Followers

Saturday 22 March 2014

శ్రీమధాగవతం పంచమ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
తస్య మూలదేశే త్రింశద్యోజనసహస్రాన్తర ఆస్తే యా వై కలా భగవతస్తామసీ సమాఖ్యాతానన్త ఇతి
సాత్వతీయా ద్రష్టృదృశ్యయోః సఙ్కర్షణమహమిత్యభిమానలక్షణం యం సఙ్కర్షణమిత్యాచక్షతే

ఈ పాతాళము యొక్క మూల ప్రాంతములో ముప్పై వేల యోజనాల దూరములో పరమాత్మ యొక్క కల అయిన అనంతుడూ, సంకర్షణుడు. కల తామసీ కల అయిన ఈయన చేసేది సాత్వతీయమైన పని. భాగవతానికి పేరు సాత్వత సంహిత అని. సతతం తపస్యంతియే తే సాత్వతా. పరమాత్మ కీర్తిని వృద్ధిని పొందించేవారు సాత్వతులు. పారమార్ధిక జ్ఞ్యాన వంతులు పారమార్థిక జ్ఞ్యాన ప్రబోధికులు సాత్వతులు. అనంతుడు తామస మూర్తి అయినా ఆయన పారమార్ధిక జ్ఞ్యానన్ని ఉపదేశిస్తాడు. నారాయణుడు బ్రహ్మ ఆది శేషుడు పరాశరుడు మైత్రేయుడు ఉద్దవుడు ఇలా భాగవతాన్ని ప్రచారం చేసే వరుసలో అనంతుడు కూడా ఉన్నాడు.
 ద్రష్టృదృశ్యయోః సఙ్కర్షణమహం - సంకర్షణుడు బాగా ఆకర్షిస్తాడు. ఒక వస్తువు చూడదగినదీ చూచేవాడూ ఉన్నాడు. చూడదగినదీ అంటే చూడబడే దానికీ చూచేవాడికీ పరస్పరం ఆకర్షణ ఉన్నది. నేను దానిని ఆకర్షించుకుంటున్నానని ద్రష్ట అనుకుంటాడు. ఇలా "నేను" అనే భావం వచ్చేది ఈయన వల్లనే. సంకర్షనుని అధిష్ఠానం అహంకారం. శంకరుడు గానీ సంకర్షణుడు గానీ అభిమాన దేవత.

యస్యేదం క్షితిమణ్డలం భగవతోऽనన్తమూర్తేః సహస్రశిరస ఏకస్మిన్నేవ శీర్షణి ధ్రియమాణం
సిద్ధార్థ ఇవ లక్ష్యతే

అనంతుని వేయి శిరస్సులో ఏదో ఒక శిరస్సులో ఏదో ఒక కోణములో ఇంత పెద్ద భూమండలం ఒక ఆవగింజలా భాసిస్తుంది.

యస్య హ వా ఇదం కాలేనోపసఞ్జిహీర్షతోऽమర్షవిరచితరుచిరభ్రమద్భ్రువోరన్తరేణ సాఙ్కర్షణో
నామ రుద్ర ఏకాదశవ్యూహస్త్ర్యక్షస్త్రిశిఖం శూలముత్తమ్భయన్నుదతిష్ఠత్

ఈయనే ప్రళయ కాలములో లోకాలను సంహరించదలచిన వాడై కోపముతో భృకుటి ముడి వేస్తాడు. దాని నుంచి ఒక రుద్రుడు పుడతాడు. పద కొండు రూపాలలో పుట్టి మూడు కన్నులూ మూడు శిఖలతో త్రిశూలాన్ని తిప్పుతూ లేస్తాడు.

