ఇతరుల కష్టాల్ని చూసి బాధపడినప్పుడే దైవానుగ్రహానికి పాత్రులవుతాం’’ అని భగవద్గీతఅంటుంది. జీవకారుణ్యం, భూతదయ ముక్తికి సోపానాలు. ఎవరైనాసరే అజ్ఞాన దశలో చేసిన పాపకార్యాలకు పశ్చాత్తాప పడి కన్నీరు కారిస్తే వారికి దైవానుగ్రహం లభిస్తుంది. అందుకే అంటారు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని. తెలిసోతెలియకో అందరం తప్పులు చేస్తాం. అందుకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెంది చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి. అప్పుడే మన పాపాలు పటాపంచలవుతాయి. ఫలితంగా దైవానికి చేరువవగలుగుతాం. ప్రతి వ్యక్తి జీవకారుణ్యం, భూతదయ, పశ్చాత్తాపం కలిగి ఆత్మలన్నింటిని తన మాదిరిగానే భావించాలి. ‘‘దుఃఖించు వారితో దుఃఖించి, సంతోషించు వారితో సంతోషించునట్టి వాడే నిజమైన యోగి.’’అన్నాడు వివేకానందస్వామి. అంటే ఇతరుల సుఖ దుఃఖాల్ని నీ సుఖ దుఃఖాలుగా భావించు అని అర్ధం. మన కాలికి ముల్లుగుచ్చుకుంటే ఎలా బాధపడతామో, ఇతరుల కష్టాల్ని చూసినప్పుడు అలాగే బాధపడాలి. వీలైతే వాటిని నివారించే ప్రయత్నం చెయ్యాలి. పశ్చాత్తాప హృదయులకు, దయార్ద్ర హృదయులకు పరమాత్మ సాక్షాత్కారం సులువుగా లభిస్తుంది. కఠినాత్ములకు అది ఎంతమాత్రం సాధ్యపడదు. మన చుట్టూ ఆకలితో అలమటించేవారు, వ్యాధిగ్రస్తులు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి చేతనైన సహాయం చెయ్యగలిగితే తప్పకుండా పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు.
‘‘నీ పొరుగింటి వానిని ప్రేమించిన గాని, భగవంతుడు నిన్ను ప్రేమించడు’’అని బైబిలులో చెప్పబడింది. అర్జునుడు ఇటువంటి లక్షణాల్ని కలిగి ఉండబట్టే ఆయన్ని వ్యాజముగా ఉంచుకుని పరమాత్మ మనందరికి గీతోపదేశం చేసాడు.
సర్వోపనిషత్తులు ఆవు వంటివి. ఆవు నుంచి దూడ కుడిచిన తర్వాతే పాలను పిండాలి. అలా పితకబడిన పాలే శ్రేష్టమైనవి. ఉపనిషత్తులనే గోమాత నుంచిఅర్జునుడు అనబడే దూడ కుడిచి వదిలిపెట్టిన శేషాన్ని మనం త్రాగాలి. సద్బుద్ధిగలవారికే గీత బోధపడుతుంది. ఎవరి గీత బాగుంటుందో వారికే గీత అర్థవౌతుంది. గీతామృతం పిండబడిన పాలు. ఇది నూట ఎనిమిది ఉపనిషత్తుల సారాంశం. అటువంటి అమృతాన్ని పరమాత్మ అర్జునుని ద్వారా మనకు అందించాడు. దీనిని ఆస్వాదింపగలిగినవారే దైవానుగ్రహానికి పాత్రులవుతారు.