Followers

Monday 21 April 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై నాలగవ అధ్యాయం


                                                             ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై నాలగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః
అపశ్యన్నివసన్గోపానిన్ద్రయాగకృతోద్యమాన్

బలరామ కృష్ణులు ఒక సారి తమ ఇంటికి వచ్చేసరికి నందాదులందరూ ఇంద్రయాగం చేయ సంకల్పించి అందుకు సన్నద్ధమవుతున్నారు.

తదభిజ్ఞోऽపి భగవాన్సర్వాత్మా సర్వదర్శనః
ప్రశ్రయావనతోऽపృచ్ఛద్వృద్ధాన్నన్దపురోగమాన్

అందరిలో ఉండి అన్నీ తెలుసుకోగల స్వామి నంద గోపాదులనూ వృద్ధులనూ ఇలా అడిగాడు.

కథ్యతాం మే పితః కోऽయం సమ్భ్రమో వ ఉపాగతః
కిం ఫలం కస్య వోద్దేశః కేన వా సాధ్యతే మఖః

మీరంతా ఏమి చేస్తున్నారు. మాకు చెప్పండి. ఏమిటీ సన్నాహమంతా. ఏమి కోరి చేస్తున్నారు. ఫలమేమీ ఉద్దేశ్యమేమి

ఏతద్బ్రూహి మహాన్కామో మహ్యం శుశ్రూషవే పితః
న హి గోప్యం హి సధూనాం కృత్యం సర్వాత్మనామిహ
అస్త్యస్వపరదృష్టీనామమిత్రోదాస్తవిద్విషామ్

మిమ్ములను ఎపుడూ సేవించే వారం మేము. ఉత్తములైన వారు ఏ విషయాన్నీ దాచరు కదా. నా వారూ ఇతరులూ అన్న దృష్టి లేని వారు, మిత్రులూ శత్రువులూ ఉదాసీనులు అన్న భావన లేని వారకు.

ఉదాసీనోऽరివద్వర్జ్య
ఆత్మవత్సుహృదుచ్యతే

దేన్నీ పట్టించుకోని ఉదాసీనున్ని శత్రువులా దూరం చేయాలి. తనవారైతే తన లాగే చూసుకోవాలి
అప్పటికే రాజనీతీ వేదశాస్త్రాలనూ చెబుతూ కూడా నాకేమీ తెలియదంటున్నాడు కృష్ణుడు

జ్ఞత్వాజ్ఞాత్వా చ కర్మాణి జనోऽయమనుతిష్ఠతి
విదుషః కర్మసిద్ధిః స్యాద్యథా నావిదుషో భవేత్

లోకములో ఎవరైనా ఒక పని చేయాలంటే అన్నీ తెలుసుకుని, ఒకటికిపది సార్లు తెలుసుకుని చేయాలి.
వాస్తవముగా తెలిసి ఉన్న వారు చేసిన పనే సిద్ధిస్తుంది.

తత్ర తావత్క్రియాయోగో భవతాం కిం విచారితః
అథ వా లౌకికస్తన్మే పృచ్ఛతః సాధు భణ్యతామ్

మీరు దేన్ని ఆలోచించి ఈ పని చేస్తున్నారు. ఇది వైదికమా లౌకికమా. తెలియక అడుగుతున్నా నాకు చెప్పండి

శ్రీనన్ద ఉవాచ
పర్జన్యో భగవానిన్ద్రో మేఘాస్తస్యాత్మమూర్తయః
తేऽభివర్షన్తి భూతానాం ప్రీణనం జీవనం పయః

ఇంద్రుడే పర్జన్యుడు. ఆయన ఆకారం అంతా మేఘాలు. అవి సకల ప్రాణులకూ సంతోషాన్ని కలిగించే వర్షాన్ని కురిపిస్తాయి. నీటిలో ఉన్న మేఘములకు అధిపతి ఐన ఇంద్రున్ని

తం తాత వయమన్యే చ వార్ముచాం పతిమీశ్వరమ్
ద్రవ్యైస్తద్రేతసా సిద్ధైర్యజన్తే క్రతుభిర్నరాః

