Followers

Sunday 23 March 2014

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం


రాజోవాచ



మహర్ష ఏతద్వైచిత్ర్యం లోకస్య కథమితి

ఇన్ని రకముల పరిణామాలు ఎందుకు ఉన్నాయి. నరకములన్ని స్వరగ్మనీ ఎందుకు ఉన్నాయి. భగవంతుడు అందరినీ ఒకే తీరుగా ఎందుకు సృష్టించలేదు. 

ఋషిరువాచ
త్రిగుణత్వాత్కర్తుః శ్రద్ధయా కర్మగతయః పృథగ్విధాః సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవన్తి
అథేదానీం ప్రతిషిద్ధలక్షణస్యాధర్మస్య తథైవ కర్తుః శ్రద్ధాయా వైసాదృశ్యాత్కర్మఫలం
విసదృశం భవతి యా హ్యనాద్యవిద్యయా కృతకామానాం తత్పరిణామలక్షణాః సృతయః సహస్రశః
ప్రవృత్తాస్తాసాం ప్రాచుర్యేణానువర్ణయిష్యామః

కర్త త్రిగుణం కాబట్టి, వారి వారి గుణములకు తగిన శ్రద్ధ వారికి ఉంటుంది. వారి వారి కర్మాధికారాన్ని బట్టి వారికి ఫలం ఉంటుంది.  అనంతమైన అవిద్య చేత కోరికలు ఏర్పడతాయి. వాటి కొరకు సృష్టి జరుగుతుంది. సృష్టిలోని వైషమ్యం పరమాత్మ సంకల్పం కాదు, జీవులు చేసుకున్న కర్మ. 

రాజోవాచ
నరకా నామ భగవన్కిం దేశవిశేషా అథవా బహిస్త్రిలోక్యా ఆహోస్విదన్తరాల ఇతి

ఈ  నరకాలు అంటారే. అవి కూడా ఒక లోకమేనా? అవి త్రిలోకములలో అంతర్భూతములా, వాటి బయట ఉన్నాయా?

ఋషిరువాచ
అన్తరాల ఏవ త్రిజగత్యాస్తు దిశి దక్షిణస్యామధస్తాద్భూమేరుపరిష్టాచ్చ
జలాద్యస్యామగ్నిష్వాత్తాదయః పితృగణా దిశి స్వానాం గోత్రాణాం పరమేణ సమాధినా సత్యా ఏవాశిష ఆశాసానా
నివసన్తి

దక్షిణ దిక్కులో భూమికి కిందగా ఉంది నరకం. నీటికన్నా పైన భూమీ కన్నా కింద. అందుకే మూడు వందల అడుగులు దాటి భూమిని త్రవ్వద్దు అంటారు. లేకపోతే అంతకన్నా లోతు ఉన్న నీరు త్రాగితే ఆ ప్రవృత్తే వస్తుంది. అక్కడ పితృదేవతలూ, కింద భూలోకములో తమ తమ గణాలు బాగుండాలని ఉంటారు.

యత్ర హ వావ భగవాన్పితృరాజో వైవస్వతః స్వవిషయం ప్రాపితేషు స్వపురుషైర్జన్తుషు
సమ్పరేతేషు
యథాకర్మావద్యం దోషమేవానుల్లఙ్ఘితభగవచ్ఛాసనః సగణో దమం ధారయతి

యముడు పితృ రాజు. మరణించి తన లోకానికి వచ్చినవారు, వారి వారి శరీరములో ఉండగా వారి కర్మానుసారముగా చేసిన పాపాన్ని తన వారితో శిక్షిస్తూ ఉంటాడు. పరమాత్మ ఆజ్ఞ్య మేరకూ తన గణముతో శిక్షిస్తూ ఉంటాడు

తత్ర హైకే నరకానేకవింశతిం గణయన్తి అథ తాంస్తే రాజన్నామరూపలక్షణతో
ऽనుక్రమిష్యామస్తామిస్రోऽన్ధతామిస్రో రౌరవో మహారౌరవః కుమ్భీపాకః కాలసూత్రమసిపత్రవనం
సూకరముఖమన్ధకూపః కృమిభోజనః సన్దంశస్తప్తసూర్మిర్వజ్రకణ్టకశాల్మలీ వైతరణీ పూయోదః
ప్రాణరోధో విశసనం లాలాభక్షః సారమేయాదనమవీచిరయఃపానమితి కిఞ్చ క్షారకర్దమో రక్షోగణ
భోజనః శూలప్రోతో దన్దశూకోऽవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖమిత్యష్టావింశతిర్నరకా వివిధ
యాతనాభూమయః

కొందరు ఈ నరకాలు ఇరవై ఒకటనీ అరవై ఒకటనీ అంటారు. పేర్లూ ఆకారములూ లక్షణములను వివరిస్తాము. తామిస్రోऽన్ధతామిస్రో రౌరవో మహారౌరవః కుమ్భీపాకః కాలసూత్రమసిపత్రవనం
సూకరముఖమన్ధకూపః కృమిభోజనః సన్దంశస్తప్తసూర్మిర్వజ్రకణ్టకశాల్మలీ వైతరణీ పూయోదః ప్రాణరోధో విశసనం లాలాభక్షః సారమేయాదనమవీచిరయఃపానం.
ఇవి కాక ఇంకో ఏడు ఉన్నాయి.క్షారకర్దమో రక్షోగణ భోజనః శూలప్రోతో దన్దశూకోऽవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖం. ఇవి యాతనా భూములు. 

తత్ర యస్తు పరవిత్తాపత్యకలత్రాణ్యపహరతి స హి కాలపాశబద్ధో యమపురుషైరతి
భయానకైస్తామిస్రే నరకే బలాన్నిపాత్యతే అనశనానుదపానదణ్డతాడన
సన్తర్జనాదిభిర్యాతనాభిర్యాత్యమానో జన్తుర్యత్ర కశ్మలమాసాదిత ఏకదైవ మూర్చ్ఛాముపయాతి తామిస్ర
ప్రాయే

ఎవరెవరికి ఎలాంటి నరకం వస్తుంది. పరుల ధనాన్ని స్త్రీలనూ సంతానాన్ని హరిస్తారో అతను యముని పాశముతో బంధించబడి,  మహా భయంకరులైన యమభటులు తామిశ్రమనే నరకములో పడేస్తారు. ఇలాంటి వారికి శిక్షగా, ఆహరం ఇవ్వరు, నీరూ ఇవ్వరు, కట్టెలతో కొడుతూ ఉంటారు, కొడతానని భయపెడతారు. ఈ జీవుడు దుఃఖాన్ని పొంది ఒక దానికే మూర్చపోతాడు. 

ఏవమేవాన్ధతామిస్రే యస్తు వఞ్చయిత్వా పురుషం దారాదీనుపయుఙ్క్తే యత్ర శరీరీ నిపాత్యమానో
యాతనా
స్థో వేదనయా నష్టమతిర్నష్టదృష్టిశ్చ భవతి యథా వనస్పతిర్వృశ్చ్యమానమూలస్తస్మాదన్ధతామిస్రం
తముపదిశన్తి

అంధ తామిశ్రమనే ఇంకో నరకం ఉంది. భర్తను మోసగించి ఇంకో భార్యను అనుభవించేవాడు. వాడి బుద్ధీ చూపూ నశిస్తుంది. వేర్లు కోసేసిన వృక్షములాగ అవుతాడు. అందుకే ఇది కటిక చీకటి, అంధ తామిశ్రం. 

యస్త్విహ వా ఏతదహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం స్వకుటుమ్బమేవానుదినం
ప్రపుష్ణాతి స తదిహ విహాయ స్వయమేవ తదశుభేన రౌరవే నిపతతి

"నేను నేనంటూ" భావించి ఇతరులకు ద్రోహం చేస్తూ తన కుటుంబాన్ని మాత్రం పోషించుకునే వాడు రౌరవములో పడతాడు. ఇతరులకు ద్రోహం చేయకూడదు. 

యే త్విహ యథైవామునా విహింసితా జన్తవః పరత్ర యమయాతనాముపగతం త ఏవ రురవో
భూత్వా
తథా తమేవ విహింసన్తి తస్మాద్రౌరవమిత్యాహూ రురురితి సర్పాదతిక్రూరసత్త్వస్యాపదేశః

ఇది రౌరవం ఎందుకంటే అక్కడ రురు అన్న జంతువు (ముళ్ళ పంది) వీడిని బాధిస్తుంది. ఇక్కడ జీవి ఈ లోకములో ఉన్నప్పుడు ఏ ఏ జంతువులని హింసించాడో ఆ జంతువులే పరలోకములో జంతువులుగా అవతరించి బాధిస్తాడు. అందుకే అది రౌరవం అంటారు. ఆవుల మందలో వేల ఆవులున్నా ఎలాగైతే దూడ తన తల్లిని గుర్తు పడుతుందో అలాగే కర్తను ఆ కర్మ గుర్తుపడుతుంది. పాము తన దగ్గరకు వెళితేనే ప్రమాదం, కానీ ఈ రురువు అంతకన్నా ప్రమాదకరం

ఏవమేవ మహారౌరవో యత్ర నిపతితం పురుషం క్రవ్యాదా నామ రురవస్తం క్రవ్యేణ ఘాతయన్తి యః
కేవలం దేహమ్భరః

మహారౌరవం: భయంకరముగా బాధపెట్టిన వారిని జంతువులన్నీ చుట్టూ చేరి జీవుల మాంసాన్ని మెల్ల మెల్లగా తింటూ ఉంటాయి. ఎవడు తన శరీరమును మాత్రమే పోషించుకోవడానికి ప్రయత్నించాడో వాడు ఈ నరకం పాలవుతాడు. 

యస్త్విహ వా ఉగ్రః పశూన్పక్షిణో వా ప్రాణత ఉపరన్ధయతి తమపకరుణం పురుషాదైరపి
విగర్హితమముత్ర యమానుచరాః కుమ్భీపాకే తప్తతైలే ఉపరన్ధయన్తి

పక్షుల పశువుల ప్రాణం తీసి బాధపెట్టే రాక్షసుల కంటే హీనుడైన వాడు, అలాంటి వాళ్ళను కుంభీపాకము (పెద్ద మూకుడు నిండా నూనె మసలుతూ ఉంటుంది) లో పడేస్తారు. 

యస్త్విహ బ్రహ్మధ్రుక్స కాలసూత్రసంజ్ఞకే నరకే అయుతయోజనపరిమణ్డలే తామ్రమయే తప్త
ఖలే ఉపర్యధస్తాదగ్న్యర్కాభ్యామతితప్యమానేऽభినివేశితః క్షుత్పిపాసాభ్యాం చ దహ్యమానాన్తర్బహిః
శరీర ఆస్తే శేతే చేష్టతేऽవతిష్ఠతి పరిధావతి చ యావన్తి పశురోమాణి తావద్వర్షసహస్రాణి

తల్లి తండ్రులకూ బ్రాహ్మణులకూ బ్రాహ్మణ భక్తులకూ ద్రోహం చేస్తారో పది వేల యోజనాల మండలాకారములో ఉన్న కాల సూత్రమనే నరకములో పడతారు. అది బాగా కాల్చబడిన రాగి పల్లెములా ఉంటుంది. బాగా కాచిన పల్లెములో అట్టూ ఇటూ తిప్పుతూ ఉంటారు. అప్పుడు ఆ మంటలకు తోడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. పెట్టే బాధను తట్టుకోవడానికి ఆకలికి ఆహారం అడుగుతారు. పై శరీరమూ లోపల శరీరం అగ్నితో , జఠరాగ్నితో కాలుతూ ఉంటుంది. కింద కూడా అగ్ని ఉంటుంది. అక్కడే ఉండి పడుకుని పరిగెత్తుతూ ఉంటాడు. ఇలా ఏ ఏ పశువులను చంపారో, ఆ చంపిన పశువులకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉంటాడు. 

యస్త్విహ వై నిజవేదపథాదనాపద్యపగతః పాఖణ్డం చోపగతస్తమసిపత్రవనం
ప్రవేశ్య కశయా ప్రహరన్తి తత్ర హాసావితస్తతో ధావమాన ఉభయతో ధారైస్తాలవనాసిపత్రైశ్ఛిద్యమాన
సర్వాఙ్గో హా హతోऽస్మీతి పరమయా వేదనయా మూర్చ్ఛితః పదే పదే నిపతతి స్వధర్మహా పాఖణ్డానుగతం
ఫలం భుఙ్క్తే

వేద మార్గమును ఆపద లేనప్పుడు తప్ప బ్రాహ్మణులు తప్పితే, తన మార్గాన్ని తాను విడిచి పెట్టి పాఖండ మార్గాన్ని అవలంబిస్తే, అతిపత్ర వనం అనే నరకములో పడతారు. అక్కడ కొరడాలతో కొడతారు. ఇటూ అటూ పరిగెడుతూ ఉంటారు. కింద ఆకుల లాంటి కత్తులు ఉంటాయి. కింద కాళ్ళు పెట్టడానికీ లెడు ఆగడానికీ లేదు. ఆ కత్తులకు రెండు వైపులా అంచు ఉంటుంది. పదే పదే ఘోరమైన ఆపదతో మూర్చపోతూ ఉంటారు. తన ధర్మాన్ని విడిచి పెట్టి పాఖండ మతాన్ని అనుసరించినందు వలన ఈ ఫలితాన్ని అనుభవిస్తారు.

యస్త్విహ వై రాజా రాజపురుషో వా అదణ్డ్యే దణ్డం ప్రణయతి బ్రాహ్మణే వా శరీరదణ్డం స
పాపీయాన్నరకేऽముత్ర సూకరముఖే నిపతతి తత్రాతిబలైర్వినిష్పిష్యమాణావయవో యథైవేహేక్షుఖణ్డ ఆర్త
స్వరేణ స్వనయన్క్వచిన్మూర్చ్ఛితః కశ్మలముపగతో యథైవేహాదృష్టదోషా ఉపరుద్ధాః

రాజు గానీ రాజు దగ్గర పని చేసిన వారు గానీ, శిక్షించదగని వారిని శిక్షినట్లైతే, బ్రాహ్మణులకి శరీర దండం విధిస్తే సూకర ముఖం అనే నరకం విధిస్తారు. ఆ వరాహాల మూతులు దబ్బనాలలా ఉండి చిల్లులు పొడుస్తూ, పిండబడుతూ (చెరుకు గడలను పిండినట్లుగా) ఉంటారు. మూర్చపోతూ కొందరు, అధికారముగా ఉన్నప్పుడు ఈ లోకములో తప్పు చేయని వారిని ఎలా హింసిస్తారో అవి అన్నీ గుర్తుకు వస్తాయి. తాను బాధించిన వారిని తలచుకుంటారు. తప్పులేని వారినెలా హింసించావో  అలా వారు హింసిస్తారు. 

యస్త్విహ వై భూతానామీశ్వరోపకల్పితవృత్తీనామవివిక్తపరవ్యథానాం స్వయం పురుషోపకల్పిత
వృత్తిర్వివిక్తపరవ్యథో వ్యథామాచరతి స పరత్రాన్ధకూపే తదభిద్రోహేణ నిపతతి తత్ర హాసౌ
తైర్జన్తుభిః పశుమృగపక్షిసరీసృపైర్మశకయూకామత్కుణమక్షికాదిభిర్యే కే చాభిద్రుగ్ధాస్తైః
సర్వతోऽభిద్రుహ్యమాణస్తమసి విహతనిద్రానిర్వృతిరలబ్ధావస్థానః పరిక్రామతి యథా కుశరీరే జీవః

అంధ కూప నరకం: కొన్ని ప్రాణులు మన నుండి ఏమీ ఆశించక పరమాత్మ ఏర్పాటు చేసిన వసతిని బట్టి బతుతుకూ ఉంటాయి, ఇతరులను బాధించడం వాటికి తెలియదు. పరమాత్మ చేత పోషింపబడేవి, ఇతరులని బాధించబడే వాటిని, ఇతరుల చేత పోషింపబడే వాడు బాధించినట్లైతే పరలోకములో వాడు అంధకూప నరకములో పడతాడు. పరలోకములో పశువులూ మృగములూ జంతువులూ సర్పములూ దోమలూ పేలూ నల్లులు ఈగలు ఇలాంటి వాటి చేత బాధించబడతాడు. నల్లూ ఈగలూ దోమలూ మనని బాధిస్తున్నాయన్న సంగతి వారికి తెలియదు. అందుకు వాటిని మనం చంపకూడదు. వాటిని బాధిస్తే వాటి చేతనే బాధకు గురవుతారు (మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే). ఇలా అవస్థలు పడుతూ చెడిపోయిన శరీరములో జీవుడు ఉండలేక వెళ్ళలేక ఉంటాడో, ఈ నరకములో కూడా నానా యాతనలు పడుతూ ఉంటాడు.

యస్త్విహ వా అసంవిభజ్యాశ్నాతి యత్కిఞ్చనోపనతమనిర్మితపఞ్చయజ్ఞో వాయససంస్తుతః స
పరత్ర కృమిభోజనే నరకాధమే నిపతతి తత్ర శతసహస్రయోజనే కృమికుణ్డే కృమిభూతః స్వయం
కృమిభిరేవ భక్ష్యమాణః కృమిభోజనో యావత్తదప్రత్తాప్రహూతాదోऽనిర్వేశమాత్మానం యాతయతే

కృమిభోజనం: మనం తినేవాటిని మన చుట్టు పక్కల వారికి పంచకుండా తింటే ఈ నరకం వస్తుంది. ఇలా లక్ష యోజనాల విస్తీర్ణములో ఈ నరకం ఉంటుంది. అది కృమి కుండం. పితృ శ్రాద్ధాదులూ యజ్ఞ్య యాగాదులూ (దేవ యజ్ఞ్య పితృ యజ్ఞ్యములు చేయకుండా భుజించిన వాడు) దానములూ చేయని వాడు. ఏ మాత్రం జాలి లేకుండా ప్రేమ లేకుండా తనను తాను హింసించుకుంటాడు.

యస్త్విహ వై స్తేయేన బలాద్వా హిరణ్యరత్నాదీని బ్రాహ్మణస్య వాపహరత్యన్యస్య వానాపది
పురుషస్తమముత్ర రాజన్యమపురుషా అయస్మయైరగ్నిపిణ్డైః సన్దంశైస్త్వచి నిష్కుషన్తి

అగ్నిపిండ నరకం. ఇతరుల, బ్రాహ్మణుల దీనుల ధనాన్ని దొంగతనముగా ఆపదలేనప్పుడు అపహరిస్తాడో ఉక్కు పిండములను నిప్పులో కాల్చి శరీరములో కొడుతూ ఉంటారు. 

యస్త్విహ వా అగమ్యాం స్త్రియమగమ్యం వా పురుషం యోషిదభిగచ్ఛతి తావముత్ర కశయా
తాడయన్తస్తిగ్మయా సూర్మ్యా లోహమయ్యా పురుషమాలిఙ్గయన్తి స్త్రియం చ పురుషరూపయా సూర్మ్యా

పొందకూడని స్త్రీని పొందిన వాడు, పొందకూడని పురుషున్ని పొందిన స్త్రీని ఒక ఉక్కు స్తంభాన్ని బాగా కాల్చి దానిని ఆలింగనం చేసుకోమని అంటారు. కొరడాలతో కొడుతూ ఉంటారు. మహా వేడి ఉన్న దానిని, పొందకూడని పురుషున్ని పొందిన స్త్రీని పురుషాకారములో ఉన్న స్తంభాన్ని ఆలింగనం చేసుకోమని కొరడాలతో కొడతారు.

యస్త్విహ వై సర్వాభిగమస్తమముత్ర నిరయే వర్తమానం వజ్రకణ్టకశాల్మలీమారోప్య
నిష్కర్షన్తి

వావీ వరసలూ పాటించకుండా (మనుషులతోనే కాకుండా, జంతువులతో కూడా రమించేవారిని) ముళ్ళతో ఉన్న బూరుగు చెట్టును ఎక్కించి కిందకి లాగుతారు. 

యే త్విహ వై రాజన్యా రాజపురుషా వా అపాఖణ్డా ధర్మసేతూన్భిన్దన్తి తే సమ్పరేత్య వైతరణ్యాం
నిపతన్తి భిన్నమర్యాదాస్తస్యాం నిరయపరిఖాభూతాయాం నద్యాం యాదోగణైరితస్తతో భక్ష్యమాణా
ఆత్మనా న వియుజ్యమానాశ్చాసుభిరుహ్యమానాః స్వాఘేన కర్మపాకమనుస్మరన్తో విణ్మూత్రపూయశోణిత
కేశనఖాస్థిమేదోమాంసవసావాహిన్యాముపతప్యన్తే

కొందరు రాజులూ రాజ ఉద్యోగులు పుణ్యమును ఆచరించే మర్యాదను ఉల్లంఘిస్తారో ధర్మాన్ని ఆచరించే వారిని నిందిస్తారో వారు వైతరిణీ నదిలో పడతారు. వైతరిణీ అంటే నరకానికి కందకం. ఆ నదిలో మలం మూత్రం దుర్గంధం నెత్తురూ కేశములూ గోళ్ళూ ఎముకలు మధ్యా మాంసం చీము ఉంటాయి. అందులో పడేస్తారు. అక్కడ కొన్ని జంతువులూ క్రిమికీటకాలూ ఉంటాయి. అక్కడ రాక్షసులతో తినబడుతూ ఆత్మ వియోగం లేకుండా ప్రాణములతో ఉన్నట్లే ఉండి "అయ్యో క్షణికమైన ఆనందం లాంటి దాని కోసం ఈ పాపాలు చేసామా" అని బాధపడతారు. 

యే త్విహ వై వృషలీపతయో నష్టశౌచాచారనియమాస్త్యక్తలజ్జాః పశుచర్యాం చరన్తి తే చాపి ప్రేత్య
పూయవిణ్మూత్రశ్లేష్మమలాపూర్ణార్ణవే నిపతన్తి తదేవాతిబీభత్సితమశ్నన్తి

బ్రాహ్మణోత్తములూ క్షత్రియులూ వేద వాక్యాలనూ ధర్మాలనూ విడిచిపెట్టి శూద్ర స్త్రీలతో రమించి శౌచమూ ఆచారమూ సిగ్గూ విడిచి  పశుచర్యతో పశువులలాగ ప్రవర్తిస్తారో వారు మల మూత్ర దుర్గంధ శ్లేషముతో ఉన్న సముద్రములో పడవేయబడి దానినే తాగుతూ తింటూ ఉంటారు. 

యే త్విహ వై శ్వగర్దభపతయో బ్రాహ్మణాదయో మృగయా విహారా అతీర్థే చ మృగాన్నిఘ్నన్తి
తానపి
సమ్పరేతాన్లక్ష్యభూతాన్యమపురుషా ఇషుభిర్విధ్యన్తి

బ్రాహ్మణులు కొంతమంది కుక్కలనూ గాడిదలనూ పెంచుకుంటారు. అలా పెంచుకునే వారూ, శ్రాద్ధాదులు లేనప్పుడు మృగాలని చంపితే వారు నరకానికి వెళ్ళినప్పుడు, ఎలా ఇక్కడ వీరు బాణాలతో జంతువులను చంపారో అక్కడ యమబటులు వీళ్ళని కొడుతూ ఉంటారు. 

యే త్విహ వై దామ్భికా దమ్భయజ్ఞేషు పశూన్విశసన్తి తానముష్మిన్లోకే వైశసే నరకే
పతితాన్నిరయపతయో యాతయిత్వా విశసన్తి

ఎవరైతే డాంబికముగా ఉంటారో, పదిమంది మనను భక్తులనుకోవాలని వచనతో యజ్ఞాలు చేసి పశువులని చంపేవారు నరకానికి వెళ్ళిన తరువాత యజ్ఞ్య పశువును ఎలా బాధించి హింసించి చంపుతారో అక్కడికి వెళ్ళిన తరువాత యమభటులు అలాగే చేస్తారు.

యస్త్విహ వై సవర్ణాం భార్యాం ద్విజో రేతః పాయయతి కామమోహితస్తం పాపకృతమముత్ర రేతః
కుల్యాయాం పాతయిత్వా రేతః సమ్పాయయన్తి

కొందరు తమ భార్యలతో తమ వీర్యమును తాగిస్తారు. అలాంటి పాపం చేసిన వారిని వీర్యముతో ఉన్న బురదలో పడేస్తారు. 

యే త్విహ వై దస్యవోऽగ్నిదా గరదా గ్రామాన్సార్థాన్వా విలుమ్పన్తి రాజానో రాజభటా వా
తాంశ్చాపి హి
పరేత్య యమదూతా వజ్రదంష్ట్రాః శ్వానః సప్తశతాని వింశతిశ్చ సరభసం ఖాదన్తి

కొందరు దొంగలు దొంగతనానికి వచ్చి ఊళ్ళకు ఊళ్ళను తగలబెట్టి, విషాన్నం పెడతారు. రాజభటులు కూడా తమ మాట వినని వారిని ఇలాగే చేస్తారు. అలాంటి వారిని వజ్రములాంటి కోరలున్న కుక్కలతో కరిపిస్తారు. 

యస్త్విహ వా అనృతం వదతి సాక్ష్యే ద్రవ్యవినిమయే దానే వా కథఞ్చిత్స వై ప్రేత్య నరకే
ऽవీచిమత్యధఃశిరా నిరవకాశే యోజనశతోచ్ఛ్రాయాద్గిరిమూర్ధ్నః సమ్పాత్యతే యత్ర జలమివ స్థలమశ్మ
పృష్ఠమవభాసతే తదవీచిమత్తిలశో విశీర్యమాణశరీరో న మ్రియమాణః పునరారోపితో నిపతతి

అబద్దం ఆడేవాడు, అబద్ద సాక్ష్యం చెప్పేవాడూ, ఎలాంటి గాలీ వెలుతురూ లేని చోట పెద్ద సొరగమునుంచి పర్వత పైభాగం నుంచి పడవేస్తారు. అక్కడ నీరూ భూమీ రెండూ ఉక్కుతో ఉంటాయి. అలాంటి చోట పడ్డప్పుడు నువ్వుల గింజలుగా శరీరం ఐపోతుంది. చావు లేదు కాబట్టి మళ్ళీ లేస్తాడు.

యస్త్విహ వై విప్రో రాజన్యో వైశ్యో వా సోమపీథస్తత్కలత్రం వా సురాం వ్రతస్థోऽపి వా పిబతి
ప్రమాదతస్తేషాం నిరయం నీతానామురసి పదాక్రమ్యాస్యే వహ్నినా ద్రవమాణం కార్ష్ణాయసం నిషిఞ్చన్తి

బ్రాహ్మణుడు రాజూ వైశ్యుడూ సోమయాగం చేసేవాడు వ్రతములో ఉన్నవాడు కానీ తన వారిని భార్యనూ గానీ తన వారితో గాని సురాపానం చేస్తేలేవకుండా వక్షస్థలం మీద కాలుపెట్టి కాలే నిప్పును నోట్లో పోస్తారు, నిప్పులో బాగా కరిగించిన సీసాన్ని నోట్లో పోస్తారు. మద్యం పానం చేస్తే నాలుకా నోరూ మొత్తం మండుతుంది, ఆ మంటే రుచి ఉందని తాగుతారు. వారికి ఈ శిక్ష.

అథ చ యస్త్విహ వా ఆత్మసమ్భావనేన స్వయమధమో జన్మతపోవిద్యాచారవర్ణాశ్రమవతో
వరీయసో న బహు మన్యేత స మృతక ఏవ మృత్వా క్షారకర్దమే నిరయేऽవాక్శిరా నిపాతితో దురన్తా యాతనా
హ్యశ్నుతే

శరీరముతో జాతితో వృత్తితో విద్యతో గానీ, ఏ రకముగా చూసినా తక్కువగా ఉండేవాడు, ఎక్కువగా ఉండేవాడిని తగిన రీతిలో గౌరవించకుంటే బతికున్నప్పుడూ చనిపోయినవాడితో సమానమే, చనిపోయిన తరువాత కూడా ఒక క్షారకర్దమములో (బురద) త్రల్ల కిందుగా పడేస్తారు.

యే త్విహ వై పురుషాః పురుషమేధేన యజన్తే యాశ్చ స్త్రియో నృపశూన్ఖాదన్తి తాంశ్చ తే పశవ ఇవ
నిహతా యమసదనే యాతయన్తో రక్షోగణాః సౌనికా ఇవ స్వధితినావదాయాసృక్పిబన్తి నృత్యన్తి చ గాయన్తి చ
హృష్యమాణా యథేహ పురుషాదాః

కొంతమంది పురుషమేధం చేసి నరున్ని బలి ఇస్తారు, స్త్రీలు కూడా పురుషులని తిని వేస్తారు (వాడిని నిర్వీర్యుడయ్యేంత వరకూ రమిస్తారు), అలాంటి వారు యమలోకములో రాక్షసులై కసాయి వారిగా (సౌనికా ) ఎలాంటి జాలీ దయా లేకుండా ఒక దబ్బనం గుచ్చి వారి రక్తాన్ని తాగుతారు. అలా త్రాగుతూ నాట్యం చేస్తారు గానం చేస్తారు. ఇక్కడ పురుషులను భుజించేవారు ఎంత ఆనందముగా గానం చేస్తారో వీరు కూడా అంతగానే చేస్తారు. 

యే త్విహ వా అనాగసోऽరణ్యే గ్రామే వా వైశ్రమ్భకైరుపసృతానుపవిశ్రమ్భయ్య జిజీవిషూన్శూల
సూత్రాదిషూపప్రోతాన్క్రీడనకతయా యాతయన్తి తేऽపి చ ప్రేత్య యమయాతనాసు శూలాదిషు ప్రోతాత్మానః
క్షుత్తృడ్భ్యాం
చాభిహతాః కఙ్కవటాదిభిశ్చేతస్తతస్తిగ్మతుణ్డైరాహన్యమానా ఆత్మశమలం స్మరన్తి

కొందరు ఏ తప్పూ చేయకుండా ఎవరికీ హాని చేయకుండా గ్రామాలలో కానీ అరణ్యాలలో కానీ బ్రతకగోరే జంతువులూ పక్షులనూ ఆటకోసం పొడుస్తూ వినోదిస్తే వారిని యమలోకములో శూలముతో పొడుస్తారు, అన్నమూ పానీయమూ ఉండదు. డేగలూ గద్దలూ పొడిచి శరీర భాగాలను తీసుకుంటాయి

యే త్విహ వై భూతాన్యుద్వేజయన్తి నరా ఉల్బణస్వభావా యథా దన్దశూకాస్తేऽపి ప్రేత్య నరకే
దన్దశూకాఖ్యే నిపతన్తి యత్ర నృప దన్దశూకాః పఞ్చముఖాః సప్తముఖా ఉపసృత్య గ్రసన్తి యథా బిలేశయాన్

ఏ ప్రయోజనాన్నీ ఆశించకుండా ఇతర ప్రాణులని కలతకు గురిచేస్తారు. ఏ లాభము ఉండదు దాని వలన. మానవులనే కాకుండా పాములను పట్టి వారి కోరలు తీసి ఆనందిస్తూ ఉంటారు. మిగతా జంతువులతో కూడా అలాగే ఆడిస్తారు తమ వినోదము కోసము. తమ సంతోషం కోసం స్వేచ్చగా ఎవరికీ అపకారం చేయని మృగాలను కట్టివేసి కొట్టి చెప్పినట్లు చేయించుకుని వినోదించేవారు. అలాంటి వారికి సూదులు ఒళ్ళంతా చిలూ చేస్తాయి ఆ జంతువులు. బిలములో ఉన్నవాటిని ఎలా తినేస్తాయో అలా తినేస్తాయి. కరుస్తున్నాయి అంటే అవి మెలుకువగా ఉన్నప్పుడే కరుస్తాయి. తెలిసే బాధిస్తాయి. 

యే త్విహ వా అన్ధావటకుసూలగుహాదిషు భూతాని నిరున్ధన్తి తథాముత్ర తేష్వేవోపవేశ్య సగరేణ
వహ్నినా ధూమేన నిరున్ధన్తి

కొందరు గుహలలో సొరంగాలలో చెట్టు తొర్రలలో ఉండే ప్రాణులని పట్టుకుంటారు. వారిని అలాంటి చోటే పట్టుకుని మంట పెడతారు

యస్త్విహ వా అతిథీనభ్యాగతాన్వా గృహపతిరసకృదుపగతమన్యుర్దిధక్షురివ పాపేన
చక్షుషా నిరీక్షతే తస్య చాపి నిరయే పాపదృష్టేరక్షిణీ వజ్రతుణ్డా గృధ్రాః కఙ్కకాకవటాదయః ప్రసహ్యోరు
బలాదుత్పాటయన్తి

ఇంటికొచ్చిన అతిథులనూ యాచకులనూ మహాకోపముతో చూసే వారి కళ్ళను గద్దలు బలవంతముగా లాగేస్తాయి.

యస్త్విహ వా ఆఢ్యాభిమతిరహఙ్కృతిస్తిర్యక్ప్రేక్షణః సర్వతోऽభివిశఙ్కీ అర్థవ్యయనాశచిన్తయా
పరిశుష్యమాణహృదయవదనో నిర్వృతిమనవగతో గ్రహ ఇవార్థమభిరక్షతి స చాపి ప్రేత్య తద్
ఉత్పాదనోత్కర్షణసంరక్షణశమలగ్రహః సూచీముఖే నరకే నిపతతి యత్ర హ విత్తగ్రహం పాపపురుషం
ధర్మరాజపురుషా వాయకా ఇవ సర్వతోऽఙ్గేషు సూత్రైః పరివయన్తి

నేను ధనవంతున్ని అని వంకర చూపు చూస్తూ ఉంటాడు. అందరూ తనను దోచడానికే వస్తారని ప్రతీ వారినీ ప్రతీ చోటా శంకిస్తూ, అర్థం వ్యయమైనప్పుడల్లా చింతిస్తూ శరీరమూ ముఖమూ హృదయమూ మాడి, తృప్తినీ పొందలేక, గ్రహములాగ (దయ్యములాగ) ఆ ధనం చుట్టే ఉండి ఆ డబ్బును కాపాడుకోవడమే తమ పని అనుకొని బ్రతికేవారు. ఇలా ఒక దాన్ని ఏర్పరచాలి, ఏర్పరచిన డబ్బును లాగాలి, లాగిన దాన్ని కాపాడుకోవాలి, అనుకునేవారు సూచీ ముఖం అనే నరకానికి వెళ్ళి, ఈ లోకములో ఉన్నప్పుడు డబ్బును ఎవరికీ దొరకకుండా దాచడానికి బొంతలలో వేసి కుట్టారు కనుక, వారి ఒళ్ళంతా సూది దారాలతోట్బట్టకుట్టేవారిలా (వాయకా ) కుడతారు. 

ఏవంవిధా నరకా యమాలయే సన్తి శతశః సహస్రశస్తేషు సర్వేషు చ సర్వ ఏవాధర్మవర్తినో యే
కేచిదిహోదితా అనుదితాశ్చావనిపతే పర్యాయేణ విశన్తి తథైవ ధర్మానువర్తిన ఇతరత్ర ఇహ తు పునర్భవే త
ఉభయశేషాభ్యాం నివిశన్తి

ఇలాంటి నరకములు యమలోకములో వందలూ వేలూ ఉన్నాయి. మనం చేసే ప్రతీ తప్పుకూ ఒక శిక్ష ఉంటుంది. అన్ని రకముల పాపములతో అధర్మముగా ఉండేవారు పుట్టినవారు పుట్టని వారు పుట్టబోయే వారు చేసిన చేస్తున్న చేయబోయే పాపాలకూ నరకాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఒక్కసారే పుట్టరు. పుట్టినవారు చేస్తూ ఉంటారు, పుట్టబోయే వారు చేయబోతారు. అధర్మం చేసిన వారు ఎంతోకొంతైనా ధర్మం చేస్తారు. అలాంటి వారు పుణ్యాన్ని అనుభవించి, పుణ్యం కొంచెం మిగిలాక నరకానికి వచ్చి, అవి అనుభవించి మళ్ళీ పుడతారు. ఎలాంటి పాపం చేసిన వారు మళ్ళీ పుట్టినప్పుడు ఎలాంటి పుట్టుక పుడతారో, అలాంటి పాపం చేసిన వారు ఎలాంటి పనులు చేస్తారో ముందే వారికి తెలుసు కాబట్టి వారి కొరకు నరకములు సిద్ధముగా ఉంటాయి. మళ్ళి పుట్టడములో పాపం మిగిలి ఉండగా పుడతారు. కొందరు పుణ్యము కొద్దిగా మిగిలి ఉండగా పుడతారు. 

నివృత్తిలక్షణమార్గ ఆదావేవ వ్యాఖ్యాతః ఏతావానేవాణ్డకోశో యశ్చతుర్దశధా పురాణేషు వికల్పిత
ఉపగీయతే యత్తద్భగవతో నారాయణస్య సాక్షాన్మహాపురుషస్య స్థవిష్ఠం రూపమాత్మమాయా
గుణమయమనువర్ణితమాదృతః పఠతి శృణోతి శ్రావయతి స ఉపగేయం భగవతః పరమాత్మనోऽగ్రాహ్యమపి
శ్రద్ధాభక్తివిశుద్ధబుద్ధిర్వేద

ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి. త్యాగం యాగం విరక్తీ ఉండాలి. ఇదంతా బ్రహ్మాండ కోశం. ఇదే పధ్నాలుగు లోకాలుగా వివరించబడింది. ఇది పరమాత్మ శ్రీమన్నారాయణుని స్థూల రూపమే. ఇది ఆత్మ మాయా గుణమయం. పరమాత్మ మాయా (ప్రకృతి )గుణములతో ఉన్నదానిని శ్రద్ధతో ఆదరముతో చదివే వాడూ వినేవాడూ వినిపించేవాడూ, అలాంటివాడు ఆయా వేద పురాణ శాస్త్రములలో పరమాత్మ యొక్క ఏ ఏ రూపాలను వర్ణించారో అవి మన బుద్ధికి అందనివైనా దీన్ని చదివి వినిపించడం వలన పరమాత్మ రూపాన్ని అర్థం చేసుకుంటాడు. ఇవి విని వినిపిస్తే పరమాత్మ గుణము యందు శ్రద్ధా భక్తులు కలిగి బుద్ధి పరిశుద్ధమై పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడు. 

శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతో యతిః
స్థూలే నిర్జితమాత్మానం శనైః సూక్ష్మం ధియా నయేదితి

మన బుద్ధిని పరమాత్మ యందు ఉంచాలంటే పరమాత్మ యొక్క స్థూల రూపములో బుద్ధిని ఉంచడం అభ్యాసం చేసుకోవాలి. అప్పుడు పరమాత్మ సూక్ష్మ రూపములో బుద్ధి నిలుస్తుంది. అప్పుడు పరమాత్మ సూక్ష్మ రూపములో బుద్ధిని నిలపాలి. 

భూద్వీపవర్షసరిదద్రినభఃసముద్ర
పాతాలదిఙ్నరకభాగణలోకసంస్థా
గీతా మయా తవ నృపాద్భుతమీశ్వరస్య
స్థూలం వపుః సకలజీవనికాయధామ

భూ ద్వీప వర్షా సరస్సూ అద్రి నభ సముద్ర పాతాళ మొదలైనవి పరమాత్మ యొక్క అత్యద్భుతమైన స్థూల రూపం. సకల ప్రాణులకూ ఇదే నివాసం, దీన్ని జాగ్రత్తగా నెమరు వేస్తే పరమాత్మ కృపకు పాత్రులవుతాము.

Popular Posts