యస్యాఙ్ఘ్రికమలయుగలారుణవిశదనఖమణిషణ్డమణ్డలేష్వహిపతయః సహ
సాత్వతర్షభైరేకాన్తభక్తియోగేనావనమన్తః స్వవదనాని పరిస్ఫురత్కుణ్డలప్రభామణ్డితగణ్డ
స్థలాన్యతిమనోహరాణి ప్రముదితమనసః ఖలు విలోకయన్తి

ఈయన పాదపద్మముల యొక్క లేలేత ఎర్రని గోళ్ళ సమూహాన్ని ఏకాంత భక్తులు నమస్కరిస్తారు. అహిపతులందరూ కలిసి పరమాత్మ పాద స్పర్శతో కలిగిన ఆనందమును వికసించిన ముఖముతో ఎదుటి వారి ముఖాన్ని చూచుకుంటూ వారి ఆనందాన్ని చూచి ఆనందిస్తూ ఉంటారు.

యస్యైవ హి నాగరాజకుమార్య ఆశిష ఆశాసానాశ్చార్వఙ్గవలయవిలసితవిశదవిపులధవల
సుభగరుచిరభుజరజతస్తమ్భేష్వగురుచన్దనకుఙ్కుమపఙ్కానులేపేనావలిమ్పమానాస్తద్
అభిమర్శనోన్మథితహృదయమకరధ్వజావేశరుచిరలలితస్మితాస్తదనురాగమదముదితమద
విఘూర్ణితారుణకరుణావలోకనయనవదనారవిన్దం సవ్రీడం కిల విలోకయన్తి

ఇక నాగరాజ పుత్రికలు ఈయన ఆశీర్వాదాన్ని కోరుతూ పరమాత్మ ఆదిశేషుని భుజాల మీద గంధమూ చందనాన్ని వేస్తూ ఉంటారు. ప్రియుని శరీర స్పర్శ వలన కలిగిన మన్మధ వికారముతో సంతోషముగా చూస్తూ ఉంటారు.

స ఏవ భగవాననన్తోऽనన్తగుణార్ణవ ఆదిదేవ ఉపసంహృతామర్షరోషవేగో లోకానాం స్వస్తయ ఆస్తే

ఈయన గుణములకు అంతము లేదు కాబట్టి ఈయన బలమునకు అంతు లేదు కాబట్టి ఈయనను అనంతుడని అంటారు. ఈ నాగపుత్రికలు ఈ రకమైన సేవ చేసి అతనిలో కూడా మన్మధ వికారం కలగడానికి కారణం అతని కోపం తగ్గించడం.

ధ్యాయమానః సురాసురోరగసిద్ధగన్ధర్వవిద్యాధరమునిగణైరనవరతమదముదితవికృత
విహ్వలలోచనః సులలితముఖరికామృతేనాప్యాయమానః స్వపార్షదవిబుధయూథపతీనపరిమ్లానరాగనవ
తులసికామోదమధ్వాసవేన మాద్యన్మధుకరవ్రాతమధురగీతశ్రియం వైజయన్తీం స్వాం వనమాలాం నీల
వాసా ఏకకుణ్డలో హలకకుది కృతసుభగసున్దరభుజో భగవాన్మహేన్ద్రో వారణేన్ద్ర ఇవ కాఞ్చనీం
కక్షాముదారలీలో బిభర్తి

