Followers

Friday 19 July 2013

రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము)

కృష్ణుడు:
అత్యంత రహస్యమైన,విద్యలకు రాజు ఐన విద్యను అసూయలేని నీకు చెప్తాను విను. ఈ విద్య రహస్యము,ఉత్తమం,ఫలప్రదం,ధర్మయుక్తం,సులభము,శాశ్వతం.
దీన్ని పాటించనివారు పుడుతూనే ఉంటారు.
నిరాకారుడనైన నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను.అంతా నాలోనే ఉంది.నేను వాటియందు లేను. జీవకోటి నన్ను ఆశ్రయించిలేదు.నా ఈశ్వర శక్తిని చూడు.నేనే అంతా సృష్టించి పోషిస్తున్నప్పటికీ వాటిని ఆశ్రయించి ఉండను.ప్రాణులన్నీ నాయందే ఉన్నాయి.
ప్రళయకాలంలో అన్ని ప్రాణులూ నా మాయలోనే లయమవుతాయి,సృష్టి మొదలులో నా మాయతో తిరిగి పుట్టిస్తాను.
అయినా నేను తటస్థంగా ఉండడం వలన ఆ కర్మలు నన్ను అంటవు.
నా సంకల్పం చేతనే నా మాయ సృష్టి కార్యం చూస్తోంది.
నా తత్వం తెలియని వాళ్ళూ నన్ను సామాన్యుడిగా భావించి తిరస్కరిస్తారు.
అలాటివాళ్ళూ వ్యర్థ కర్మలతో,దురాశలతో అజ్ఞానంచే రాక్షసభావాలకు గురి అవుతున్నారు.
మహాత్ములు నా తత్వం తెలుసుకొని నిశ్చలభక్తి తో నన్ను సేవిస్తున్నారు.
కొందరు జ్ఞానయోగులు ద్వైత,అద్వైత పద్దతులలో నన్ను ఉపాసిస్తున్నారు.
యజ్ఞమూ,దానికి ఉపయోగపడు పదార్థాలూ,ఫలితము,అగ్ని అన్నీ నేనే.
తల్లి,తండ్రి,తాత,తెలుసుకోదగినవాడు,వేదాలు,ఓంకారము అన్నీ నేనే.
ఆశ్రయము,ప్రభువు,సాక్షి,ఆధారము,హితుడు,కారణము నేనే.
కరువు,సస్యశ్యామలం,మృత్యువు,అమృతం,సత్,అసత్ అన్నీ నేనే.
స్వర్గం పొందాలనే కోరికతో కర్మలు చేసేవాళ్ళూ అది పొంది భోగాలు అనుభవించి పుణ్యఫలం క్షీణించగానే మళ్ళీ భూలోకంలో పుడతారు.
నిరంతరము నా ధ్యాసలోనే ఉంటూ,నన్నే ఉపాసించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను.
శ్రద్దాభక్తులతో ఇతర దేవతలను పూజించేవారు కూడా నన్ను పూజించేవారే అగుచున్నారు.కాని అది చుట్టుమార్గం.
వారు నా స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వలన పునర్జన్మలు పొందుతున్నారు.
దేవతలను పూజించేవారు దేవలోకాన్ని,పితరులను పూజించేవారు పితృలోకాన్ని,భూతాలను పూజించేవారు భూతలోకాన్ని పొందుతారు.నన్ను సేవించేవాళ్ళు నన్నే పొందుతారు.
భక్తితో సమర్పించే ఆకు కానీ,పువ్వు కానీ,పండు కాని ,నీళ్ళైనా కాని నేను ప్రేమతో స్వీకరిస్తాను.
నువ్వు చేయు పని,భోజనం,హోమం,దానం,తపం అన్నీ నాకూ సమర్పించు.అప్పుడు కర్మల నుండి విముక్తుడవై నన్ను పొందుతావు.
ఇష్టము,అయిష్టము అన్న భేదం నాకు లేదు.అంతా సమానమే.నాను భజించువారిలో నేను,నాలో వారు ఉంటాము.
స్థిరభక్తితో సేవించువారు ఎంత దురాచారులైనా వారు సాధువులే.అలాంటివారు తొందరగానే పరమశాంతి పొందుతారు.నా భక్తుడు ఎన్నడూ చెడిపోడని ప్రతిజ్ఞ గా చెప్పవచ్చు.
పాపులైనా కానీ,స్త్రీ,వైశ్య,శూద్రులైనా కాని నన్ను ఆశ్రయిస్తే నిశ్చయంగా మోక్షం పొందుతారు.
నాయందు మనసు నిల్పి,నా భక్తుడవై,నన్నే సేవించు.నన్నే నమ్మి,నాకే నమస్కరిస్తూ,నాయందే దృష్టి నిలిపితే నన్ను పొందితీరుతావు.

Popular Posts