Followers

Thursday 22 May 2014

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం మూడవ అధ్యాయం

             
ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీరాజోవాచ
పరస్య విష్ణోరీశస్య మాయినామపి మోహినీమ్
మాయాం వేదితుమిచ్ఛామో భగవన్తో బ్రువన్తు నః

పరమాత్మ మాయ గురించి చెప్పండి. మహామాయావులుగా పేరు పొందిన వారిని కూడా అది మోహింపచేస్తుంది

నానుతృప్యే జుషన్యుష్మద్ వచో హరికథామృతమ్
సంసారతాపనిస్తప్తో మర్త్యస్తత్తాపభేషజమ్

మీ నోటి నుండి వచ్చే హరికథామృతము నుండి నేను తృప్తి పొందుటలేదు. సంసారం అనే మహాతాపం వలన తపించబడిన వాడు ఆ తాపానికి మందు దొరికితే విడిచిపెడతాడా . మీ నోట నుండి వచ్చే పరమాత్మ కథామృతాన్ని నేను విడిచిపెట్టలేను

శ్రీన్తరీక్ష ఉవాచ
ఏభిర్భూతాని భూతాత్మా మహాభూతైర్మహాభుజ
ససర్జోచ్చావచాన్యాద్యః స్వమాత్రాత్మప్రసిద్ధయే

పరమాత్మ ప్రకృతి నుండి మహత్తు, మహత్తు నుండి అహంకారం, దాని నుండి భూతములనూ, హెచ్చు తగ్గులనూ, తన స్వరూపాన్ని తన సంకల్పం వలన కలిగిన జగత్తు స్వరూపం తెలియుటకు స్వామి ఇలా సృష్టించి

ఏవం సృష్టాని భూతాని ప్రవిష్టః పఞ్చధాతుభిః
ఏకధా దశధాత్మానం విభజన్జుషతే గుణాన్

ఆ భూతములలో పంచభూతములుగా ప్రవేశించి, తానే ఒకడిగా ,తానే పదిగా (ఐదు జ్ఞ్యానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములుగా) ప్రవేశిస్తాడు. సత్వ రజో గుణాలను ఆస్వాదిస్తాడు.

గుణైర్గుణాన్స భుఞ్జాన ఆత్మప్రద్యోతితైః ప్రభుః
మన్యమాన ఇదం సృష్టమాత్మానమిహ సజ్జతే

ఆత్మను ప్రకాశింపచేసే సాత్వికాది గుణాలతో అందులో ఆస్కతి ఉన్నవాడిలా బంధించబడ్డ వానిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. కర్మలతో కర్మలు చేస్తాడు. ఇంద్రియములతో కర్మలు చేస్తాడు. జ్ఞ్యానేంద్రియములతో దాన్ని అనుభవిస్తాడు.
పండు తినమని మనసు చెబుతుంది.నోరు తింటుంది. తిన్న పండు రుచిని బుద్ధి చెబుతుంది. తిన్న దానికి అనుభూతి ఉండదు. అనుభూతి ఉన్నది తినదు. ఈ రెండూ చెప్పిన దానికి అనుభూతీ ఉండదు, తినడమూ ఉండదు. ఇంద్రియములూ విషయములూ పరమాత్మే అని తెలుసుకున్నపుడు ఏ బాధా ఉండదు.

కర్మాణి కర్మభిః కుర్వన్సనిమిత్తాని దేహభృత్
తత్తత్కర్మఫలం గృహ్ణన్భ్రమతీహ సుఖేతరమ్

పూర్వ జన్మ వాసనల వలన కర్మలతో కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ సంసారములో భ్రమిస్తూ ఉంటాడు

ఇత్థం కర్మగతీర్గచ్ఛన్బహ్వభద్రవహాః పుమాన్
ఆభూతసమ్ప్లవాత్సర్గ ప్రలయావశ్నుతేऽవశః

ఇలా చెప్పలేనన్ని అమంగళాలని పొందుతూ ఉంటాడు. మహా ప్రళయం దాకా పుట్టుకా చావూ అనుభవిస్తూ ఉంటాడు

ధాతూపప్లవ ఆసన్నే వ్యక్తం ద్రవ్యగుణాత్మకమ్
అనాదినిధనః కాలో హ్యవ్యక్తాయాపకర్షతి

మహా ప్రళయం వస్తే ద్రవ్యం గుణాలూ అన్నీ కాలములో కలసిపోతాయి. కాలం అన్నిటినీ తనలోకి లాక్కుంటుంది

శతవర్షా హ్యనావృష్టిర్భవిష్యత్యుల్బణా భువి
తత్కాలోపచితోష్ణార్కో లోకాంస్త్రీన్ప్రతపిష్యతి

నూరు సంవత్సరాలు పరమ భయంకరమైన అనావృష్టి . ఈ నూరేళ్ళూ సూర్యభగవానుడు మూడు లోకాలనూ తన కిరణాలతో వేపుతాడు