ఈయన దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషులతో సేవించబడుతూ నిరంతరం మదముతో ఎఱ్ఱబడిన నేత్రములు కలవాడై ఉంటాడు. ఇతని నిగ్రహం పోయి అనుగ్రహం కలిగి, అనుగ్రహముతో కూడిన చిరునవ్వుతో కలిగిన చూపులు చూస్తూ, తన చుట్టు పక్కల ఉండి అన్ని రకముల సేవలు చేసే వారిని చల్లని చూపుతో చూస్తూ ఏ మాత్రం వాడని ప్రేమ గలవాడై, అప్పుడే అంకురించిన తులసి యొక్క రసాన్ని పానం చేస్తూ, ఆ సుగంధం మీద ఆశతో తుమ్మెదలు వచ్చి చుట్టు తిరుగుతూ ఉండగా, తాను ధరించిన వనమాల సౌగంధ్యాన్ని చూడడానికి తుమ్మెదలన్నీ వస్తాయి. వనమాలలో పదహారు రకాల పుష్పాలు ఉంటాయి. ఇతను నీలాంబరుడు (తామసుడు కాబట్టి నల్లని వస్త్రం ధరించి ఉన్నాడు). ఇతనికి ఒకే కుండలం (పాము చూచినప్పుడు వినలేదు, విన్నప్పుడు చూడలేదు. అందుకే ఒకే చెవి). నాగలీ రోకలీ రెంటినీ భుజముల మీద పెట్టుకుని ఇతను ఏనుగు వలే ఈ వనమాలనూ ఆభరణాలనూ గొలుసునూ విలాసముగా వేసుకుని ఉన్నాడు.

య ఏష ఏవమనుశ్రుతో ధ్యాయమానో
ముముక్షూణామనాదికాలకర్మవాసనాగ్రథితమవిద్యామయం
హృదయగ్రన్థిం సత్త్వరజస్తమోమయమన్తర్హృదయం గత ఆశు నిర్భినత్తి
తస్యానుభావాన్భగవాన్స్వాయమ్భువో నారదః సహ తుమ్బురుణా సభాయాం బ్రహ్మణః సంశ్లోకయామాస

ఇలాంటి మహానుభావుని స్వరూపాన్ని ధ్యానం చేస్తే కాలం యొక్క కర్మ వాసనచే వచ్చిన అవిద్యా, సత్వ రజో తమోమయమైన హృదయ గ్రంధి తొలగిస్తుంది. సంకర్షణుని ప్రభావాన్ని నారదుడు ఇలా నిరంతరం కీర్తిస్తూ ఉన్నాడు.

ఉత్పత్తిస్థితిలయహేతవోऽస్య కల్పాః
సత్త్వాద్యాః ప్రకృతిగుణా యదీక్షయాసన్
యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్
నానాధాత్కథము హ వేద తస్య వర్త్మ

సృష్టి స్థితి లయములు (రాజస సాత్విక తామసిక) ఈ మూడు నిరంతరం పరమాత్మ సంకల్పము కటాక్షము వలననే జరుగుతాయి. పరమాత్మ రూపం నాశం లేనిది సృష్టి కూడా లేనిది (అకృతం). ఒకే పరమాత్మ తన సంకల్పముతో ఇన్ని రూపాలు ధరించి ఉంటాడు. అసలు పరమాత్మను చూడాలంటే అల్పబుద్ధులైన మనం ఎలా తెలుసుకోగలము.

మూర్తిం నః పురుకృపయా బభార సత్త్వం
సంశుద్ధం సదసదిదం విభాతి తత్ర
యల్లీలాం మృగపతిరాదదేऽనవద్యామ్
ఆదాతుం స్వజనమనాంస్యుదారవీర్యః

ఈయన గొప్ప దయతో మనకూ శరీరాన్నిచ్చాడూ, మనం చూడటానికి అతను కూడా శరీరాన్ని ఏర్పరచుకున్నాడు. పరమాత్మ తన దివ్య కృప చేత సకల జీవ రాశులకూ కావలసిన ఆహార విహారాలిచ్చాడు.

యన్నామ శ్రుతమనుకీర్తయేదకస్మాద్
ఆర్తో వా యది పతితః ప్రలమ్భనాద్వా
హన్త్యంహః సపది నృణామశేషమన్యం
కం శేషాద్భగవత ఆశ్రయేన్ముముక్షుః

ఇలాంటి పరమ కారుణికుడైన పరమాత్మ లీలలను మనం గానం చేస్తూ ఉండాలి. రోగార్తుడైనా కామార్తుడైనా కలహార్తుడైనా మోసగించబడినవాడైనా పలికిన నారాయణ నామం సకల జనుల పాపాన్ని సమూలముగా తొలగిస్తుంది. ఇన్ని చేస్తున్నప్పుడు మోక్షం మీద కోరిక ఉన్నవాడెవడు పరమాత్మని ఆశ్రయించడు.

