Followers

Tuesday 25 March 2014

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం ఐదవ అధ్యాయం


శ్రీనారద ఉవాచ
పౌరోహిత్యాయ భగవాన్వృతః కావ్యః కిలాసురైః
షణ్డామర్కౌ సుతౌ తస్య దైత్యరాజగృహాన్తికే

తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదమ్
పాఠయామాసతుః పాఠ్యానన్యాంశ్చాసురబాలకాన్

యత్తత్ర గురుణా ప్రోక్తం శుశ్రువేऽనుపపాఠ చ
న సాధు మనసా మేనే స్వపరాసద్గ్రహాశ్రయమ్

ఏకదాసురరాట్పుత్రమఙ్కమారోప్య పాణ్డవ
పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్

చండా మర్కులు శుక్రాచార్యుని కొడుకులు హిరణ్యకశిపుని దగ్గరే ఉంటారు. వారి దగ్గర ప్రహ్లాదున్ని ఇతర రాక్షస పిల్లలతో కలిసి చేర్పించాడు.
పరిపాలనకు కావలసిన నీతిని ఇది వరకే కోవిదుడైన ప్రహ్లాదునికి నేర్పించారు.
గురువు గారు చెప్పిన దాన్ని విన్నాడూ చదివాడు. కానీ మనసులో  గురువుగారు చెప్పినది మంచిది కాదు అనుకున్నాడు. "నేనూ ఇతరుడూ" అన్న భేధ బుద్ధి కలిగించే పాఠం మంచిదనిపించలేదు. 
హిరణ్యకశ్యపుడు ఇంటికి పిలిపించుకుని ప్రహ్లాదున్ని తొడ మీద కూర్చోపెట్టుకుని ఇనాళ్ళూ నీకు గురువు చెప్పిన దానిలో నీవేది మంచిది అనుకుంటున్నావు.

శ్రీప్రహ్లాద ఉవాచ
తత్సాధు మన్యేऽసురవర్య దేహినాం సదా సముద్విగ్నధియామసద్గ్రహాత్
హిత్వాత్మపాతం గృహమన్ధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత

జీవులు చెడు విషయము గ్రహించడం వలన నిరంతరం ఉద్వేగం,  కలత చెందిన బుద్ధి గలవారు. నేను నా వాడు, పరాయివాడు అన్న రాగ ద్వేషాలే చెడు. ఆత్మను పాడు చేసే అంధ కూపము వంటి ఇంటిని వదిలి అరణ్యమునకు వెళ్ళి శ్రీమన్నారాయణున్ని ఆరాధించడమే మన విధి

శ్రీనారద ఉవాచ
శ్రుత్వా పుత్రగిరో దైత్యః పరపక్షసమాహితాః
జహాస బుద్ధిర్బాలానాం భిద్యతే పరబుద్ధిభిః

సమ్యగ్విధార్యతాం బాలో గురుగేహే ద్విజాతిభిః
విష్ణుపక్షైః ప్రతిచ్ఛన్నైర్న భిద్యేతాస్య ధీర్యథా

