Followers

Saturday 26 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై ఎనిమిదవ అధ్యాయం


           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై ఎనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అక్రూరోऽపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతిః
ఉషిత్వా రథమాస్థాయ ప్రయయౌ నన్దగోకులమ్

అకౄరుడు కంసుడు చెప్పిన ఆ రాత్రి ఆ విషయమే ఆలోచిస్తూ పడుకొని మరునాడు పొద్దున్నే నందగోకులానికి బయలుదేరాడు

గచ్ఛన్పథి మహాభాగో భగవత్యమ్బుజేక్షణే
భక్తిం పరాముపగత ఏవమేతదచిన్తయత్

ఆనందం పొంగి పొరలుతుండగా దారిలో ఆలోచిస్తున్నాడు.

కిం మయాచరితం భద్రం కిం తప్తం పరమం తపః
కిం వాథాప్యర్హతే దత్తం యద్ద్రక్ష్యామ్యద్య కేశవమ్

నేనేమి తపస్సు చేసాను, ఏమి పుణ్యం చేసాను. యోగ్యులైన వారికి దానం ఇస్తే పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుందంటారు, నేను ఎవరికి ఏమి దానం చేసానో నాలాంటి వాడికి పరమాత్మ దర్శనం కలుగుతోంది.

మమైతద్దుర్లభం మన్య ఉత్తమఃశ్లోకదర్శనమ్
విషయాత్మనో యథా బ్రహ్మ కీర్తనం శూద్రజన్మనః

సాంసారిక విషయముల మీద ఆస్కతి ఉన్న శూద్రునికి పరమాత్మ దర్శనం ఎలా దుర్లభమో నాకు కూడా పరమాత్మ దర్శనం దుర్లభం

మైవం మమాధమస్యాపి స్యాదేవాచ్యుతదర్శనమ్
హ్రియమాణః కలనద్యా క్వచిత్తరతి కశ్చన

ఇంత అధముడనైన నాకు కూడా పరమాత్మ దర్శనం కలగబోతోంది. కాలమనే మహా నదిలో కొట్టుకుపోతున్నావాడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తీరానికి చేరకపోతాడా

మమాద్యామఙ్గలం నష్టం ఫలవాంశ్చైవ మే భవః
యన్నమస్యే భగవతో యోగిధ్యేయాన్ఘ్రిపఙ్కజమ్

ఈనాటికి నా అన్ని పాపాలూ తొలగిపోయి నా పుట్టుక సఫలమైనది. మహాయోగులు ధ్యానం చేసే పరమాత్మ పాద పద్మములు ఈ రోజు నేను కూడా నమస్కారం చేయగలుగుతాను . నిజముగా కంసుడు నా మీద ఇలా దయ చూపాడు. వాడు పంపబట్టే పరమాత్మ పాదములు చూడగలుగుతున్నాను.

కంసో బతాద్యాకృత మేऽత్యనుగ్రహం ద్రక్ష్యేऽఙ్ఘ్రిపద్మం ప్రహితోऽమునా హరేః
కృతావతారస్య దురత్యయం తమః పూర్వేऽతరన్యన్నఖమణ్డలత్విషా

తన యొక్క పాదముల గోళ్ళ కాంతులతో సకల బ్రహ్మానడముల చీకట్లను త్రివిక్రమావతారములో పోగొట్టిన స్వామిని నేను చూడగలుగుతున్నాను.

యదర్చితం బ్రహ్మభవాదిభిః సురైః
శ్రియా చ దేవ్యా మునిభిః ససాత్వతైః
గోచారణాయానుచరైశ్చరద్వనే
యద్గోపికానాం కుచకుఙ్కుమాఙ్కితమ్

బ్రహ్మ రుద్రాది దేవతల చేత ఇంద్రుని చేతా అమ్మవారి చేతా, మునులతో సాత్వతులతో ఏ పాద పద్మములు పూజించబడ్డాయో.  ఆవులను మేపడానికి అరణ్యములో మోపిన పాద పల్లవములు, గోపిక వక్షస్థలాన్ని అలంకరించిన పాదపద్మములను నేను చూస్తాను