పాతాలతలమారభ్య సఙ్కర్షణముఖానలః
దహన్నూర్ధ్వశిఖో విష్వగ్వర్ధతే వాయునేరితః

పాతాళ లోకమునుంచి సంకర్షణుడు విష జ్వాలలు పైకి చిమ్ముతాడు వాయువుతో ప్రేరేపించబడి అది అంతటా వ్యాపిస్తుంది

సంవర్తకో మేఘగణో వర్షతి స్మ శతం సమాః
ధారాభిర్హస్తిహస్తాభిర్లీయతే సలిలే విరాట్

ఇలా నూరేళ్ళు గడిచాక సాంవర్తక మేఘాలు ఏనుగు తొండము వంటి ధారలతో వర్షిస్తాయి. ఈ నీటిలో విరాట్ పురుషుడు లీనమవుతాడు

తతో విరాజముత్సృజ్య్ వైరాజః పురుషో నృప
అవ్యక్తం విశతే సూక్ష్మం నిరిన్ధన ఇవానలః

ఈ విరాట్ పురుషుడు అవ్యక్తం (సూక్ష్మ ప్రకృతి) చేరతాడు.
కట్టెలు లేని నిపూ తనకు తానుగా చల్లారిపోయినట్లు, తాను ఉండి చేయునది ఏదీ లేనప్పుడు సూక్షములో లీనమవుతాడు
వాయుచేత గంధం హరించబడిన భూమి నీరుగా మారుతుంది. నీటిలో ఉన్న రసమును అగ్నిహోత్రుడు స్వీకరిస్తే అది అగ్నిగా మారుతుంది. రూపం తమస్సుతో అపహరించబడితే ఆ జ్యోతి వాయువులో లీనమవుతుంది. కాలము చేత తన గుణమైన శబ్దం లీనమైతే ఆ ఆకాశం ఆత్మలో లీనమవుతుంది.

వాయునా హృతగన్ధా భూః సలిలత్వాయ కల్పతే
సలిలం తద్ధృతరసం జ్యోతిష్ట్వాయోపకల్పతే

హృతరూపం తు తమసా వాయౌ జ్యోతిః ప్రలీయతే
హృతస్పర్శోऽవకాశేన వాయుర్నభసి లీయతే
కాలాత్మనా హృతగుణం నభ ఆత్మని లీయతే

ఇన్ద్రియాణి మనో బుద్ధిః సహ వైకారికైర్నృప
ప్రవిశన్తి హ్యహఙ్కారం స్వగుణైరహమాత్మని

ఇంద్రియాలూ మనసూ బుద్ధీ తమ తమ గుణములతో అహంకారములో చేరతాయి. ఇది భగవానుని మాయ

ఏషా మాయా భగవతః సర్గస్థిత్యన్తకారిణీ
త్రివర్ణా వర్ణితాస్మాభిః కిం భూయః శ్రోతుమిచ్ఛసి

సృష్టి రక్షణా ప్రళయం అనే మూటిని చేస్తుంది ఆ మాయా. వీటిని విన్నావు కదా. ఇంకేమి వినాలని అనుకుంటున్నావు

శ్రీరాజోవాచ
యథైతామైశ్వరీం మాయాం దుస్తరామకృతాత్మభిః
తరన్త్యఞ్జః స్థూలధియో మహర్ష ఇదముచ్యతామ్

అజ్ఞ్యానులు ఈ భగవంతుని మాయను ఎంత కష్టపడ్డా దాటలేరు. అలాంటి దాన్ని భగవంతుని భక్తులు సులభముగా దాటుతారు. ఇది మాకు చెప్పండి

శ్రీప్రబుద్ధ ఉవాచ
కర్మాణ్యారభమాణానాం దుఃఖహత్యై సుఖాయ చ
పశ్యేత్పాకవిపర్యాసం మిథునీచారిణాం నృణామ్

అందరం పనులు చేసే కారణం కష్టం పోవడానికీ, సుఖం కలగడానికి. కానీ అలా పని చేస్తే సుఖం తొలగి దుఃఖం కలుగుతోంది. మిథునీ చారులైన మానవులు చేసే పనులు ఇలా ఉంటాయి.

నిత్యార్తిదేన విత్తేన దుర్లభేనాత్మమృత్యునా
గృహాపత్యాప్తపశుభిః కా ప్రీతిః సాధితైశ్చలైః

సర్వకాలములలో బాధనే ఇస్తుంది ధనం. అది కూడా ఎంత కష్టపడ్డా దొరకదు. ఈ డబ్బుతో ఇల్లు కట్టుకుని పెళ్ళి చేసుకుని పిల్లలను కంటారు. ఒక్కొక్కటీ పెరుగుతూ ఉన్నప్పుడు ఒక్కో కష్టం వస్తుంది. ఈ భార్యా ఇల్లూ పిల్లలు కూడా శాశవతం కారు. ఇంక ప్రేమెక్కడిది.

ఏవం లోకం పరమ్విద్యాన్నశ్వరం కర్మనిర్మితమ్
సతుల్యాతిశయధ్వంసం యథా మణ్డలవర్తినామ్

ఈ లోకం నశ్వరం. మనమాచరించే కర్మలచే ఏర్పడినదే ప్రపంచం. ఎలా కర్మలు నశిస్తున్నాయో అలా ప్రపంచం కూడా నశిస్తుంది. ఎక్కువ తక్కువలనే భావాన్ని ధ్వంసం చేయాలి.

తస్మాద్గురుం ప్రపద్యేత జిజ్ఞాసుః శ్రేయ ఉత్తమమ్
శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యుపశమాశ్రయమ్

ఇన్ని బాధలుపడే బదులు నిజముగా జ్ఞ్యానం కోరేవారు, ఉత్తమ శ్రేయస్సును తెలియగోరేవారు గురువును ఆశ్రయించాలి
శబ్ద బ్రహ్మనూ పరబ్రహ్మనూ రెండూ బాగా తెలుసుకున్నవాడినీ, ఉపశాంతున్నీ, పరమాత్మ యందు పరిపూర్ణముగా ప్రవేశించినవాడినీ ఆశ్రయించి గురువు రూపములో ఉన్న దైవము సహాయముతో కపటము లేకుండా భాగవత ధర్మాలను నేర్చుకోవాలి

తత్ర భాగవతాన్ధర్మాన్శిక్షేద్గుర్వాత్మదైవతః
అమాయయానువృత్త్యా యైస్తుష్యేదాత్మాత్మదో హరిః

అనుసరించి నేర్చుకోవాలి. ఇలాంటి భావముతో గురువును సేవిస్తే ఫలమిచ్చే పరమాత్మ సంతోషిస్తాడు

సర్వతో మనసోऽసఙ్గమాదౌ సఙ్గం చ సాధుషు
దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్వద్ధా యథోచితమ్

గురువుగారు దయ చూపితే, గురువు గారి బోధ కలిగితే లాభం ఏమిటంటే సంసారం యందు అన్ని విధముల ప్రీతీ పోయి భగవత్ భక్తుల యందు ప్రీతి కలిగి భూతముల  యందు దయా స్నేహం వినయం తగిన రీతిలో కలుగుతుంది.

శౌచం తపస్తితిక్షాం చ మౌనం స్వాధ్యాయమార్జవమ్
బ్రహ్మచర్యమహింసాం చ సమత్వం ద్వన్ద్వసంజ్ఞయోః

పరిశుద్ధీ , శౌచమూ, తపస్సూ, ఓర్పూ మౌనం స్వాధ్యాయం నిజాయితీ బ్రహ్మచర్యం అహింస, ద్వంద్వాలలో సమత్వం కలుగుతుంది

సర్వత్రాత్మేశ్వరాన్వీక్షాం కైవల్యమనికేతతామ్
వివిక్తచీరవసనం సన్తోషం యేన కేనచిత్

అన్ని చోట్లా పరమాత్మే ఉన్నాడు, అన్ని ఆత్మలలో ఉన్న పరమాత్మను, ఇదేమీ మన నివాసం కాదు అనే భావనా, ఏకాంతముగా ఉండడం, భగవంతునిచేత లభించబడిన దాని వలన సంతోషముగా ఉండడం

శ్రద్ధాం భాగవతే శాస్త్రేऽనిన్దామన్యత్ర చాపి హి
మనోవాక్కర్మదణ్డం చ సత్యం శమదమావపి

భగవత్ శాస్త్రములో శ్రద్ధ కలిగి ఉండాలి. భగవంతుని కంటే భిన్నమైనవాటిని నిందించకుండా ఉండడం. మనసునకూ వాక్కునకూ కర్మనకూ దండించడం. ఆలోచించరాని వాటిని ఆలోచించకుండా ఉండడం దండం. మనసుకు దండం ధ్యానం.పలుకకూడని వాటిని పలుకకూడదు. వాక్కుకు దండం మౌనం. కర్మకు దండం ఈశ్వరార్పణం. శమమూ దమమూ సత్యమూ

శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్భుతకర్మణః
జన్మకర్మగుణానాం చ తదర్థేऽఖిలచేష్టితమ్

శ్రవణం కీర్తనం ధ్యానం, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికే అన్నీ ఆచరించాలి. యజ్ఞ్యయాగాదులూ దానమూ

ఇష్టం దత్తం తపో జప్తం వృత్తం యచ్చాత్మనః ప్రియమ్
దారాన్సుతాన్గృహాన్ప్రాణాన్యత్పరస్మై నివేదనమ్

ఆశ్రమాలూ, సత్రాలు నిర్మించడం. మనకు ఏ దైవం ఇష్టమో ఆ మంత్రాన్ని జపించాలి
మనవి అనుకున్నవి పరమాత్మకు అర్పించాలి

ఏవం కృష్ణాత్మనాథేషు మనుష్యేషు చ సౌహృదమ్
పరిచర్యాం చోభయత్ర మహత్సు నృషు సాధుషు

ఈ రీతిలో మానవులందరూ పరమాత్మే ప్రభువుగా భావించి, అటువంటి వారితో స్నేహం చేసి, పరమాత్మ యందు, పరమాత్మ భక్తులయందూ సాధువుల యందూ మహానుభావుల యందూ సేవ చేయాలి

పరస్పరానుకథనం పావనం భగవద్యశః
మిథో రతిర్మిథస్తుష్టిర్నివృత్తిర్మిథ ఆత్మనః

పరస్పరం కలిసినపుడు పరమాత్మ కథలనే చెప్పుకోవాలి. దాని ద్వారా ప్రీతీ తృప్తీ సంసారం యందు నివృత్తీ కలగాలి

స్మరన్తః స్మారయన్తశ్చ మిథోऽఘౌఘహరం హరిమ్
భక్త్యా సఞ్జాతయా భక్త్యా బిభ్రత్యుత్పులకాం తనుమ్

తాము తలచుకోవాలి, ఎదుటివారి చేత తలచేట్లు చేయాలి. పాపరాశి పోగొట్టే హరినామాన్ని స్మరించాలీ స్మరింపచేయాలి. చక్కని భక్తితో శరీరమంతా పులకింతలు రావాలి

క్వచిద్రుదన్త్యచ్యుతచిన్తయా క్వచిద్
ధసన్తి నన్దన్తి వదన్త్యలౌకికాః
నృత్యన్తి గాయన్త్యనుశీలయన్త్యజం
భవన్తి తూష్ణీం పరమేత్య నిర్వృతాః

పరమాత్మను స్మరిస్తూ కొందరు ఏడుస్తారు, కొందరు నవ్వుతారు, కొందరు అలౌకికముగా మాట్లాడతారు, కొందరు ఆనందిస్తారు, కొన్ని చోట్ల అలుకికముగా మాట్లాడారు, కొందరు గానమూ నాట్యమూ  చేస్తారు , కొందరు స్తబ్ధముగా ఉంటారు,స్మరితారు, కొందరు అన్ని చేష్టలుడిగి మౌనముగా ఉంటారు

ఇతి భాగవతాన్ధర్మాన్శిక్షన్భక్త్యా తదుత్థయా
నారాయణపరో మాయామఞ్జస్తరతి దుస్తరామ్

ఈ రీతిలో పరమాత్మ స్వరూపాన్ని బాగా స్మరణ చేస్తూ సులభముగా పరమాత్మను ధ్యానిస్తూ పరమాత్మ యందే మనసు లగ్నం చేసి దుస్తరమైన సంసారాన్ని దాటుతారు

శ్రీరాజోవాచ
నారాయణాభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః
నిష్ఠామర్హథ నో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమాః

పరమాత్మ అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు. ఆయన స్వరూప స్వభావాలేమిటి, ఆయన స్థితి ఏమిటి. బ్రహ్మజ్ఞ్యానులైన మీరు, బ్రహ్మజ్ఞ్యానులలో ఉత్తములైన మీరు మాకు ఆ విషయాన్ని వివరించండి.
నారాయణుడని చెప్పబడే పరబ్రహ్మ స్థితిని వివరించండి

శ్రీపిప్పలాయన ఉవాచ
స్థిత్యుద్భవప్రలయహేతురహేతురస్య
యత్స్వప్నజాగరసుషుప్తిషు సద్బహిశ్చ
దేహేన్ద్రియాసుహృదయాని చరన్తి యేన
సఞ్జీవితాని తదవేహి పరం నరేన్ద్ర

ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన వాడు , వీటి దోషాలు అంటని వాడు. ఆయనే కారణం, ఆయనే కారణం కాదు. కారణములో కార్య దోషాలు అంటుతాయి. కారణ దోషాలు కార్యమునకు వస్తాయి. జాగృతి స్వప్న సుష్ప్తి అవస్థలలో ఉంటాడు. ఆ అవస్థలు కలిగించేవాడు ఆయనే. ఆ అవస్థల వలన కలిగే వికారాలు ఆయనకు కలగవు. ఆయన లోపలా బయటా ఉంటాడు. శరీర ఇంద్రియ ప్రాణములు ఎవరి చేత బతికించబడతాయో, దాన్ని పరబ్రహ్మ అంటారు.
మూడు అవస్థలకూ లోపలా వెలుపలా ఉండేవాడు, సృష్టి స్థితి లయములకు కారణం ఐఇ కారణం కాకుండా ఉండేవాడు, దేహ ఇంద్రియ ప్రాణ హృదయములలో సంచరిస్తూ పని చేయిస్తూ జీవింపచేసేవాడు పరబ్రహ్మ, నారాయణుడు. అన్ని పనులూ చేసేవాడూ, ఏ పనీ చేయని వాడు

నైతన్మనో విశతి వాగుత చక్షురాత్మా
ప్రాణేన్ద్రియాణి చ యథానలమర్చిషః స్వాః
శబ్దోऽపి బోధకనిషేధతయాత్మమూలమ్
అర్థోక్తమాహ యదృతే న నిషేధసిద్ధిః

ఈ పరమాత్మను మనసు చేరలేదు, వాక్కు చెప్పలేదు, నేత్రములు చూడలేవు, ప్రాణేంద్రియాలు ప్రవేశించలేవు.
అగ్నిని,  అగ్ని యొక్క జ్యోతులు ప్రవేశించలేవు. అగ్ని నుండి జ్వాలలు వస్తాయి గానీ అగ్ని లోపలకు పోలేవు. పరమాత్మ నుండి ఏర్పడిన శరీరమూ ఇంద్రియమూ అవస్థలూ పరమాత్మను చేరుకోలేవు.
పరమాత్మను చెప్పగల శబ్దమంటూ ఏదీ లేదు.పరమాత్మకు శబ్దాతిగః శబ్ద సహః అన్న పేర్లు ఉన్నాయి. మనం వాడే ఏ శబ్దానికైనా అందనివాడు, మనం ఏ పేరుతో పిలిచినా పలికేవాడు. మనం ఎలా పిలుస్తే అలా పలుకుతాడు. పరమాత్మ సులభుడని చెప్పే శబ్దమే భగవంతుడు దుర్లభుడనీ చెబుతుంది.
ఉన్నాడనే వారిచే లేడన్నవారిచే పలకబడే వాడు పరమాత్మ

సత్త్వం రజస్తమ ఇతి త్రివృదేకమాదౌ
సూత్రం మహానహమితి ప్రవదన్తి జీవమ్
జ్ఞానక్రియార్థఫలరూపతయోరుశక్తి
బ్రహ్మైవ భాతి సదసచ్చ తయోః పరం యత్

సత్వమూ రజస్సూ తమసూ అనే మూడు గుణాల త్రివృత్ (ప్రకృతి), దాని నుండి మహత్తు, అహంకారం, భూతాలూ, అందులో ఉండే జీవుడు. జ్ఞ్యాన క్రియ అర్థ ఫలం అని మనం చెప్పే పలురకముల శక్తి అంతా బ్రహ్మమే. సత్, అసత్, ఆ రెంటికీ అవతల ఉన్నదీ ఆయనే. కారణం, కార్యం, ఈ రెంటికీ అవతలవాడూ ఆయనే. ప్రపంచాన్ని సృష్టించక మునుపూ సృష్టించిన తరువాతా ఉన్నాడు.

నాత్మా జజాన న మరిష్యతి నైధతేऽసౌ
న క్షీయతే సవనవిద్వ్యభిచారిణాం హి
సర్వత్ర శశ్వదనపాయ్యుపలబ్ధిమాత్రం
ప్రాణో యథేన్ద్రియబలేన వికల్పితం సత్

ఆత్మ పుట్టదూ చావదూ పెరగదూ తరుగదూ మారదూ నశించదు.పరమాత్మకు ఈ ఆరూ ఉండవు.
పరమాత్మ అన్ని చోట్లా అన్ని విధాలా ఎలాంటి హానీ లేనిది. పరమాత్మ ఉన్నాడు అని మాత్రమే చెప్పగలం గానీ, ఎలా ఉన్నాడో చెప్పలేము. ఆయన నాశం లేని వాడు అని మాత్రం చెప్పగలం.

అణ్డేషు పేశిషు తరుష్వవినిశ్చితేషు ప్రాణో హి జీవముపధావతి తత్ర తత్ర
సన్నే యదిన్ద్రియగణేऽహమి చ ప్రసుప్తే కూటస్థ ఆశయమృతే తదనుస్మృతిర్నః

ప్రాణం ఉన్నది అని చెబుతున్నాము. అది ఎక్కడ ఉన్నదో చెప్పగలమా. ఇంద్రియాలలో అవయవాలలో బుద్ధిలో గర్భములో మావిలో అన్నిటిలో ఉంది. పరమాత్మ కూడా అన్నిటిలో ఉన్నాడు.కనపడినది మాత్రమే ఉన్నది అంటే మన ప్రాణం కూడా మనకు కనపడదు. ఏ  ఒక్కదానిలో ప్రాణం లేదు అనడానికి వీలు లేదు. మన శరీరములో ఏ మార్పు ఐనా ప్రాణముంటేనే సంభవం. ప్రతీ దానిలో ఉండి పని చేయించే ప్రాణం ఎవరికీ కనపడదు.
గుడ్లలోనూ మావిలోనూ శిశువులోనూ ప్రాణముంటుంది. ఈ ప్రాణమే జీవున్ని చేరుతుంది ఆయా ప్రాంతాలలో. పరమాత్మ అన్నిటిలో ఉండి అన్నీ చేయిస్తూ ఎవరికీ కనపడడు.ఇంద్రియములు బలహీనమైన నాడు, అహం (నేను ) అనే దాన్ని అనలేని నాడు, ఎటువంటి మార్పు లేనివాడు ఐన పరమాత్మను మనం స్మరిస్తాము. అపుడు పరమాత్మ స్మరణ మనకు కలుగుతుంది

యర్హ్యబ్జనాభచరణైషణయోరుభక్త్యా
చేతోమలాని విధమేద్గుణకర్మజాని
తస్మిన్విశుద్ధ ఉపలభ్యత ఆత్మతత్త్వం
శాక్షాద్యథామలదృశోః సవితృప్రకాశః

పరమాత్మ పాదాలను చేరాలన్న భక్తితో మనసుకు ఉన్న అన్ని మలాలనూ శుద్ధి చేసుకోగలిగితే, గుణముల వలనా కర్మల వలనా మనసుకు కలిగిన మురికి తొలగించబడి మనసు పరిశుద్ధమైన నాడు పరమాత్మ తత్వం తెలుస్తుంది.
కన్నులో ఏ దోషం లేకుంటేనే సూర్యుని వెలుగు మన చేత తిలకించబడుతుంది. అలాగే మనసులో ఏ దోషం లేని నాడే ఆత్మ తత్వం కనపడుతుంది.

శ్రీరాజోవాచ
కర్మయోగం వదత నః పురుషో యేన సంస్కృతః
విధూయేహాశు కర్మాణి నైష్కర్మ్యం విన్దతే పరమ్

కర్మల వలన కలిగే మలములు ఎలా పోగొట్టలి. ఏ కర్మ యోగం చేత సంస్కరించబడిన పురుషుడు తానాచరించిన అన్ని కర్మలనూ దూరముగా తరిమేసి, నైష్కర్మ్యాన్ని పొందుతాడు

ఏవం ప్రశ్నమృషీన్పూర్వమపృచ్ఛం పితురన్తికే
నాబ్రువన్బ్రహ్మణః పుత్రాస్తత్ర కారణముచ్యతామ్

నేను మా నాన్నగారి దగ్గర ఇటువంటి ప్రశ్నలు అడిగి ఉన్నాను. అన్నీ చెప్పారు కానీ, ఈ ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేదు. దానికి కారణమేమిటి

శ్రీఆవిర్హోత్ర ఉవాచ
కర్మాకర్మ వికర్మేతి వేదవాదో న లౌకికః
వేదస్య చేశ్వరాత్మత్వాత్తత్ర ముహ్యన్తి సూరయః

మనము సహజముగా ఆచరించ వలసినవి కర్మలు. ధర్మ విరుద్ధమైనది వికర్మ. కర్మ చేస్తూ కూడా కర్తృత్వ భావన వదిలితే అది అకర్మ.
వేదమంటే పరమాత్మే. జ్ఞ్యానులు కూడా ఈ విషయములో మోహాన్ని పొందుతారు.

పరోక్షవాదో వేదోऽయం బాలానామనుశాసనమ్
కర్మమోక్షాయ కర్మాణి విధత్తే హ్యగదం యథా

వేదం పరోక్షవాదం. అన్ని కర్మలూ చేయమంటుందీ, ప్రతీ కర్మా మానమంటుంది. చిన్న పిల్లలకు బుజ్జగింపులాంటిది వేదం. సత్యం తెలిసేంతవరకే అసత్యాన్ని నమ్ముతాము. బ్రహ్మ తత్వం తెలిసేంతవరకే కర్మలు చేస్తాము..
అన్ని కర్మలనుండీ విముక్తి కలగడానికే కర్మలు చేస్తాము.వేదం చెప్పిన రీతిలో కర్మలు ఆచరించి, ఫలితాన్ని పొంది, ఆ పొందిన ఫలితం నశించాక, నశించే కర్మలు వద్దని, నశించని కర్మలు కావాలని నశించని కర్మలు తెలుస్కోగోరి ప్రయత్నం చేయడం ఉద్దేశ్యం. అన్ని కర్మలూ మానడానికే ఈ కర్మ విధానం.రోగం పోవడానికి ఔషధం వాడతాము. రోగం పోగానే ఔషధం మానేస్తాము. అజ్ఞ్యానం ఉన్నంతవరకూ కర్మలు చేస్తూ ఉంటాము. అజ్ఞ్యానం పోగానే కర్మలు చేయడం మానుతాము.

నాచరేద్యస్తు వేదోక్తం స్వయమజ్ఞోऽజితేన్ద్రియః
వికర్మణా హ్యధర్మేణ మృత్యోర్మృత్యుముపైతి సః

అలా అని, అజ్ఞ్యానముతో ఇంద్రియ నిగ్రహం లేక వేదోక్త కర్మలు ఆచరించకుంటే అది వికర్మ అవుతుంది. అధర్మమవుతుంది. నరకానికి దారి అవుతుంది.

వేదోక్తమేవ కుర్వాణో నిఃసఙ్గోऽర్పితమీశ్వరే
నైష్కర్మ్యం లభతే సిద్ధిం రోచనార్థా ఫలశ్రుతిః

వేదోక్తమైన కర్మలు చేయాలి. చేసే పని యందు ఆసక్తి లేకుండా చేయాలి. పరమాత్మకు అర్పిస్తూ పని చేయాలి. భగవంతుని మీద నమ్మకం కలగడానికే అర్థవాదాలన్నీ.

య ఆశు హృదయగ్రన్థిం నిర్జిహీఋషుః పరాత్మనః
విధినోపచరేద్దేవం తన్త్రోక్తేన చ కేశవమ్

ఎవరు కర్మా సంక్సారమూ బంధమూ అనే హృదయ గ్రంధిని గెలవాలని అనుకుంటాడో, భగవంతున్ని ఆరాధించాలన్నా ఆత్మ జ్ఞ్యానం కలగాలన్నా అహంకారాన్ని పోగొట్టుకోవాలన్నా వేద విధితోనే భగవంతున్ని ఆరాధించాలి. నిత్యమూ ఆగమ విధితో పరమాత్మను ఆరాధించాలి. దాని వలన మనసుకు శుద్ధి కలుగుతుంది.మనం చేసే కర్మలకు పరిశుద్ధి కలుగుతుంది. ఆరాధన శుద్ధి కోసం, ఆరాధనతో శుద్ధి కలిగితే ఆత్మ జ్ఞ్యానం కలుగుతుంది. హృదయ గ్రంధి భేధించబడుతుంది

లబ్ధ్వానుగ్రహ ఆచార్యాత్తేన సన్దర్శితాగమః
మహాపురుషమభ్యర్చేన్మూర్త్యాభిమతయాత్మనః

ఆచార్యుల వలన అనుగ్రహాన్ని పొంది, వారు చెప్పిన ఆగమోక్తముగా ఆరాధించాలి. ఆగమం గానీ మంత్రం గానీ దేవతను గానీ మనకు ఇష్టం వచ్చినట్లు చేయరాదు. గురువుగారు చెప్పినట్లు చేయాలి. అర్వణాన్ని చూచి చెబుతారు ఏ మంత్రాన్ని దేవతలనూ ఆగమాన్నీ ఆరాధించాలో. నామార్వణం రాశ్యార్వణం రేఖార్వణం. వక్షస్థలములోనూ హస్తములోనూ ఉన్న రేఖలను చూసి, రాశిలో లగ్న కూటమి (మోక్షకారకుడు విద్యాకారకుడు సుఖ కారకుడూ కళత్రం - ఈ నలుగురూ ఎక్కడ ఉన్నారో, వారు వారు ఉన్న స్థితి బట్టి అది ఏ దేవతను సూచిస్తుందో దాన్ని బట్టి) ఏ దేవతని ఆరాధించాలో, ఏ మంత్రాన్ని అనుష్టించాలో ఏ ఆగమం ప్రకారం ఆరాధించాలో చెబుతారు గురువుగారు.మన శరీర అవయవ నిర్మాణం, రేఖలూ మన ఇష్టం కాదు. మన పూర్వ జన్మలో ఆచరించిన కర్మ ఫల శేషం, మనం ఇపుడు ఏ కర్మలు చేయాలో ఏ కర్మలు చేయడానికి యోగ్యుడో వాటిని సూచించే విధముగా ఉంటాయి. వాటిని చూచి గురువుగారు చెబుతారు. ఏ ఆకారాన్నైనా పెట్టుకుని పూజించవచ్చు. కానీ ఆరాధనా విధానం మాత్రం గురువుగారు చెప్పాలి. ఆ విధానముతో మనకు నచ్చిన మూర్తిని ఆరాధించాలి.

శుచిః సమ్ముఖమాసీనః ప్రాణసంయమనాదిభిః
పిణ్డం విశోధ్య సన్న్యాస కృతరక్షోऽర్చయేద్ధరిమ్

పవిత్రుడై, స్వామికి అభిముఖముగా కూర్చుని, ప్రాణాయామాదులతో మొదలు శరీరాన్ని శుద్ధి చేYఆలి.  మానసిక దోషాలను ప్రాణాయామముతో, వాక్కు దోషాలను మౌనముతో, శరీర దోషాలను గురు శుశ్రూషతో పోగొట్టుకోవాలి.

అర్చాదౌ హృదయే చాపి యథాలబ్ధోపచారకైః
ద్రవ్యక్షిత్యాత్మలిణ్గాని నిష్పాద్య ప్రోక్ష్య చాసనమ్

న్యాసం చేయాలి. సృష్టి న్యాసం, స్థ్తి న్యాసం, లయన్యాసం. భగవంతున్ని ఆరాధించడానికి ఈ శరీరం పనికిరాదు. తంత్రోక్త విధానముతో జీవుడిని బయటకు రప్పించి ఎదురుగా ఉన్న పరమాత్మ పాదాల యందు ఉంచి (లయన్యాసం), భగవంతున్ని ఆరాధించడానికి యోగ్యముగా ఉన్న జీవ స్వరూపాన్ని ఆయన పాదల నుండి ప్రవేశింపచేసుకోవాలి (సృష్టిన్యాసం) . అతన్ని పరమాత్మ ఆరాధనకు అర్హుడిగా చేయలి. ఇది స్థితిన్యాసం. భగవధారాధనకు అనుగుణమైన స్వరూపాన్ని భగవంతుండే ప్రసాదిస్తాడు. మనం దీనితో భగవంతున్ని ఆరాధించి, పూర్తి ఐన తరువాత, స్వామికి ద్వార బంధం వేసే ముందు స్వామి నుండి తెచ్చిన దాన్ని స్వామికే అర్పించి, మన స్వరూపాన్ని తీసుకుని బయటకు రావాలి.
మన ఇంటిలో కూడా లఘున్యాసముతో సృష్టి స్థితి లయన్యాసములు చేయాలి. ఈ మాంస పిండాన్ని శుద్ధి చేసిన తరువాతనే పరమాత్మను ఆరాధించాలి
మనకు ఏది లభ్సితే వాటితోనే ఉపచారం చేయవచ్చి. ద్రవ్యమునూ (ఆపోహిష్టామయ....)  భూమినీ (భూమ్నా.... భూసూక్తముతో ) ఆత్మనూ (పురుష సూక్తముతో ఆత్మను) లింగాన్ని (ఇదం పాంచభౌతికం శరీరం, అగ్ని సూక్తముతో శుద్ధి చేయాలి)
మనం కూర్చునే ఆసనాన్ని ప్రోక్షణ చేసి, స్వామికి అర్ఘ్య పాద్యాదులిచ్చి (ఏలాలవంగ జాజి ...)

పాద్యాదీనుపకల్ప్యాథ సన్నిధాప్య సమాహితః
హృదాదిభిః కృతన్యాసో మూలమన్త్రేణ చార్చయేత్

సావధాన మనస్కుడై హృదయన్యాసం కరన్యాసం అంగన్యాసం చేసుకొని "ఓం నమో నారాయణాయ" అనే మూల మంత్రముతో అర్చించి,

సాఙ్గోపాఙ్గాం సపార్షదాం తాం తాం మూర్తిం స్వమన్త్రతః
పాద్యార్ఘ్యాచమనీయాద్యైః స్నానవాసోవిభూషణైః

ఏ మూర్తిని ఆరాధిస్తారో ఆ మూర్తికి ఏది మంత్రమో ఆ మంత్రానికి ఏది మూల మంత్రమో ఆ మంత్రముతో ఆరాధించాలి. షోడశోపచారాలు చేసి

గన్ధమాల్యాక్షతస్రగ్భిర్ధూపదీపోపహారకైః
సాఙ్గమ్సమ్పూజ్య విధివత్స్తవైః స్తుత్వా నమేద్ధరిమ్

రకరకాల స్తోత్రములతో స్తోత్రం చేసి స్వామికి నమస్కరించాలి

ఆత్మానమ్తన్మయమ్ధ్యాయన్మూర్తిం సమ్పూజయేద్ధరేః
శేషామాధాయ శిరసా స్వధామ్న్యుద్వాస్య సత్కృతమ్

తనను పరమాత్మ మయముగా భావించి ఆరాధించాలి. స్వామిని ఆరాధించడానికి స్వామే కావాలి.
శేష వస్త్రాలను శిరస్సున ఉంచి, స్వామికి ఉద్వాసన చేయాలి.

ఏవమగ్న్యర్కతోయాదావతిథౌ హృదయే చ యః
యజతీశ్వరమాత్మానమచిరాన్ముచ్యతే హి సః

విగ్రహం లేనప్పుడు అగ్నిలో సూర్యునిలో జలములో అథితిలో , ఏమీ లేకుంటే హృదయములో ఉన్న పరమాత్మను ఈ విధముగా పరమాత్మను ఆరాధిస్తే త్వరలో ముక్తి పొందుతారు.

                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Popular Posts