గృహమానీతమాహూయ ప్రహ్రాదం దైత్యయాజకాః
ప్రశస్య శ్లక్ష్ణయా వాచా సమపృచ్ఛన్త సామభిః

వత్స ప్రహ్రాద భద్రం తే సత్యం కథయ మా మృషా
బాలానతి కుతస్తుభ్యమేష బుద్ధివిపర్యయః

బుద్ధిభేదః పరకృత ఉతాహో తే స్వతోऽభవత్
భణ్యతాం శ్రోతుకామానాం గురూణాం కులనన్దన

శత్రువుల యందు పక్షపాత బుద్ధి కలవారు శత్రువుల  బుద్ధిని మార్చేస్తారు. అని భావించి చిన్నగా నవ్వి, మళ్ళీ గురువుగారిని  పిలిచి పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. విష్ణు పక్షాన్ని ఆశ్రయించే వారు దరి చేరకుండా చూడమని చెప్పాడు. బ్రాహ్మణుల వద్దా, దాగి యున్న విష్ణు పక్షం వారి వలన ఇతని బుద్ధి పాడవకుండా చూడండి అని చెప్పాడు.
గురువు గారు ప్రహ్లాదుని ఇంటికి తీసుకెళ్ళి, అతన్ని లాలించి
ప్రహ్లాదా నీకు మేలవుగాక, నిజం చెప్పు, అబద్దం వద్దు ఇక్కడ ఇంతమంది పిల్లలున్నారు, వారందరినీ కాదని నీకీ విపరీత బుద్ధి ఎలా వచ్చింది. నీకిది స్వయముగానే వచ్చిందా ఇంకెవరైనా ఇలా చెప్పారా. కులాన్ని శొభింపచేసే వాడా దీనికి కారణమేమిటి.

శ్రీప్రహ్రాద ఉవాచ
పరః స్వశ్చేత్యసద్గ్రాహః పుంసాం యన్మాయయా కృతః
విమోహితధియాం దృష్టస్తస్మై భగవతే నమః

నావాడూ ఇతరుడు అన్న భేధ బుద్ధి ఎవరు మాయతో కలుగుతుందో, ఎవరు కలిగిస్తారో వాడికి నమస్కారం.

స యదానువ్రతః పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే
అన్య ఏష తథాన్యోऽహమితి భేదగతాసతీ

పరమాత్మ కటాక్షం మన మీద ఉంటే , పరమాత్మను మనం అనుసరిస్తే నేను వేరు వాడు వేరు అన్న బుద్ధి తొలగిపోతుంది.అతను వేరు నేను వేరు అనే అసతీ (చెడు) బుద్ది పరమాత్మను  ఆశ్రయిస్తే తొలగిపోతుంది.

స ఏష ఆత్మా స్వపరేత్యబుద్ధిభిర్దురత్యయానుక్రమణో నిరూప్యతే
ముహ్యన్తి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో హ్యేష భినత్తి మే మతిమ్

నేను వాడూ అనే భేధభావం దాటడానికి వీలులేని పరమాత్మ మాయననుసరించేవారికి కలుగుతుంది. వేదం తెలిసిన వారు కూడా ఈ విషయములో మోహం చెందుతారు. బ్రహ్మాదులు కూడా ఈ విషయములో మోహించబడతారు. ఎవరు బ్రహ్మాదుల బుద్ధిని భేధించారో వాడే నా బుద్ధినీ మార్చాడు.

యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్స్వయమాకర్షసన్నిధౌ
తథా మే భిద్యతే చేతశ్చక్రపాణేర్యదృచ్ఛయా

అయస్కాంతం దగ్గర ఇనుము ఎలా ఆకర్షించబడుతుందో నా మనస్సు కూడా పరమాత్మ సంకల్పముతో నా బుద్ధి మారుతోంది. ఇది స్వామి యొక్క కృప

శ్రీనారద ఉవాచ
ఏతావద్బ్రాహ్మణాయోక్త్వా విరరామ మహామతిః
తం సన్నిభర్త్స్య కుపితః సుదీనో రాజసేవకః

ఈ విధముగా గురువుగారికి గొప్ప బుద్ధి కల ప్రహ్లాదుడు చెప్పడు.

ఆనీయతామరే వేత్రమస్మాకమయశస్కరః
కులాఙ్గారస్య దుర్బుద్ధేశ్చతుర్థోऽస్యోదితో దమః

రాజు గారి కొడుకుని దండించలేక దీనులై, ప్రహ్లాదున్ని బెదిరించారు "మనకు అపకారం చేస్తున్నాడు. మన కులాన్ని భస్మం చేస్తున్నాడు. ప్రహ్లాదుని మీద దండోపాయాన్నే వాడాలి"

దైతేయచన్దనవనే జాతోऽయం కణ్టకద్రుమః
యన్మూలోన్మూలపరశోర్విష్ణోర్నాలాయితోऽర్భకః

రాక్షసులనే గంధపు తోటలో ముళ్ళ చెట్టు మొలిచింది. 

ఇతి తం వివిధోపాయైర్భీషయంస్తర్జనాదిభిః
ప్రహ్రాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనమ్

ఈ ముళ్ళ చెట్టు నుంచి వచ్చిన కర్రే రాక్షస వంశమనే గంధపు చెట్టును నరకడానికి నారం (గొడ్డలికుండే కట్టె) అయ్యాడు.
ఇలా రకరకాల ఉపాయాలతో బెదిరింపులతో త్రివర్గాన్ని చెప్పారు ప్రహ్లాదునికి. ధర్మార్థ కామములను బోధించారు.

తత ఏనం గురుర్జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయచతుష్టయమ్
దైత్యేన్ద్రం దర్శయామాస మాతృమృష్టమలఙ్కృతమ్

ప్రహ్లాదుడు తెలియవలసిన నాలుగూ తెలుసుకున్నాడు. ఇతనికి అన్ని విషయాలూ బాగా తెలిసాయని మహారాజు అనుగ్రహం పొందడానికి పిల్లవాడిని బాగా తయారు చేసి, మొదలు తల్లి వద్దకు పంపించి, అలంకరింపచేసి, ఆ పిల్లవాన్ని రాజుగారికి చూపించారు

పాదయోః పతితం బాలం ప్రతినన్ద్యాశిషాసురః
పరిష్వజ్య చిరం దోర్భ్యాం పరమామాప నిర్వృతిమ్



ఆరోప్యాఙ్కమవఘ్రాయ మూర్ధన్యశ్రుకలామ్బుభిః
ఆసిఞ్చన్వికసద్వక్త్రమిదమాహ యుధిష్ఠిర

ఆ పిల్లవాడు పాదాభివందనం చేయగానే హిరణ్యకశిపుడు ప్రహ్లాదున్ని కౌగిలించుకుని ఆనందాన్ని పొంది, తొడ మీద కూర్చోబెట్టుకుని, శిరస్సును ముద్దాడి, ఆనందబాష్పాలతో ప్రహ్లాదున్ని తడిపి
ప్రహ్లాదా నీవు చదివిన దానిలో ఏదైనా మంచి మాట చెప్పు. ఇంతకాలం నీవు గురువుగారి వద్ద ఏమి నేర్చుకున్నావో, అందులో నీకేమి బాగా వచ్చో దన్ని చెప్పు.

హిరణ్యకశిపురువాచ
ప్రహ్రాదానూచ్యతాం తాత స్వధీతం కిఞ్చిదుత్తమమ్
కాలేనైతావతాయుష్మన్యదశిక్షద్గురోర్భవాన్

శ్రీప్రహ్రాద ఉవాచ
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్
అర్చనం వన్దనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్

ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా
క్రియేత భగవత్యద్ధా తన్మన్యేऽధీతముత్తమమ్

భగవంతుని యందు నవ విధ భక్తులతో తనను తాను అర్పించుకోవడమే చక్కగా గురువుగారి దగ్గర చదువుకోవడం అనుకుంటున్నాను.
కాయికా: శ్రవణ కీర్తన పాదసేవనం
మానసిక: స్మర్ణం దాస్యం ఆత్మ నివేదనం
వాచికమైనవి మిగిలిన మూడు. ఇదే ఉత్తమ అధ్యయనం. 

నిశమ్యైతత్సుతవచో హిరణ్యకశిపుస్తదా
గురుపుత్రమువాచేదం రుషా ప్రస్ఫురితాధరః

బ్రహ్మబన్ధో కిమేతత్తే విపక్షం శ్రయతాసతా
అసారం గ్రాహితో బాలో మామనాదృత్య దుర్మతే

సన్తి హ్యసాధవో లోకే దుర్మైత్రాశ్ఛద్మవేషిణః
తేషాముదేత్యఘం కాలే రోగః పాతకినామివ

ఈ మాటలు విని పెదవులు అదరగా "బ్రహ్మ బధూ, ఇదేమిటి, శత్రు పక్షాన్ని ఆశ్రయించి సారము కాని దాన్ని మీరు ప్రహ్లాదునికి నేర్పించారా. లోకములో మైత్రీ అనే కప్పు కప్పుకుని స్నేహం చేసే వారు చాలామందే ఉన్నారు. వారు చేసిన పాపం ఊరికే పోదు. పాపము చేసిన వారికి రోగం వచ్చినట్లు ఫల కాలములో అది బయటపడుతుంది".  ఎందుకు మీరిలా చేసారు?

శ్రీగురుపుత్ర ఉవాచ
న మత్ప్రణీతం న పరప్రణీతం సుతో వదత్యేష తవేన్ద్రశత్రో
నైసర్గికీయం మతిరస్య రాజన్నియచ్ఛ మన్యుం కదదాః స్మ మా నః

మీ పిల్లవానికి మేము ఇలాంటివి చెబుతామా. ఇది మేము గానీ ఆశ్రమం బయట వారు గానీ చెప్పినది కాదు. ఇది ఇతని సహజ బుద్ధి. ఒకరు చెబితే వచ్చినది కాదు. కోపాన్ని కాస్త నిగ్రహించుకో. మాకు దుఃఖాన్ని ఇవ్వకు. 

శ్రీనారద ఉవాచ
గురుణైవం ప్రతిప్రోక్తో భూయ ఆహాసురః సుతమ్
న చేద్గురుముఖీయం తే కుతోऽభద్రాసతీ మతిః

ఆ మాట విని పిల్లవాడిని మళ్ళీ అడిగాడు. ఈ విషయం గురువుగారు చెప్పకుంటే ఈ అమంగళమైన బుద్ధి నీకు ఎలా వచ్చింది. 

శ్రీప్రహ్రాద ఉవాచ
మతిర్న కృష్ణే పరతః స్వతో వా మిథోऽభిపద్యేత గృహవ్రతానామ్
అదాన్తగోభిర్విశతాం తమిస్రం పునః పునశ్చర్వితచర్వణానామ్

సంసారములో ఉన్నవారికి ఇలాంటి బుద్ధి తనకు తానుగా వస్తుందా  లంచమిచ్చి నేర్చుకుందామన్నా ఇలాంటి బుద్ధి వస్తుందా? 
అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై
    చచ్చుచు  పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన  వారికిం
    చెచ్చెర పుట్టునే  పరులు చెప్పిన నైన నిజేచ్చనైన నే
    మిచ్చిన నైన కానలకు  నేగిననైన హరిప్రబోధముల్. 

న తే విదుః స్వార్థగతిం హి విష్ణుం దురాశయా యే బహిరర్థమానినః
అన్ధా యథాన్ధైరుపనీయమానాస్తేऽపీశతన్త్ర్యామురుదామ్ని బద్ధాః

ఇంద్రియములను జయించని వారూ, చీకటిన ప్రవేశించేవారూ, పునః పునః తింటున్నవే తినేవారికి (అనుభవించేవారికి) ఈ బుద్ధి కలుగుతుందా?
ఎవరైతే సంసారములో ఉండే సాంసారిక విషయములను పురుషార్థములుగా భావిస్తారో వారు పరమాత్మను పురుషార్థముగా తెలియజాలరు
కానని వాని నూత గొని కానని వాడు విశిష్ట వస్తువుల్
గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మ బద్ధులై
కానరు, విష్ణుఁగొందఱటఁగందు రకించన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా !

నైషాం మతిస్తావదురుక్రమాఙ్ఘ్రిం స్పృశత్యనర్థాపగమో యదర్థః
మహీయసాం పాదరజోऽభిషేకం నిష్కిఞ్చనానాం న వృణీత యావత్

పరమాత్మ మనందరికి సంసారమనే ముకుతాడు వేసాడు. దానితో బంధించబడిన మనం గుడ్డి వాడిని అనుసరించి వెళ్ళిన వారివంటి వారము 
సత్సంగము లభించనంత వరకూ సాంసారమైన అనర్థాన్ని తొలగించే పరమాత్మ పాద పద్మాన్ని కోరరు 

ఇత్యుక్త్వోపరతం పుత్రం హిరణ్యకశిపూ రుషా
అన్ధీకృతాత్మా స్వోత్సఙ్గాన్నిరస్యత మహీతలే

ఆహామర్షరుషావిష్టః కషాయీభూతలోచనః
వధ్యతామాశ్వయం వధ్యో నిఃసారయత నైరృతాః

అయం మే భ్రాతృహా సోऽయం హిత్వా స్వాన్సుహృదోऽధమః
పితృవ్యహన్తుః పాదౌ యో విష్ణోర్దాసవదర్చతి

విష్ణోర్వా సాధ్వసౌ కిం ను కరిష్యత్యసమఞ్జసః
సౌహృదం దుస్త్యజం పిత్రోరహాద్యః పఞ్చహాయనః

పరోऽప్యపత్యం హితకృద్యథౌషధం స్వదేహజోऽప్యామయవత్సుతోऽహితః
ఛిన్ద్యాత్తదఙ్గం యదుతాత్మనోऽహితం శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్

కోపముతో గుడ్డివాడై ఒడిలోంచి బాలున్ని కింద పారేసి రోషముతో కళ్ళు ఎర్రబడి "వీడిని చంపెయ్యండి, వీడే నా సోదరున్ని చంపాడు. పినతండ్రిని చంపిన శత్రువును దాసునిలాగ సేవిస్తున్నాడు. ఐదేళ్ళ పిల్లవాడు ఇప్పుడు విష్ణు పక్షం వహిస్తున్నాడు. వదిలిపెట్టడానికి వీలు లేని తల్లి తండ్రుల ప్రేమను ఐదేళ్ళప్పుడే వదిలిపెట్టినప్పుడు పెద్దయ్యాక ఆ విష్ణువునైనా ఎలా పట్టుకుంటాడు. శత్రువు పుత్రుడైనా వాడు మనకు హితం కలిగించేవాడైతే మందును సేవించినట్లు సేవించాలి. తన కొడుకైనా అపకారం చేసేవాడైతే శరీరములో వచ్చిన వ్యాధిలాగ తొలగించుకోవాలి" మందుకు తగ్గని రోగం వచ్చి శరీరం మొత్తం పాకుతుంటే దాన్ని తీసేసినట్లుగా 
  అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శే
    షాంగ శ్రేణికి రక్షసేయు క్రియ ఈ అజ్ఞుం కులద్రోహి దు
    స్సంగుం కేశవ పక్షపాతి అధముం జంపించి వీరవ్రతో
    త్తుంగ ఖ్యాతి చరించెదన్  కులము నిర్దోషంబు గావించెదన్

సర్వైరుపాయైర్హన్తవ్యః సమ్భోజశయనాసనైః
సుహృల్లిఙ్గధరః శత్రుర్మునేర్దుష్టమివేన్ద్రియమ్

అన్ని రకముల ఉపాయాలతో వీన్ని చంపెయ్యండి. విషం పెట్టీ, పాముల మీద పడుకోబెట్టి అగ్నిలో పడవేసి గానీ చంపెయ్యండి. ముని యొక్క చెడు ఇంద్రియం వంటి వాడు.మౌనాన్ని పాటించని ముని ఎలా  వాక్కుని వదిలిపెట్టాలో అలా ఇతన్ని మనం వధించి రాక్షస కులాన్ని బాగుచేసుకుందాము

నైరృతాస్తే సమాదిష్టా భర్త్రా వై శూలపాణయః
తిగ్మదంష్ట్రకరాలాస్యాస్తామ్రశ్మశ్రుశిరోరుహాః

వంకర పళ్ళతో (తిగ్మ) పెద్ద నోరు, ఎర్రని వెంట్రుకలు కలిగి అరుస్తూ నరకండి కొట్టండి చీల్చండీ అంటూ  త్రిశూలాన్ని తీసుకుని అన్ని అవయవాలలో పొడిచారు

నదన్తో భైరవం నాదం ఛిన్ధి భిన్ధీతి వాదినః
ఆసీనం చాహనన్శూలైః ప్రహ్రాదం సర్వమర్మసు

పరే బ్రహ్మణ్యనిర్దేశ్యే భగవత్యఖిలాత్మని
యుక్తాత్మన్యఫలా ఆసన్నపుణ్యస్యేవ సత్క్రియాః

పాపం చేసే వాడు ఆచరించే పుణ్య క్రియలలాగ ప్రహ్లాదుని మీద వారు చేసిన క్రియలన్నీ నిష్ఫలమయ్యాయి. 

