Followers

Saturday 26 October 2013

శ్రీ చిలుకూరు బాలాజీ



చిలుకూరు బాలాజీకి ఎందరెందరో భక్తులు ఉన్నారు. ప్రధానంగా ఆయన విద్యార్థులకి, ఉద్యోగులకి ఆరాధ్య దైవం. విదేశీ యానం గురించి కలలు గనే వారికి ఈ స్వామీ ఆశీస్సులు తోడైతే క్షణాల్లో అది సాకారం అవుతుంది. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న విద్యార్థులకు వీసా వస్తుందని విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకం ఎంతగా బలపడిందంటే చిలుకూరు బాలాజీకి వీసా వెంకటేశ్వరుడనే పేరు నామాంతరంగా స్థిరపడింది. చిలుకూరు వెంకన్న దేవాలయం గురించి విననివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. హైదరాబాదు పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండీ, వివిధ ఇతర రాష్ట్రాల నుంచీ కూడా చిలుకూరు బాలాజీ దేవళానికి భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా పదిహేను ఏళ్లుగా ఎక్కడెక్కడి నుంచో చిలుకూరు బాలాజీ భక్తులు పోటెత్తి వస్తున్నారు. హైదరాబాదు నగర శివార్లలో ఉన్నఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేక సందర్భాల్లో కిక్కిరిసిన జనంతో తిరుమలను తలపిస్తుంది. మొదట్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఒక చిన్నఆలయం కాగా ఇపుడది నిత్యం రద్దీగా ఉండే క్షేత్రంగా బాగా ప్రసిద్ధి చెందింది.
ఇలా చేయాలి...
చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్ళే భక్తులు గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి, మొక్కుకుంటారు. ఆ కోరిక నెరవేరగానే మరోసారి గుడికి వెళ్ళి 101 సార్లు ప్రదక్షిణలు చేసి స్వామిని సేవిస్తారు. ఇది ఇక్కడి ఆనవాయితీ. అలా చేస్తే చి బాలాజీ కరుణించి తమ కష్టాలు తొలగిస్తాడని, కోరికలు తీరుస్తాడని భక్తుల ఘన విశ్వాసం.
చిలుకూరు బాలాజీ ఆలయం ఉస్మాన్ సాగర్ తీరంలో ఉంది. ఈ గ్రామం చాలా పురాతనమైంది. పది, పన్నెండు శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో చిలుకూరు ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈమేరకు కొన్ని శాసనాలూ ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు ఈ శాసనాలలో లిఖించి ఉంది. అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు కూడా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించారని చరిత్ర చెబుతోంది. భద్రాచల రామాలయం కంటే చిలుకూరు బాలాజీ ఆలయమే తొలుత కట్టబడినదని అంటారు. ఈ ఆలయంలో భక్తులందరినీ ఒకేలా పరిగణిస్తారు. ఇక్కడ డబ్బుతో ప్రత్యేక దర్శనాలు, ఇతర సేవలు లభ్యం కావని... అందరూ స్వామిని ఒకేలా దర్శించుకోవచ్చునని అంటారు.

Popular Posts