మూర్ధన్యర్పితమణువత్సహస్రమూర్ధ్నో
భూగోలం సగిరిసరిత్సముద్రసత్త్వమ్
ఆనన్త్యాదనిమితవిక్రమస్య భూమ్నః
కో వీర్యాణ్యధి గణయేత్సహస్రజిహ్వః

ఈయన చేసే సృష్టి స్థితి లయములను ఎవరు అర్థం చేసుకోగలరు. వేయి శిరస్సులు గల పరమాత్మలో భూగోళము ఏదో ఒక శిరస్సు మీద భూమి ఒక అణువులా ఉంది. పరమాత్మ ఆదిశేషుని పరాక్రమం దేనితో మనం కొలవగలము. ఒక హద్దూ మర్యాద లేనిది ఆయన పరాక్రమం. వేయి ఏనుగుల బలం ఉన్న వాడు కూఒడా తన బాధను తాను తొలగించలేడు, పరమాత్మ అనుగ్రహముతోనే పోగొట్టుకుంటాడు. వేయి నాలుకలున్న వాడు కూడా పరమాత్మ అనంతుని పరాక్రమం లెక్కపెట్టలేడు

ఏవమ్ప్రభావో భగవాననన్తో
దురన్తవీర్యోరుగుణానుభావః
మూలే రసాయాః స్థిత ఆత్మతన్త్రో
యో లీలయా క్ష్మాం స్థితయే బిభర్తి

హద్దు లేని పరాక్రమం గలిగిన ఈయన ఎక్కడో పాతాళ లోకములో ఉండి తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఎక్కడ ఎక్కువ ఏకాంతం లభిస్తుందో అలాంటి చోట ఉంటాడు. ఈయన విలాసముగా ఇంత పెద్ద భూమండలాన్నీ వహిస్తున్నాడు, రక్షిస్తున్నాడు

ఏతా హ్యేవేహ నృభిరుపగన్తవ్యా గతయో యథాకర్మవినిర్మితా యథోపదేశమనువర్ణితాః
కామాన్కామయమానైః

మానవులు తిరగదగిన ప్రదేశాలన్నీ చెప్పాను, ఇది దాటి మానవుడు వెళ్ళలేడు. ఈ లోకాలన్నీ మనం ఆచరించే కర్మల ఫలితాన్ని ప్రసాదించేవే. ఉపదేశానుగుణముగా నీకు వర్ణించాను. నిరంతరం వీరు తమ కోరికలను తీర్చమని పరమాత్మను కోరుతూ ఉంటారు.

ఏతావతీర్హి రాజన్పుంసః ప్రవృత్తిలక్షణస్య ధర్మస్య విపాకగతయ ఉచ్చావచా విసదృశా యథా
ప్రశ్నం వ్యాచఖ్యే కిమన్యత్కథయామ ఇతి

ఇంతవరకూ నీవడిగినవన్నీ చెప్పాను. నిరంతరం కోరికలతో మగ్గే వారు ఎలా పుడతారు, ఎలాంటి రూపము పొందుతారు, ఎలాంటి పనులు చేస్తారో చెప్పాను. మానవుడు ప్రవృత్తి లక్షణుడు.  ఈ లక్షణం గలవాడు ధర్మమును ఆచరించుట వలన ఆచరించిన కర్మ పక్వమవుతుంది. మనమాచరించిన కర్మా జ్ఞ్యానం పక్వమైతేనే మనం పరలోకాలలో సుఖ దుఃఖాలను పొందుతాము. నీవడిగినవన్నీ ప్రశ్నకు తగ్గట్టుగా చెప్పాము. 

Popular Posts