకీ పుత్రులందరినీ చంపేసాడు అని విన్నా.

నూనం హ్యదృష్టనిష్ఠోऽయమదృష్టపరమో జనః
అదృష్టమాత్మనస్తత్త్వం యో వేద న స ముహ్యతి

మన జీవితం అంతా అదృష్టం మీద ఆధార పడి ఉన్నది, మనం దానికి పరతంత్ర్యులం. మనదంటూ ఏదీ లేదు అంతా మన అదృష్టం అని తెలుసుకున్నవాడు బాధపడడు

శ్రీవసుదేవ ఉవాచ
కరో వై వార్షికో దత్తో రాజ్ఞే దృష్టా వయం చ వః
నేహ స్థేయం బహుతిథం సన్త్యుత్పాతాశ్చ గోకులే

నీవు వచ్చిన పని ఐపోయింది కదా. ఎక్కువ సేపు ఇక్కడ ఉండవద్దు.  వ్రేపల్లెలో ఉత్పాతాలు జరగబోతున్నాయి.

శ్రీశుక ఉవాచ
ఇతి నన్దాదయో గోపాః ప్రోక్తాస్తే శౌరిణా యయుః
అనోభిరనడుద్యుక్తైస్తమనుజ్ఞాప్య గోకులమ్

వసుదేవుడు నందాది గోపకులకు ఇలా చెబితే అతని ఆజ్ఞ్య పొంది బళ్ళు కట్టుకుని వ్రేపల్లెకు వెళ్ళారు.

                                                     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts