Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై నాలుగవ అధ్యాయం

           ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై నాలుగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఏవం యుధిష్ఠిరో రాజా జరాసన్ధవధం విభోః
కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా ప్రీతస్తమబ్రవీత్

ఈ రీతిలో జరాసంధుని వధ చేసాడని విని సంతోషించి కృష్ణ పరమాత్మతో ధర్మరాజు ఇలా అన్నాడు

శ్రీయుధిష్ఠిర ఉవాచ
యే స్యుస్త్రైలోక్యగురవః సర్వే లోకా మహేశ్వరాః
వహన్తి దుర్లభం లబ్ద్వా శిరసైవానుశాసనమ్

మూడులోకాలలో ఎవరైతే త్రైలోక్యపాలకులు ఉన్నారో అలాంటి వారికూడా నీ ఆజ్ఞ్యను పాలిస్తారు

స భవానరవిన్దాక్షో దీనానామీశమానినామ్
ధత్తేऽనుశాసనం భూమంస్తదత్యన్తవిడమ్బనమ్

త్రిలోకేశ్వరుల చేత కూడా పాలించబడే ఆజ్ఞ్య కలిగిన నీవు మాలాంటి వారి ఆజ్ఞ్య పాలిస్తున్నట్లు నటిస్తుంటావు. అది ఒక నాటకం.

న హ్యేకస్యాద్వితీయస్య బ్రహ్మణః పరమాత్మనః
కర్మభిర్వర్ధతే తేజో హ్రసతే చ యథా రవేః

మేము ఒకరికి సేవ చేస్తే మా తేజస్స్తు తరుగుతుంది. ఒకరు మాకు సేవ చేస్తే మా తేజస్సు పెరుగుతుంది. నీకు మాత్రం అలా కాదు. నీ తేజస్సు పెరగదూ తరగదూ

న వై తేऽజిత భక్తానాం మమాహమితి మాధవ
త్వం తవేతి చ నానాధీః పశూనామివ వైకృతీ

నీ భక్తులకు నేనూ నాదీ నీవు నీది అన్న భేధ బుద్ధి కలగదు. భేధ బుద్ధే సంసారానికి కారణం

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్త్వా యజ్ఞియే కాలే వవ్రే యుక్తాన్స ఋత్విజః
కృష్ణానుమోదితః పార్థో బ్రాహ్మణాన్బ్రహ్మవాదినః

ఈ ప్రకారం  ప్రార్థించి యజ్ఞ్యమునకు కావలసిన సంబారాలను ఏర్పరచుకుని ఎవరెవరు యోగ్యులో వారిని ఋత్విక్కులుగా ఎన్నుకున్నాడు.

ద్వైపాయనో భరద్వాజః సుమన్తుర్గోతమోऽసితః
వసిష్ఠశ్చ్యవనః కణ్వో మైత్రేయః కవషస్త్రితః

విశ్వామిత్రో వామదేవః సుమతిర్జైమినిః క్రతుః
పైలః పరాశరో గర్గో వైశమ్పాయన ఏవ చ

అర్జనుడు వీరందరినీ పిలిచాడు ఋత్విక్కులుగా

అథర్వా కశ్యపో ధౌమ్యో రామో భార్గవ ఆసురిః
వీతిహోత్రో మధుచ్ఛన్దా వీరసేనోऽకృతవ్రణః

ఉపహూతాస్తథా చాన్యే ద్రోణభీష్మకృపాదయః
ధృతరాష్ట్రః సహసుతో విదురశ్చ మహామతిః

అందరూ ఆహ్వానించబడ్డారు. పుత్రులతో కూడిన దృతరాష్టౄన్నీ

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా యజ్ఞదిదృక్షవః
తత్రేయుః సర్వరాజానో రాజ్ఞాం ప్రకృతయో నృప

నాలుగు వర్ణముల వారినీ యజ్ఞ్యం చూడాలని అనుకుంటున్నవారినీ రాజులనూ అందరినీ పిలిచాడు, వారి మంత్రులూ వచ్చారు

తతస్తే దేవయజనం బ్రాహ్మణాః స్వర్ణలాఙ్గలైః
కృష్ట్వా తత్ర యథామ్నాయం దీక్షయాం చక్రిరే నృపమ్

ఎక్కడ యజ్ఞ్యం చేయాలో ఆ యజ్ఞ్య భూమిని బంగారు నాగళ్ళతో దున్నారు. శాస్త్ర పద్దతిలో ధర్మరాజుకు దీక్ష ఇచ్చారు

హైమాః కిలోపకరణా వరుణస్య యథా పురా
ఇన్ద్రాదయో లోకపాలా విరిఞ్చిభవసంయుతాః

సగణాః సిద్ధగన్ధర్వా విద్యాధరమహోరగాః
మునయో యక్షరక్షాంసి ఖగకిన్నరచారణాః

పూర్వం ఈ రాజ సూయ యాగాన్ని దిగ్పాలకులలో వరుణుడు చేసాడు. బ్రహ్మ రుద్రుడూ విద్యాధరులూ సిద్ధులూ గంధర్వులూ యక్ష రాక్షసులూ మొదలైన వారు ఆనాడు వరుణుడు చేస్తే ఎలా వచ్చారో ఈనాడు ధర్మరాజు చేయిస్తే వచ్చారు.

రాజానశ్చ సమాహూతా రాజపత్న్యశ్చ సర్వశః
రాజసూయం సమీయుః స్మ రాజ్ఞః పాణ్డుసుతస్య వై
మేనిరే కృష్ణభక్తస్య సూపపన్నమవిస్మితాః

కృష్ణ భక్తునికి ఈ వైభవం యోగ్యమే అని అందరూ భావించారు

అయాజయన్మహారాజం యాజకా దేవవర్చసః
రాజసూయేన విధివత్ప్రచేతసమివామరాః

అందరు యాజకులూ ధర్మరాజుతో రాజసూయ యాగాన్నిచేయించారు. వరుణున్నిదేవతలు చేయించినట్లుగా

సూత్యేऽహన్యవనీపాలో యాజకాన్సదసస్పతీన్
అపూజయన్మహాభాగాన్యథావత్సుసమాహితః

సదస్యాగ్ర్యార్హణార్హం వై విమృశన్తః సభాసదః
నాధ్యగచ్ఛన్ననైకాన్త్యాత్సహదేవస్తదాబ్రవీత్

అలా యజ్ఞ్యం పూర్తి ఐన తరువాత వచ్చినవారిని యధా విధిగా ఆరాధించారు. అంతా పూజ ఐన తరువాత వచ్చిన వారందరిలో ఎవరు ఉత్తముడో ఎవరు పెద్దవాడో వారిని అగ్రుడిగా పూజించాలి. ఎవరికి అగ్ర పూజ చేయాలి అని తమలో తాము చర్చించుకుంటూ ఉండగా సహదేవుడు ఇలా అన్నాడు

అర్హతి హ్యచ్యుతః శ్రైష్ఠ్యం భగవాన్సాత్వతాం పతిః
ఏష వై దేవతాః సర్వా దేశకాలధనాదయః

భగవానుడైన కృష్ణుడే యోగ్యుడు. ఇతనే అన్ని దేవతలూ ఇతనే దేశమూ కాలమూ ధనమూ వ్యక్తీ ప్రపంచమూ. ప్రపంచమంతా ఎవరి స్వరూపమో యజ్ఞ్యములు ఎవరి స్వారూపమో, అగ్నీ ఆహుతులూ మంత్రం సాంఖ్యమూ యోగమూ, ప్రపంచమంతా ఎవరిచేత వ్యాపించబడి ఉన్నదో, తనలో తాను తనతో తాను జగత్తును సృష్టించి రక్షించి సంహరిస్తాడు. ఈయన రక రకాల కర్మలను ఆచరిస్తాడు. ధర్మాన్ని కాపాడడానికి ధర్మాదులను తానే సృష్టిస్తాడు. అందుచే కృష్ణ భగవానునికే అగ్రపూజ చేయాలి.ఇలా కృష్ణ పరమాత్మను ఆరాధిస్తే సకల ప్రాణులకూ మనకూ ఉత్తమ పూజ అవుతుంది. అన్ని ప్రాణులకూ ఆయనే ఆత్మ. మరి దేనిచేతా చూడబడే వాడు కాదు, దేన్నీ చూచేవాడు కాదు. మనమిచ్చేది సఫలం కావాలంటే అది కృష్ణ పరమాత్మకే అర్పించాలి. అని కృష్ణ పరమాత్మ ప్రభావం తెలిసిన సహదేవుడు ఈమాటలు పలికి మౌనముగా ఉన్నాడు. సాధుజనులంతా అది విని, సత్యమే , బాగు బాగు అని అభినందించారు.

యదాత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మకాః
అగ్నిరాహుతయో మన్త్రా సాఙ్ఖ్యం యోగశ్చ యత్పరః

ఏక ఏవాద్వితీయోऽసావైతదాత్మ్యమిదం జగత్
ఆత్మనాత్మాశ్రయః సభ్యాః సృజత్యవతి హన్త్యజః

వివిధానీహ కర్మాణి జనయన్యదవేక్షయా
ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాదిలక్షణమ్

తస్మాత్కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణమ్
ఏవం చేత్సర్వభూతానామాత్మనశ్చార్హణం భవేత్

సర్వభూతాత్మభూతాయ కృష్ణాయానన్యదర్శినే
దేయం శాన్తాయ పూర్ణాయ దత్తస్యానన్త్యమిచ్ఛతా

ఇత్యుక్త్వా సహదేవోऽభూత్తూష్ణీం కృష్ణానుభావవిత్
తచ్ఛ్రుత్వా తుష్టువుః సర్వే సాధు సాధ్వితి సత్తమాః

శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్దం సభాసదామ్
సమర్హయద్ధృషీకేశం ప్రీతః ప్రణయవిహ్వలః

తత్పాదావవనిజ్యాపః శిరసా లోకపావనీః
సభార్యః సానుజామాత్యః సకుటుమ్బో వహన్ముదా

వారు చెప్పిన మాటలూ బ్రాహ్మణులు చెప్పిన మాటలూ సభలో ఉన్న ఇతరుల అభిప్రాయం కూడా తెలుసుకుని, ఎలాగూ తన వాడే కాబట్టి ప్రీతి చెంది ప్రేమతో విహ్వలుడై కృష్ణుని ఆరాధించాడు.  కూర్చోబెట్టి అతని పాదాలను కడిగి, సకల లోకములనూ పవిత్రంగావించే ఆ పరమాత్మ పాద జలం శిరసా ధరించి, భార్యతో మంత్రులతో తమ్ములతో కుటుంబముతో కలసి పరమాత్మ పాద తీర్థాన్ని శిరస్సున ధరించారు.

వాసోభిః పీతకౌషేయైర్భూషణైశ్చ మహాధనైః
అర్హయిత్వాశ్రుపూర్ణాక్షో నాశకత్సమవేక్షితుమ్

చక్కని వస్త్రాలూ ఆభరణాలూ ఇచ్చి పూజించి, నా జన్మ ధన్యమయ్యింది అని ఆనందం ఉప్పొంగి, కళ్ళ నిండా నీళ్ళు నిండగా పూజ పొందిన స్వామిని తనివి తీరా చూడలేకపోయారు.

ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాఞ్జలయో జనాః
నమో జయేతి నేముస్తం నిపేతుః పుష్పవృష్టయః

ఇలా పరమాత్మను పూజించడం చూచి అందరూ జయ జయ ధ్వానాలు చేసి పూల వర్షం కురిపించారు

ఇత్థం నిశమ్య దమఘోషసుతః స్వపీఠాద్
ఉత్థాయ కృష్ణగుణవర్ణనజాతమన్యుః
ఉత్క్షిప్య బాహుమిదమాహ సదస్యమర్షీ
సంశ్రావయన్భగవతే పరుషాణ్యభీతః

ఇది ఇలా ఉండగా దమ ఘోష సుతుడైన శిశుపాలుడు లేచి కృష్ణ పరమాత్మ గుణాలను అందరూ ప్రశంసిస్తుంటే సహించలేక చేయి ఎత్తి పరమాత్మ మీద పరుషమైన మాటలు భయము లేని వాడై మాట్లాడుతున్నాడు

ఈశో దురత్యయః కాల ఇతి సత్యవతీ స్రుతిః
వృద్ధానామపి యద్బుద్ధిర్బాలవాక్యైర్విభిద్యతే

లోకములో కాలం అనేది ఎవరికైనా దాటరానిది అన్న మాట సత్యమే.
చిన్న పిల్లల మాటలతో పెద్దల బుద్ధి కూడా చలించడం దీనికి నిదర్శనం

యూయం పాత్రవిదాం శ్రేష్ఠా మా మన్ధ్వం బాలభాషీతమ్
సదసస్పతయః సర్వే కృష్ణో యత్సమ్మతోऽర్హణే

యోగ్యులూ శ్రేష్టులూ ఐన మీరు పిల్లవాడు మాట్లాడిన మాటలకు విలువ ఇస్తారా, కృష్ణుడు అగ్ర పూజకు యోగ్యుడా

తపోవిద్యావ్రతధరాన్జ్ఞానవిధ్వస్తకల్మషాన్
పరమఋషీన్బ్రహ్మనిష్ఠాంల్లోకపాలైశ్చ పూజితాన్

ఈ సభలో తపో విద్య వ్రతం ఉన్నవారు, జ్ఞ్యానముతో పాపం పోగొట్టుకున్నవారు బ్రహ్మఋషులు లోకపాలకులతో పూజలు అందుకున్నవారు, వీరిని కాదని గోపాలుడినీ, తన కులానికి చెడ్డ పేరుని తెచ్చిన్వాడిని. అగ్ని హోత్రములో అర్పించవలసిన పురోడాశాన్ని కాకికి అర్పించినట్లుగా ఒక వర్ణమూ లేదు ఒక ఆశ్రమమూ ఒక కులమూ ఒక ధర్మమూ లేదూ. అన్ని ధర్మాల నుండీ బహిష్కరించబడిన వాడు, గుణాలు లేని వాడు, ఇష్టం వచ్చినట్లు సంచరించేవాడూ, ఇలాంటి వాడు ఎలా పూజకు అర్హుడవుతాడు

సదస్పతీనతిక్రమ్య గోపాలః కులపాంసనః
యథా కాకః పురోడాశం సపర్యాం కథమర్హతి

వర్ణాశ్రమకులాపేతః సర్వధర్మబహిష్కృతః
స్వైరవర్తీ గుణైర్హీనః సపర్యాం కథమర్హతి

యయాతినైషాం హి కులం శప్తం సద్భిర్బహిష్కృతమ్
వృథాపానరతం శశ్వత్సపర్యాం కథమర్హతి

బ్రహ్మర్షిసేవితాన్దేశాన్హిత్వైతేऽబ్రహ్మవర్చసమ్
సముద్రం దుర్గమాశ్రిత్య బాధన్తే దస్యవః ప్రజాః

ఏవమాదీన్యభద్రాణి బభాషే నష్టమఙ్గలః
నోవాచ కిఞ్చిద్భగవాన్యథా సింహః శివారుతమ్

భగవన్నిన్దనం శ్రుత్వా దుఃసహం తత్సభాసదః
కర్ణౌ పిధాయ నిర్జగ్ముః శపన్తశ్చేదిపం రుషా

నిన్దాం భగవతః శృణ్వంస్తత్పరస్య జనస్య వా
తతో నాపైతి యః సోऽపి యాత్యధః సుకృతాచ్చ్యుతః

వీళ్ళ వంశములో యయాతే ఈ కులం ఇంక యోగ్యం కాదు అని శపిస్తే సజ్జనులందరూ ఈ కులాన్ని బహిష్కరించారు. పానరతుడు. పూజను ఎలా పొందుతాడు.
బ్రహ్మఋషులూ రాజఋషులూ మహఋషులూ, ఇలాంటి వారు సేవించిన ప్రదేశాలని వదలిపెట్టి సముద్రములో ఉంటున్నాడు. అపుడపుడు బయటకు వచ్చి శత్రువులను బాధిస్తున్నాడు. ఎవరికీ దొరకడు. చాటుగా వచ్చి బాధిస్తున్నాడు. అన్ని మంగళాలూ పోయినవాడు అని మాట్లాడితే
ఇన్ని మాట్లాడుతున్నా కృష్ణ పరమాత్మ ఏమీ మాట్లాడలేదు. నక్కల అరుపులకు సింహం సమాధానమిస్తుందా. భగవంతుని నిందను విన్న సభాసదులు తమ చెవులు మూసుకుని శిశుపాలున్ని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భగవన్నిందను విన్నవారు తన చెవులు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ పాపములో భాగం రావడమే కాక అంత వరకూ వారు చేసిన పుణ్యం కూడా పోతుంది.

తతః పాణ్డుసుతాః క్రుద్ధా మత్స్యకైకయసృఞ్జయాః
ఉదాయుధాః సముత్తస్థుః శిశుపాలజిఘాంసవః

తతశ్చైద్యస్త్వసమ్భ్రాన్తో జగృహే ఖడ్గచర్మణీ
భర్త్సయన్కృష్ణపక్షీయాన్రాజ్ఞః సదసి భారత

తావదుత్థాయ భగవాన్స్వాన్నివార్య స్వయం రుషా
శిరః క్షురాన్తచక్రేణ జహార పతతో రిపోః

అతని మాట విని పాండు సుతులూ మత్స్య కైకయ సృంజయాదులు ఆయుధములు తీసుకు శిశుపాలుని మీదకు వస్తే శిశుపాలుడు కూడా ఖడ్గం పట్టుకుని కృష్ణ పక్షం ఆశ్రయించిన వారిని రాజ్య సభలో బెదిరిస్తూ ఉంటే స్వామి ఒక సారి లేచి నిలబడి తనవారందరినీ ఆపాడు.కృష్ణుడు లేచి అందరినీ ఆపుతూ ఉంటే శిశుపాలుడు ఖడ్గం తీసుకుని కృష్ణుని మీదకు వచ్చాడు. తన మీదకు వస్తున్న శిశుపాలుని శిరస్సుని పరమాత్మ చక్రముతో ఖండించాడు

శబ్దః కోలాహలోऽథాసీచ్ఛిశుపాలే హతే మహాన్
తస్యానుయాయినో భూపా దుద్రువుర్జీవితైషిణః

శిశుపాలుడు చంపడైతే పెద్ద కోలాహలం ఏర్పడింది
శిశుపాలుని అనుసరించి ఉన్న రాజులు పారిపోయారు

చైద్యదేహోత్థితం జ్యోతిర్వాసుదేవముపావిశత్
పశ్యతాం సర్వభూతానాముల్కేవ భువి ఖాచ్చ్యుతా

ఇలా అందరూ చూస్తుండగా శిశుపాలుని శరీరం నుండి ఒక దివ్యమైన జ్యోతి కృష్ణ పరమాత్మను చేరుకున్నది

జన్మత్రయానుగుణిత వైరసంరబ్ధయా ధియా
ధ్యాయంస్తన్మయతాం యాతో భావో హి భవకారణమ్

మూడవ జన్మ ముగిసి తన ద్వారపాలకులు ఆయనలో కలిసారు. వైరముతో ఐనా నిరంతరం స్వామినే ధ్యానం చేయడం వలన స్వామితోనే తాదాత్మ్యం చెందారు. భావమే సంసారానికి కారణం. మనపుట్టుకకు కారణం మన భావమే, సంకల్పమే.

ఋత్విగ్భ్యః ససదస్యేభ్యో దక్షినాం విపులామదాత్
సర్వాన్సమ్పూజ్య విధివచ్చక్రేऽవభృథమేకరాట్

తరువాత ఋత్విక్కులకూ సదస్యులకు మంచి దక్షిణ ఇచ్చి ఏక చద్రాధిపతి ఐ అందరితో కలసి అవబృత స్నానం చేసాడు

సాధయిత్వా క్రతుః రాజ్ఞః కృష్ణో యోగేశ్వరేశ్వరః
ఉవాస కతిచిన్మాసాన్సుహృద్భిరభియాచితః

పరమ యోగేశ్వరుడైన పరమాత్మ ధర్మ రాజుచేత రాజ సూయ యాగం చేసి కొన్నాళ్ళు ఉండమని అందరూ యాచిసే అక్కడే ఉన్నాడు.

తతోऽనుజ్ఞాప్య రాజానమనిచ్ఛన్తమపీశ్వరః
యయౌ సభార్యః సామాత్యః స్వపురం దేవకీసుతః

కొన్నాళ్ళు గడిచిన తరువాత ఎవరూ ఒప్పుకోకున్నా వారిని కష్టపడి బతిమలాడి కృష్ణుడు అందరితో కలసి తాను తన నగరానికి బయలుదేరాడు

వర్ణితం తదుపాఖ్యానం మయా తే బహువిస్తరమ్
వైకుణ్ఠవాసినోర్జన్మ విప్రశాపాత్పునః పునః

వైకుంఠములో ఉండే జయ విజయుల జన్మ జన్మాంతరములూ ఋషుల శాపములూ నీకు ఇదివరలో వివరముగా చెప్పాను

రాజసూయావభృథ్యేన స్నాతో రాజా యుధిష్ఠిరః
బ్రహ్మక్షత్రసభామధ్యే శుశుభే సురరాడివ

ధర్మ రాజు ఇలా స్నానం చేసి బ్రాహ్మణులూ క్షత్రియులూ ఉన్న ఆ సభలో ఇంద్రుడిలా శోభించాడు

రాజ్ఞా సభాజితాః సర్వే సురమానవఖేచరాః
కృష్ణం క్రతుం చ శంసన్తః స్వధామాని యయుర్ముదా

దేవతలూ మానవులూ ఖేచరులూ అందరూ రాజుతో పూజలు పొంది, కృష్ణున్ని ధర్మరాజునూ రాజసూయ యాగాన్ని పొగడుతూ తమ ఇంటికి తాము వెళ్ళారు

దుర్యోధనమృతే పాపం కలిం కురుకులామయమ్
యో న సేహే శ్రీయం స్ఫీతాం దృష్ట్వా పాణ్డుసుతస్య తామ్

ఇంత ఉత్సవములో కూడా కలి అంశ ఐన, పాపి ఐన కురుకులాధముడు ఐన దుర్యోధనుడు మాత్రం ధర్మరాజు వైభవాన్ని చూచి సహించలేకపోయాడు

య ఇదం కీర్తయేద్విష్ణోః కర్మ చైద్యవధాదికమ్
రాజమోక్షం వితానం చ సర్వపాపైః ప్రముచ్యతే

శిశుపాల వధా జరాసంధ వధా రాజసూయమూ శత్రు జయం, రాజుల విడుదల , ఇటువంటి కృష్ణ పరమాత్మ లీలలను విన్నవారు చదివినవారు అన్ని పాపముల నుండీ విముక్తి పొందుతారు.

                సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                             

Popular Posts