అతను వర్షించిన వర్షముతో పండిన ద్రవ్యాలతో పూజిస్తున్నాము

తచ్ఛేషేణోపజీవన్తి త్రివర్గఫలహేతవే
పుంసాం పురుషకారాణాం పర్జన్యః ఫలభావనః

అతను నీరిస్తేనే మనం బతుకుతాము. ధర్మార్థకామాలు ఆయన ఇస్తేనే వస్తాయి మనకు. రకరకాల పనులు ఆశించి చేసే మానవులకు అన్ని ఫలాలిచ్చేది పర్జన్యుడే

య ఏనం విసృజేద్ధర్మం పరమ్పర్యాగతం నరః
కామాద్ద్వేషాద్భయాల్లోభాత్స వై నాప్నోతి శోభనమ్

అతని వలన ఇంత మేలు పొందిన మనం అతనికి ప్రత్యుపకారం చేస్తాం. ఆ ధర్మాన్ని విడిచిపెడితే, కోరికతో గానీ భయముతో గానీ లోభముతో కానీ వదిలిపెట్టడం క్షేమం కాదు

శ్రీశుక ఉవాచ
వచో నిశమ్య నన్దస్య తథాన్యేషాం వ్రజౌకసామ్
ఇన్ద్రాయ మన్యుం జనయన్పితరం ప్రాహ కేశవః

ఇలా మాట్లాడిన నందుని మాటలు విన్న కేశవుడు ఇంద్రునికి కోపం వచ్చేలా మాట్లాడాడు. ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
కర్మణా జాయతే జన్తుః కర్మణైవ ప్రలీయతే
సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవాభిపద్యతే

ఈ విషయం నాకు తెలియదే? వర్షం ఇంద్రుడు కురిపిస్తాడా. మనం చేసుకున్న కర్మతో బతుకుతాము. అతని కర్మతోనే చస్తాడు. సుఖ దుఃఖాలూ భయమూ సంపదా అన్నీ కర్మ ఫలమే.

అస్తి చేదీశ్వరః కశ్చిత్ఫలరూప్యన్యకర్మణామ్
కర్తారం భజతే సోऽపి న హ్యకర్తుః ప్రభుర్హి సః

భగవంతుడు ఏదో ఒక పని చేసేవారికి ఇస్తాడు ఫలితం. ఏ పనీ చేయని వారకు ఏ ఫలితం ఇస్తాడు

కిమిన్ద్రేణేహ భూతానాం స్వస్వకర్మానువర్తినామ్
అనీశేనాన్యథా కర్తుం స్వభావవిహితం నృణామ్

ఎవరి కర్మ ఫలం వారు అనుభవిస్తూ ఉంటే మధ్యలో ఇంద్రునితో ఏమి పని. మానవులకు స్వభావముగా ఏమేమి విధించబడ్డాయో వాటిని ఇంద్రుడు మారుస్తాడా.

స్వభావతన్త్రో హి జనః స్వభావమనువర్తతే
స్వభావస్థమిదం సర్వం సదేవాసురమానుషమ్

పుణ్యాత్ములుంటే వర్షం కురుస్తుంది, పాపాత్ములుంటే వర్షం కురవదు. కర్మ చేయకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. స్వభావం బట్టే లోకమంతా ఉంది. దేవ దానవ మానవాది సకల జగత్తు స్వభావం బట్టే ఉంటుంది.

దేహానుచ్చావచాఞ్జన్తుః ప్రాప్యోత్సృజతి కర్మణా
శత్రుర్మిత్రముదాసీనః కర్మైవ గురురీశ్వరః

వారి వారి కర్మల బట్టి వారికి ఆయా దేహాలు వస్తాయి. ఒకడు శత్రువు మిత్రుడూ ప్రభువూ గురువూ ఉదాసీనుడు అయ్యారంటే కర్మే కారణం.కర్మ బట్టే వస్తాయి. అందుకు అందరూ ఎవరి కర్మను వారు పూజించండి. కర్మే గురువు కర్మే ఈశ్వరుడు. దేనిని ఆశ్రయించి అందరూ బతుకుతున్నారో అదే దైవం.

తస్మాత్సమ్పూజయేత్కర్మ స్వభావస్థః స్వకర్మకృత్
అన్జసా యేన వర్తేత తదేవాస్య హి దైవతమ్

పెళ్ళి చేసుకుని జీవితాంతం పోషించే భర్తను వదిలిపెట్టి జారుడి దగ్గరకు వెళ్ళడం ఎంత తప్పో మనకేది ఆధారమో దాన్ని వదలడమూ అంతే తప్పు.

ఆజీవ్యైకతరం భావం యస్త్వన్యముపజీవతి
న తస్మాద్విన్దతే క్షేమం జారాన్నార్యసతీ యథా

వర్తేత బ్రహ్మణా విప్రో రాజన్యో రక్షయా భువః
వైశ్యస్తు వార్తయా జీవేచ్ఛూద్రస్తు ద్విజసేవయా

బ్రాహ్మణుడు వేదముతో రాజులు పాలనతో వైశ్యులు వ్యాపారముతో శూద్రుడు గోబ్రాహ్మణులను సేవించి బతుకుతాడు, వ్యవసాయదారులు, గోవులు మొదలైనవాటిలో మన వృత్తి గోసేవ

కృషివాణిజ్యగోరక్షా కుసీదం తూర్యముచ్యతే
వార్తా చతుర్విధా తత్ర వయం గోవృత్తయోऽనిశమ్

సత్త్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్త్యన్తహేతవః
రజసోత్పద్యతే విశ్వమన్యోన్యం వివిధం జగత్

ప్రపంచం పుట్టాలంటే రజస్సూ, నడవాలంటే సత్వం సంహారానికి తమో గుణం కావాలి.

రజసా చోదితా మేఘా వర్షన్త్యమ్బూని సర్వతః
ప్రజాస్తైరేవ సిధ్యన్తి మహేన్ద్రః కిం కరిష్యతి

మేఘాలు కూడా రజో గుణముతో పుడతాయి. అవి వర్షిస్తాయి. దానితో పంట పండుతుంది. ఇందులో మహేంద్రుడు చేసేదేముంది

న నః పురోజనపదా న గ్రామా న గృహా వయమ్
వనౌకసస్తాత నిత్యం వనశైలనివాసినః

ఊళ్ళూ పల్లెలూ ఇళ్ళూ పట్టణాలూ ఉన్నవారు చేసుకోవాలి ఇవన్నీ. మనకేమున్నాయి. మనకు బళ్ళే ఇళ్ళు.
అడవిలో పర్వతాలలో నివాసముంటాము. ఒక ఇళ్ళూ ఒక ఊరువారైతే హోమమూ యజ్ఞ్యమూ చేయాలి.

తస్మాద్గవాం బ్రాహ్మణానామద్రేశ్చారభ్యతాం మఖః
య ఇన్ద్రయాగసమ్భారాస్తైరయం సాధ్యతాం మఖః

మనం గోసేవ చేస్తామో, బ్రాహ్మణులు మేలు చేస్తున్నారు, పంటలను పర్వతం ఇస్తోంది. ఈ మూటినీ పూజించండి. వీటి వలనే మన బతుకు బండి కదులుతోంది.

పచ్యన్తాం వివిధాః పాకాః సూపాన్తాః పాయసాదయః
సంయావాపూపశష్కుల్యః సర్వదోహశ్చ గృహ్యతామ్

ఇంద్రయాగానికి మీరు తెచ్చుకున్న సామాగ్రితో గోవర్థన యాగాన్ని చేసి బ్రాహ్మణులను పూజిద్దాము. పప్పూ పాయసం చేయండి బ్రాహమణులకు భోజనం చేయండి. అరిసలూ అప్పాలూ మొదలైనవి చేయండి. ఆవులను దగ్గరకు తీసుకోంది. బ్రాహ్మణులు యజ్ఞ్యం చేయనీయండి.

హూయన్తామగ్నయః సమ్యగ్బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః
అన్నం బహుగుణం తేభ్యో దేయం వో ధేనుదక్షిణాః

 వారికి బాగా భోజనం పెట్టండి. దక్షిణలు ఇవ్వండి. గోవులకు పెట్టండి.

అన్యేభ్యశ్చాశ్వచాణ్డాల పతితేభ్యో యథార్హతః
యవసం చ గవాం దత్త్వా గిరయే దీయతాం బలిః

కుక్కలూ చండాలురూ దీనులకూ పతితులకూ బిక్షుకులకూ ఆహారం పెట్టండి. గోవులకు గడ్డీ, గోవర్ధనానికి పూజ చేసి ఆహారం ఇవ్వండి.