ద్రక్ష్యామి నూనం సుకపోలనాసికం స్మితావలోకారుణకఞ్జలోచనమ్
ముఖం ముకున్దస్య గుడాలకావృతం ప్రదక్షిణం మే ప్రచరన్తి వై మృగాః

అందమైన కపోలములూ చక్కని ముక్కూ చిరునవ్వు కరుణతో ఉన్న చూపు, అలకలతో సుందరముగా ఉన్న పరమాత్మ ముఖం నేను చూస్తాను. మృగములు నాకు ఎడమ నుంచి కుడివైపుకు ప్రదక్షిణం చేస్తున్నాయి. ఈ శకునం వలన తప్పకుండా కృష్ణుని పాద పద్మాలను దర్శనం చేసుకుంటాను

అప్యద్య విష్ణోర్మనుజత్వమీయుషో భారావతారాయ భువో నిజేచ్ఛయా
లావణ్యధామ్నో భవితోపలమ్భనం మహ్యం న న స్యాత్ఫలమఞ్జసా దృశః

పరమాత్మ భూభారాన్ని తొలగించడానికి తన సంకల్పముతో మానవ శరీరాన్ని తీసుకున్నాడు. సౌందర్యానికి అదే నివాసం. అలాంటి స్వామి నా నేత్రములకు ఫలం కాబోతున్నాడు. ఎంత పుణ్యమో చేసి ఉంటాను.

య ఈక్షితాహంరహితోऽప్యసత్సతోః స్వతేజసాపాస్తతమోభిదాభ్రమః
స్వమాయయాత్మన్రచితైస్తదీక్షయా ప్రాణాక్షధీభిః సదనేష్వభీయతే

అహంకారం మమకారాలు లేనివాడు, ఏ కోరికలూ లేనివాడు, అసత్ నుండి సత్ (సృష్టి), సత్ నుండి అసత్ (సంహారం) (సూక్ష్మాకరం నుండి స్థూలాకార, స్థూలాకారం నుండి సూక్ష్మాకారం)
తన దివ్యమైన తేజస్సుతో అజ్ఞ్యానమయమైన భేధ భ్రమను తొలగించి తన మాయతో ప్రాణములూ ఇంద్రియములూ లోకములూ సృష్టించాడు. అటువంటి వాడు మనలాగ ఆకారం ప్రాణములూ ఇంద్రియములూ శరీరమూ పెట్టుకుని మనలాగ మనలాంటి ఇంటిలో ఉంటున్నాడు. అలా ఉన్న స్వామిని ఈ కళ్ళతో చూడగలుగుతున్నను.

యస్యాఖిలామీవహభిః సుమఙ్గలైః వాచో విమిశ్రా గుణకర్మజన్మభిః
ప్రాణన్తి శుమ్భన్తి పునన్తి వై జగత్యాస్తద్విరక్తాః శవశోభనా మతాః

పరమాత్మ యొక్క భక్తి లేకుండా, దృష్టి లేకుండా ఉన్నవారు, ఆయన యందు ధ్యానం లేనివారు ఏర్పరచుకున్న సంపదలన్నీ శవానికి చేసిన అలంకారాల వంటివి. ఎవరి గుణ కర్మలను ప్రకాశించే అద్భుతమైన లీలలూ వాక్కులే సకల ప్రపంచాన్ని బతికిస్తాయి పెంచుతాయి పవిత్రం చేస్తాయి. అటువంటి వాక్కులు పలకని వారు వినని వారు ఆచరించే పనులు శవ శోభనం వంటివి

స చావతీర్ణః కిల సత్వతాన్వయే స్వసేతుపాలామరవర్యశర్మకృత్
యశో వితన్వన్వ్రజ ఆస్త ఈశ్వరో గాయన్తి దేవా యదశేషమఙ్గలమ్

అటువంటి స్వామి సాత్వత వంశములో పుట్టాడు. తన (శాస్త్ర) మర్యాదలను పరిపాలించే వారికి శుభం కలిగించడానికి పుట్టాడు. తన కీర్తిని వ్యాపింపచేస్తూ ఈయన వ్రేపల్లెలో ఉంటున్నాడు. సకల మంగళ రూపమైన పరమాత్మను దేవతలు గానం చేస్తారు.

తం త్వద్య నూనం మహతాం గతిం గురుం
త్రైలోక్యకాన్తం దృశిమన్మహోత్సవమ్
రూపం దధానం శ్రియ ఈప్సితాస్పదం
ద్రక్ష్యే మమాసన్నుషసః సుదర్శనాః

మహానుభావులందరికీ ఆయనే గతి, ఆయనే గురువు. మూడు లోకాలకూ సుందరుడు. కన్నులు కలవారికి పండుగ. ఆయనను చూస్తేనే పండుగ. కన్నులు గల వారికి  పండుగ చేసే రూపం ధరించాడు. ఆ రూపం అమ్మవారి చేత కోరికలు నింపుకున్న రూపం. అలాంటి రూపాన్ని నేనీనాడు చూడబోతున్నాను. ఈరోజు నాకు ఉషఃకాలం మంచిని చూపేది కావాలి. శుభమును చూపాలి.

అథావరూఢః సపదీశయో రథాత్ప్రధానపుంసోశ్చరణం స్వలబ్ధయే
ధియా ధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్య ఆభ్యాం చ సఖీన్వనౌకసః

నేను రథం నుండి కిందకు దిగి బలరామ కృష్ణుల పాదములను, యోగులు కూడ్దా నిరంతరం ధ్యానించే పాదములను నేను కూడా ఈ రోజు నమస్కారం చేస్తాను కదా.

అప్యఙ్ఘ్రిమూలే పతితస్య మే విభుః
శిరస్యధాస్యన్నిజహస్తపఙ్కజమ్
దత్తాభయం కాలభుజాఙ్గరంహసా
ప్రోద్వేజితానాం శరణైషిణాం ణృనామ్

అతని పాదాల మీద పడినటువంటి నా శిరస్సు మీద ఆయన తన హస్తాన్ని ఉంచుతాడా, కాల సర్ప వేగముతో భయపడుతున్నవారికి అభయమిచ్చే హస్తమునూ శరణు కోరేవారికి అభయం ఇచ్చే హస్తాన్ని నా శిరస్సున ఉంచుతాడా

సమర్హణం యత్ర నిధాయ కౌశికస్తథా బలిశ్చాప జగత్త్రయేన్ద్రతామ్
యద్వా విహారే వ్రజయోషితాం శ్రమం స్పర్శేన సౌగన్ధికగన్ధ్యపానుదత్

ఏ పాదాలకు పూజించి ఇంద్రుడూ బలి చక్రవర్తీ మూడు లోకాలకూ అధిపతులయ్యారో రాస క్రీడా విహారములో అలసిపోయిన గోపికలకు ఏ పాద స్పర్శతో శ్రమను తొలగించాడో

న మయ్యుపైష్యత్యరిబుద్ధిమచ్యుతః
కంసస్య దూతః ప్రహితోऽపి విశ్వదృక్
యోऽన్తర్బహిశ్చేతస ఏతదీహితం
క్షేత్రజ్ఞ ఈక్షత్యమలేన చక్షుషా

నేను అనుకుంటున్నాను గానీ, నేను వెళ్ళి నిలబడగానే, నేను కంసుని దూతను కాబట్టి నన్ను ఆదరిస్తాడా, నన్ను శత్రువుగా చూడడు కదా. ఆయన సకల ప్రపంచాన్నీ చూడగలిగిన వాడు. ప్రతీ వారికీ లోపలా వెలుపలా ఉండి, అనుకున్న ప్రతీ దాన్నీ క్షేత్రజ్ఞ్యుడిగా పరిశుద్ధమైన దృష్టితో అన్నీ చూపే స్వామి నేనేమనుకుని వస్తున్నానో చూడలేడా నా గురించి తెలుసుకోలేడా.

అప్యఙ్ఘ్రిమూలేऽవహితం కృతాఞ్జలిం
మామీక్షితా సస్మితమార్ద్రయా దృశా
సపద్యపధ్వస్తసమస్తకిల్బిషో
వోఢా ముదం వీతవిశఙ్క ఊర్జితామ్

కాళ్ళ మీద పడితే ఒక చిన్న చిరునవ్వుతో చూస్తే చాలు. ఆ ఒక్క చూపూ పడితే నా పాపాలన్నీ పోతాయి. నేను ఆనందిస్తాను.

సుహృత్తమం జ్ఞాతిమనన్యదైవతం దోర్భ్యాం బృహద్భ్యాం పరిరప్స్యతేऽథ మామ్
ఆత్మా హి తీర్థీక్రియతే తదైవ మే బన్ధశ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః

నేనెవరినో కాదు కదా. నేను చిన్నన్నను అవుతాను. ప్రియ మిత్రున్నీ బంధువ్నీ, ఆయన తప్ప వేరు దైవం లేని వాడిని. ఒక్క సారి కౌగిలించుకుంటాడా. ఆయన కౌగిలించుకుంటే ఈ శరీరం పవిత్రమవుతుంది. సకల కర్మ రూపమైన నా బంధం తొలగిపోతుంది.

లబ్ధ్వాఙ్గసఙ్గమ్ప్రణతమ్కృతాఞ్జలిం
మాం వక్ష్యతేऽక్రూర తతేత్యురుశ్రవాః
తదా వయం జన్మభృతో మహీయసా
నైవాదృతో యో ధిగముష్య జన్మ తత్

ఆలింగనం చేసుకుని చేతులు జోడించుకుని ఉంటే అకౄరా వచ్చి కూర్చో అని నా పేరుపెట్టి పిలుస్తాడా. పరమాత్మ నా పేరు పెట్టి పిలిస్తే నేను పుట్టి సార్ధకమవుతుంది. అలాంటి పరమాత్మ చేత ఆదరింపబడని జన్మ ఎందుకు. అది వ్యర్థం

న తస్య కశ్చిద్దయితః సుహృత్తమో న చాప్రియో ద్వేష్య ఉపేక్ష్య ఏవ వా
తథాపి భక్తాన్భజతే యథా తథా సురద్రుమో యద్వదుపాశ్రితోऽర్థదః

నేనేదో అనుకుంటున్నాను కానీ ఆయనకు శత్రువూ బంధువూ మిత్రుడూ ఉపేక్షించదలచిన వాడూ అంటూ ఎవరూ ఉండరు. ఐనా భక్తులను సేవిస్తాడు. సేవించిన వారి కోరికలు ఇచ్చే కల్పవృక్షం వంటి వాడు. ఆయనకు అందరూ సమానమే.

కిం చాగ్రజో మావనతం యదూత్తమః స్మయన్పరిష్వజ్య గృహీతమఞ్జలౌ
గృహం ప్రవేష్యాప్తసమస్తసత్కృతం సమ్ప్రక్ష్యతే కంసకృతం స్వబన్ధుషు

ఆయన అన్నగారైన బలరాముడు నన్ను కూడా దగ్గరకు తీసుకు తన ఇంటిలో ప్రవేశింపచేసి ఆప్తుడిలా నన్ను సత్కరిస్తాడా, ఇంట్లోకి రానిస్తాడా.

శ్రీశుక ఉవాచ
ఇతి సఞ్చిన్తయన్కృష్ణం శ్వఫల్కతనయోऽధ్వని
రథేన గోకులం ప్రాప్తః సూర్యశ్చాస్తగిరిం నృప

ఇవన్నీ అనుకుని దారిలో అకౄరుడు ఆలోచిస్తూ సరిగా గోధూళి సమయములో వ్రేపల్లెకు వెళ్ళాడు

పదాని తస్యాఖిలలోకపాల కిరీటజుష్టామలపాదరేణోః
దదర్శ గోష్ఠే క్షితికౌతుకాని విలక్షితాన్యబ్జయవాఙ్కుశాద్యైః

ఆయన అదృష్టం బాగుంది. ఆవుల పాదాల మధ్య చిన్ని చిన్ని పరమాత్మ అడుగు జాడలు కనపడ్డాయి,

తద్దర్శనాహ్లాదవివృద్ధసమ్భ్రమః
ప్రేమ్ణోర్ధ్వరోమాశ్రుకలాకులేక్షణః
రథాదవస్కన్ద్య స తేష్వచేష్టత
ప్రభోరమూన్యఙ్ఘ్రిరజాంస్యహో ఇతి

సకల లోకపాలకుల కిరీటములో ప్రవేశించి పవిత్రం చేసిన పాద రేణువు గల, భూమికి కూడా నిత్యోత్సవం కలిగించే పాదాలు. ఆ పాదాలలో పరమాత్మ చిహ్నాలు కనపడ్డాయి
పరమానందాన్ని పొందాడు. వెంట్రుకలు నిక్కబొడిచాయి కళ్ళ వెంట ఆనందబాష్పాలు రాగా రథం నుండి దిగి దుమ్ములో పొర్లాడు.
ఇవి నా ప్రభువు యొక్క పాద ధూళి . దీన్ని నా ఒంటికి రాసుకుంటాను.
దేహంభృతామియానర్థో హిత్వా దమ్భం భియం శుచమ్
సన్దేశాద్యో హరేర్లిఙ్గ దర్శనశ్రవణాదిభిః

నిజముగా శరీరం ఉన్నవాడికి ఇంతకన్నా ప్రయోజనం లేదు. నాటకాలన్ని మానివేసి భయాన్ని దుఃఖాన్ని వదలి వేసి, పెద్దలు చెప్పిన మాటతో పరమాత్మ ఆకారాన్ని గుర్తునూ పేరునూ చూచినా విన్నా వెంటనే పడి నమస్కరించుటే శరీరం ఉన్నవాడికి ఫలం. అవి లేక శరీరం ఉన్నా అది చెట్టుతో సమానం

దదర్శ కృష్ణం రామం చ వ్రజే గోదోహనం గతౌ
పీతనీలామ్బరధరౌ శరదమ్బురహేక్షణౌ

సాయం కాలం సమయములో శరత్ కాలములా ఒకడు మబ్బులా ఒకడూ ఉన్న బలరామ కృష్ణులనూ,

కిశోరౌ శ్యామలశ్వేతౌ శ్రీనికేతౌ బృహద్భుజౌ
సుముఖౌ సున్దరవరౌ బలద్విరదవిక్రమౌ

ఆవు పాలు పిండడానికి వెళుతున్న కిశోర వయసులో ఉన్న నల్లవారూ తెల్లవారు అమ్మావరి గుర్తు కలవారు పెద్ద భుజం కలవారు.

ధ్వజవజ్రాఙ్కుశామ్భోజైశ్చిహ్నితైరఙ్ఘ్రిభిర్వ్రజమ్
శోభయన్తౌ మహాత్మానౌ సానుక్రోశస్మితేక్షణౌ

దయతో స్థిరమైన చూపులు గలవారు, ఎదుటివారికి వినోదం కలిగించే అందమైన ఆటలు ఆడేవారు, హారములూ వనమాలలూ ధరించినవారు, స్నానం చేసి మురికి పట్టని మంచి బట్టలు కట్టుకుని చందనాదులు రాసుకున్నవారు, అలంకరించుకున్నవారు,

ఉదారరుచిరక్రీడౌ స్రగ్విణౌ వనమాలినౌ
పుణ్యగన్ధానులిప్తాఙ్గౌ స్నాతౌ విరజవాససౌ

ప్రధానపురుషావాద్యౌ జగద్ధేతూ జగత్పతీ
అవతీర్ణౌ జగత్యర్థే స్వాంశేన బలకేశవౌ

సకల జగత్తుకూ వారే కారణం, వారే అధిపతులు.

దిశో వితిమిరా రాజన్కుర్వాణౌ ప్రభయా స్వయా
యథా మారకతః శైలో రౌప్యశ్చ కనకాచితౌ

తమ దివ్య కాంతితో అన్ని దిక్కులనూ ప్రకాశింపచేస్తూ, ఒకరు మరకత పర్వతములా ఒకరు  బంగారు పర్వతములా ఉన్నారు

రథాత్తూర్ణమవప్లుత్య సోऽక్రూరః స్నేహవిహ్వలః
పపాత చరణోపాన్తే దణ్డవద్రామకృష్ణయోః

రథం మీద నుంచి దూకి ఒక కట్టెలాగ వారి పాదాల మీద పడిపోయాడు. భగవానుని చూచిన ఆనందముతో కనులు చెమ్మగిల్లి ఆనందబాష్పాలు రాగా పులకించిన శరీరం కలవాడై, ఆనందముతో ఉత్సాహముతో నోట మాట రావట్లేదు.

భగవద్దర్శనాహ్లాద బాష్పపర్యాకులేక్షణః
పులకచితాఙ్గ ఔత్కణ్ఠ్యాత్స్వాఖ్యానే నాశకన్నృప

భగవాంస్తమభిప్రేత్య రథాఙ్గాఙ్కితపాణినా
పరిరేభేऽభ్యుపాకృష్య ప్రీతః ప్రణతవత్సలః

భగవానుడు దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు, ప్రీతితో దయతో

సఙ్కర్షణశ్చ ప్రణతముపగుహ్య మహామనాః
గృహీత్వా పాణినా పాణీ అనయత్సానుజో గృహమ్

బలరాముడు కూడా చేయిపట్టుకుని దగ్గరకు తీసుకుని ఇంటిలోకి తీసుకుని వెళ్ళాడు అకౄరున్ని.

పృష్ట్వాథ స్వాగతం తస్మై నివేద్య చ వరాసనమ్
ప్రక్షాల్య విధివత్పాదౌ మధుపర్కార్హణమాహరత్

స్వాగతం చెప్పి ఆసనం వేసి కూర్చోపెట్టి పాదాలు కడిగి తీర్థం నెత్తిన జల్లుకుని మధుపర్కాలు ఇచ్చి గోవును కూడా ఇచ్చి వస్త్రాలిచ్చి

నివేద్య గాం చాతిథయే సంవాహ్య శ్రాన్తమాడృతః
అన్నం బహుగుణం మేధ్యం శ్రద్ధయోపాహరద్విభుః

ఆయనకు భోజనం పెట్టి,

తస్మై భుక్తవతే ప్రీత్యా రామః పరమధర్మవిత్
మఖవాసైర్గన్ధమాల్యైః పరాం ప్రీతిం వ్యధాత్పునః

భోజనం చేసిన తరువాత పరమ ధర్మాత్ముడైన రాముడు చక్కని సుగంధమైన తాంబూలం ఇచ్చి ప్రీతిని కలిగించాడు

పప్రచ్ఛ సత్కృతం నన్దః కథం స్థ నిరనుగ్రహే
కంసే జీవతి దాశార్హ సౌనపాలా ఇవావయః

అపుడు నందుడు అడిగాడు. కసాయి వాని వద్ద  పశువులు లాగ దయ లేని వారి రాజ్యములో ఎలా ఉన్నారు

యోऽవధీత్స్వస్వసుస్తోకాన్క్రోశన్త్యా అసుతృప్ఖలః
కిం ను స్విత్తత్ప్రజానాం వః కుశలం విమృశామహే

తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరమ దుర్మార్గుడు పసి పిల్లలను చంపాడు. అలాంటి వాని రాజ్యములో ఎలా ఉన్నారు

ఇత్థం సూనృతయా వాచా నన్దేన సుసభాజితః
అక్రూరః పరిపృష్టేన జహావధ్వపరిశ్రమమ్

నందునితో బలరామ కృష్ణులతో చక్కగా సత్కరించబడిన నందుడు దారిలో కలిగిన బడలికను విడిచిపెట్టాడు.


                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

Popular Posts