Followers

Sunday 28 July 2013

ద్రాక్ష పండు సౌoదర్యానికి ఎంతో మేలు

ద్రాక్ష  ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, మరియు వైన్ తయారుచేయవచ్చును. ద్రాక్ష తోటల పెంపకాన్ని ‘వైటికల్చర్’ అంటారు.


ద్రాక్ష… పేరు వింటేనే తినాలనిపిస్తుంది. అంతటితో ఆగితే ఎలా! వాటి వల్ల ఆరోగ్యానికి… సౌందర్యానికి ఎంత మేలో తెలుసుకోవద్దూ!


ఆరోగ్యం

* ద్రాక్ష పండ్లలోని టన్నీస్‌, పాలిఫినాల్స్‌ క్యాన్సర్‌ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి.


* ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు.. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా సాయపడుతూ గుండె కవాటాల పనితీరును మెరుగుపరుస్తాయి.


* ద్రాక్ష గింజల్లో ఉండే ప్రొనాంథోసైనిడిన్‌ అనే పదార్థం కాలేయాన్ని సంరక్షిస్తుంది. పెద్దవయసు వారిలో సహజంగా తలెత్తే దృష్టి లోపాన్ని నియంత్రించి కంటిచూపును మెరుగుపరుస్తుంది.


* తలనొప్పితో బాధపడేవారికి ద్రాక్షలోని సుగుణాలతో ఉపశమనం లభిస్తుంది


సౌందర్యం

* ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. మేనిని కాంతిమంతం చేస్తుంది.


* వీటిల్లోని పైటోకెమికల్స్‌ కణాల క్షీణతను తగ్గించటంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి వేస్తాయి.


* జీవం కోల్పోయిన జుట్టుకు ద్రాక్ష గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. వాటిల్లోని ఫ్యాటీ ఆమ్లాలు శిరోజాలకు పోషణను అందించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. దాంతో శిరోజాలకు మంచి నిగారింపు వస్తుంది.


* చర్మ సంరక్షణకు ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే వీటిని స్క్రబ్‌, మాయిశ్చరైజర్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. తాజా ద్రాక్షలను గుజ్జులా చేసి మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.


ఉపయోగాలున్నాయని అతిగా తినడం, సౌందర్య పోషణకు వినియోగించడం మంచిది కాదు. తగిన మోతాదు వాడకంతోనే అన్ని విధాలా ఆనందం.


తెల్లద్రాక్ష, నల్లద్రాక్ష… రంగేదైనా కానివ్వండి. తినడానికి రుచిగా ఉండటమే కాదు సౌందర్యపోషణలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. ద్రాక్షపండ్లు సహజక్లెన్సర్లుగా పనిచేసి చర్మంపై ఉండే మురికిని పోగొడతాయి కాబట్టి సౌందర్యనిపుణులు వీటిని చర్మసంరక్షణలో భాగంగా అనేక రకాలుగా ఉపయోగిస్తారు.


* ఎండల్లో ఎక్కువగా తిరిగితే ముఖం వాడిపోయినట్టవుతుంది. అలాంటి సమయంలో ఒక కప్పు తెల్లద్రాక్ష తీసుకుని వాటిని మెత్తగా చిదిపేసి ఆ గుజ్జులో టేబుల్‌స్పూన్‌ తేనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగెయ్యండి. మురికి పోయి ముఖం తేటగా అవుతుంది.

* సైజులో పెద్దగా ఉండే గింజలేని తెల్లద్రాక్షను తీసుకుని సగానికి కొయ్యండి. ఆ ముక్కతో ముఖమంతా సున్నితంగా రాయండి. కళ్లకిందా పెదవుల చివర… ఇలా ముడతలు పడటానికి ఎక్కువ అవకాశం ఉండే ప్రదేశాల్లో ఇంకొంచెం ఎక్కువ సేపు రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని పొడిగుడ్డతో తుడుచుకోవాలి. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతల్ని సమర్థంగా నిరోధిస్తాయి.

* రెండు చెంచాల ద్రాక్షరసానికి ఒక టేబుల్‌స్పూన్‌ చొప్పున పెరుగు, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రుద్దండి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగెయ్యండి. ఈ మాస్క్‌ ముఖచర్మాన్ని శుభ్రపరచి మృదువుగా ఉంచుతుంది.

* ఒక టేబుల్‌స్పూన్‌ ద్రాక్ష రసంలో గుడ్డులోని పచ్చసొన బాగా కలిపి ముఖానికి రాయండి. పదినిమిషాల తర్వాత చల్లటినీళ్లతో కడుక్కోండి. పొడిచర్మం గలవారికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. అదే, మీది జిడ్డు చర్మమైతే పచ్చసొన స్థానంలో తెల్లసొన వాడితే సరిపోతుంది.

Popular Posts