ప్రయాసేऽపహతే తస్మిన్దైత్యేన్ద్రః పరిశఙ్కితః
చకార తద్వధోపాయాన్నిర్బన్ధేన యుధిష్ఠిర

దిగ్గజైర్దన్దశూకేన్ద్రైరభిచారావపాతనైః
మాయాభిః సన్నిరోధైశ్చ గరదానైరభోజనైః

హిమవాయ్వగ్నిసలిలైః పర్వతాక్రమణైరపి
న శశాక యదా హన్తుమపాపమసురః సుతమ్
చిన్తాం దీర్ఘతమాం ప్రాప్తస్తత్కర్తుం నాభ్యపద్యత

"ఇలాంటి వాడు" అని చెప్పడానికి వీలు కాని పరమాత్మ యందు (అనిర్దేశ్యుడు) మనసు లగ్నం చేసిన ప్రహ్లాదుని యందు ప్రయోగించబడిన శిక్షలన్నీ నిష్ఫలమయ్యాయి. అనిర్దేశ్యుడైన పరమాత్మని ధ్యానిస్తున్న ప్రహ్లాదుడు కూడా అనిర్దేశ్యుడయ్యాడు. రాక్షసులు చేస్తున్న అన్ని శ్రమలూ వృధా అవుతున్న కొద్దీ, నిర్భంధముతో మరీ మరీ ప్రయత్నిచారు. మామూలు ఏనుగులు సరిపోవని అష్ట దిగ్గజాలను తెప్పించి తొక్కించాడు, తక్షకాది సర్పాలను తెప్పించి కరిపించాడు, అభిచార హోమాలు చేయించాడు, పర్వతం మీద నుంచి కింద పడేసారు, రాక్షస మాయతో, ముక్కూ చెవులూ నోరూ గట్టిగా మూసారు, విషాన్నం పెట్టారు, భోజనం లేకుండా చేసారు, మంచి గాలి నిప్పు నీరు నీటిలో పర్వతాల కిందా ఆపి, ఇన్ని ప్రయత్నాలు చేసినా చంపలేకపోయాడు. ప్రహ్లాదుడు ఏ పాపమూ లేని వాడు. అలాంటి ఏ పాపం లేని ప్రహ్లాదున్ని పాపి అయిన హిరణ్యకశిపుడు ఏమీ చేయలేకపోయాడు. "నా ప్రయత్నముతో చావట్లేదంటే ఇతను నాకు మృత్యువు అవుతాడా" 

ఏష మే బహ్వసాధూక్తో వధోపాయాశ్చ నిర్మితాః
తైస్తైర్ద్రోహైరసద్ధర్మైర్ముక్తః స్వేనైవ తేజసా

వర్తమానోऽవిదూరే వై బాలోऽప్యజడధీరయమ్
న విస్మరతి మేऽనార్యం శునః శేప ఇవ ప్రభుః

అప్రమేయానుభావోऽయమకుతశ్చిద్భయోऽమరః
నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితా న వా

ఇతి తచ్చిన్తయా కిఞ్చిన్మ్లానశ్రియమధోముఖమ్
శణ్డామర్కావౌశనసౌ వివిక్త ఇతి హోచతుః

తన తేజస్సుతో అన్ని ఉపాయాలను చేధించాడు. బాలుడైనా ఇతనిది చాలా సూక్ష్మబుద్ధి, ఇన్ని అపకారాలు చేసినా వాటిని సునశ్యేఫునిలాగ తలావ్ట్లేదు. ఇతని ప్రభావం ఇంతా అని చెప్పలేము. ఇతనికి ఎక్కడినుంచీ భయం కలగదు. ఇతనికి మరణం లేదు. ఇలాంటి వానితో విరోధం పెట్టుకున్నందు వలన నాకే మృత్యువు వస్తుందేమో. అన్ని లోకాలూ గెలిచాడూ, ఐదేళ్ళ పిల్లవాన్ని గెలవలేకపోయాను. ఏమీ చేయలేక ముఖం వాడిపోయి, అధోముఖుడై ఉండగా గురుపుత్రులు వచ్చి ఇలా అన్నారు

జితం త్వయైకేన జగత్త్రయం భ్రువోర్విజృమ్భణత్రస్తసమస్తధిష్ణ్యపమ్
న తస్య చిన్త్యం తవ నాథ చక్ష్వహే న వై శిశూనాం గుణదోషయోః పదమ్

నీవు కనుబొమ్మ ముడివేస్తే మూడు లోకాలూ వణికిపోయాయి. అలాంటి నీవు బాల్యములో ఉన్న పిల్లవాడి గుణాల గురించి బాధపడుతున్నావా

ఇమం తు పాశైర్వరుణస్య బద్ధ్వా నిధేహి భీతో న పలాయతే యథా
బుద్ధిశ్చ పుంసో వయసార్యసేవయా యావద్గురుర్భార్గవ ఆగమిష్యతి

వరుణ పాశాలతో కట్టేసి అక్కడే ఉంచు. వయసుతో పెద్దలను సేవించడం వలన గురువు బోధ వలనా బుద్ధి మారుతుంది. మా తండ్రి శుక్రాచార్యులు వచ్చేవరకు అలాగే ఉంచు

తథేతి గురుపుత్రోక్తమనుజ్ఞాయేదమబ్రవీత్
ధర్మో హ్యస్యోపదేష్టవ్యో రాజ్ఞాం యో గృహమేధినామ్

దాని హిరణ్యకశిపుడు ఒప్పుకుని "ఇతనికి గృధస్థాశ్రమ ధర్మాలని రాజ ధర్మాలనీ చెప్పండి. ధర్మార్థ కామాలనే బోధించండి. ఎక్కువగా కామ ప్రయోజనాన్నే చెప్పండి

ధర్మమర్థం చ కామం చ నితరాం చానుపూర్వశః
ప్రహ్రాదాయోచతూ రాజన్ప్రశ్రితావనతాయ చ

యథా త్రివర్గం గురుభిరాత్మనే ఉపశిక్షితమ్
న సాధు మేనే తచ్ఛిక్షాం ద్వన్ద్వారామోపవర్ణితామ్

వారి మాటలు విని వినయ సంపన్నుడికీ, చెప్పినట్లు వినేవాడైన ప్రహ్లాదునికి అవన్నీ చెప్పడానికి ఉద్యక్తులయ్యారు. గురువు గారు త్రివర్గాలని చెబుతున్నారని, వారు ద్వంద్వాల మీదే మోజు ఎక్కువగా ఉన్నవారని తెలుసు కాబట్టి వాటి మీద ఎక్కువ మోజు చూపలేదు. ఇలా బోధించే గురువుగారు తన పనులలో తాను ఉండగా తన తోటి పిల్లలందరూ ఆటకు పిలిచారు.

యదాచార్యః పరావృత్తో గృహమేధీయకర్మసు
వయస్యైర్బాలకైస్తత్ర సోపహూతః కృతక్షణైః

అథ తాన్శ్లక్ష్ణయా వాచా ప్రత్యాహూయ మహాబుధః
ఉవాచ విద్వాంస్తన్నిష్ఠాం కృపయా ప్రహసన్నివ

తే తు తద్గౌరవాత్సర్వే త్యక్తక్రీడాపరిచ్ఛదాః
బాలా అదూషితధియో ద్వన్ద్వారామేరితేహితైః

పర్యుపాసత రాజేన్ద్ర తన్న్యస్తహృదయేక్షణాః
తానాహ కరుణో మైత్రో మహాభాగవతోऽసురః

మహాపండితుడైన ప్రహ్లాదుడు దయతో నవ్వుతున్నట్లుగా వారి శ్రద్ధ ఆసక్తిని ఆకర్షించి పిలిచాడు. ఇతని మీద గౌరవముతో అన్ని ఆటలూ విడిచిపెట్టి ఇంకా ద్వంద్వములు చేరని వయసులో ఉన్న రాక్షస పిల్లలు ప్రహ్లాదుని యందే మనసూ చూపు ఉంచి సేవించారు. అలాంటి వారితో పరం కరుణతో ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు

Popular Posts