స్వలఙ్కృతా భుక్తవన్తః స్వనులిప్తాః సువాససః
ప్రదక్షిణాం చ కురుత గోవిప్రానలపర్వతాన్

మనం కూడా స్నానం చేసి అలంకరించుకుని గోవుల గోవర్థము చుట్టూ బ్రాహ్మణుల చుట్టూ ప్రదక్షిణం చేద్దాం

ఏతన్మమ మతం తాత క్రియతాం యది రోచతే
అయం గోబ్రాహ్మణాద్రీణాం మహ్యం చ దయితో మఖః

ఇది నా అభిప్రాయం, మీకుకూడా రుచిస్తే చేయండి. ఈ యజ్ఞ్యం గోవులకూ బ్రాహ్మణులకూ పర్వతములకూ నాకు కూడా ఇష్టము

శ్రీశుక ఉవాచ
కాలాత్మనా భగవతా శక్రదర్పజిఘాంసయా
ప్రోక్తం నిశమ్య నన్దాద్యాః సాధ్వగృహ్ణన్త తద్వచః

ఇంద్రుని గర్వాన్ని పోగొట్టాలని కాల రూపుడైన పరమాత్మ ఇలా చెప్పాడు. అందరూ కృష్ణుని వాక్యం బాగుందన్నారు.

తథా చ వ్యదధుః సర్వం యథాహ మధుసూదనః
వాచయిత్వా స్వస్త్యయనం తద్ద్రవ్యేణ గిరిద్విజాన్

పరమాత్మ ఏమి చెప్పారో అలాంటి ఏర్పాటే చేసారు. బ్రాహ్మణులని పిలిచి స్వస్తి వాచనం చేసారు. పర్వతాలనూ గోవులనూ బ్రాహ్మణులనూ

ఉపహృత్య బలీన్సమ్యగాదృతా యవసం గవామ్
గోధనాని పురస్కృత్య గిరిం చక్రుః ప్రదక్షిణమ్

భోజనం పెట్టారు. గోవులను తీసుకుని పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసారు. నడవలేని వారు బళ్ళుకట్టుకుని వెళ్ళారు.

అనాంస్యనడుద్యుక్తాని తే చారుహ్య స్వలఙ్కృతాః
గోప్యశ్చ కృష్ణవీర్యాణి గాయన్త్యః సద్విజాశిషః

గోపికలు కూడా పరమాత్మ లీలలను గానం చేస్తూ బ్రాహ్మణుల ఆశీర్వచనం తీసుకుని

కృష్ణస్త్వన్యతమం రూపం గోపవిశ్రమ్భణం గతః
శైలోऽస్మీతి బ్రువన్భూరి బలిమాదద్బృహద్వపుః

గోవర్థనానికి బలి పెట్టారు. అది తింటుందా లేదా అని అనుమానిస్తున్నారు గోపాలురు. వారికి తృప్తి కలిగించడానికి స్వామి "శైలోస్మి" అనుకుని కొండలో చేరి ఆ అన్నమంతా తిన్నాడు. పర్వతమంత శరీరం తీసుకున్నాడు

తస్మై నమో వ్రజజనైః సహ చక్ర ఆత్మనాత్మనే
అహో పశ్యత శైలోऽసౌ రూపీ నోऽనుగ్రహం వ్యధాత్

అందులో కూర్చుని తింటున్నాడు, బయట కృష్ణుని రూపములో ఉండి తనకే తనవారితో కలసి నమస్కారం చేసుకుంటున్నాడు. అందరి చేతా దండం పెట్టిస్తున్నాడు.

ఏషోऽవజానతో మర్త్యాన్కామరూపీ వనౌకసః
హన్తి హ్యస్మై నమస్యామః శర్మణే ఆత్మనో గవామ్

చూసారా ఈ పరవతాన్ని అవమానిస్తే మనకు హాని జరుగుతుంది. ఈ పర్వతాన్ని పూజిస్తే అన్నీ లభిస్తాయి. మన సంతోషం కోసం సుఖం కోసం హితం కోసం , ఈ పర్వతానికి నమస్కారం చేద్దాం.

ఇత్యద్రిగోద్విజమఖం వాసుదేవప్రచోదితాః
యథా విధాయ తే గోపా సహకృష్ణా వ్రజం యయుః

పర్వతానికీ గోవర్ధనానికీ గురువులకూ బ్రాహ్మణులకూ పరమాత్మ చేత ప్రేరేపించబడినవారై, ఇలా చేసి అందరూ కలసి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళారు

                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts