Followers

Wednesday 10 April 2013

ఉగాది: పంచాంగ శ్రవణం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయ్!

వసంత ఋతువు వచ్చేసింది. చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేస్తాయి. కోయిలలు కుహు... కుహు రాగాలు పాడుతుంటాయి. ఇటువంటి వసంత ఋతువు ప్రారంభమయ్యేది చైతన్యశుద్ధ పాడ్యమినాడు. ఆ రోజున అశ్వినీ నక్షత్రం ఉంటుంది. 

మాసాల్లో చైత్రం, తిథుల్లో పాడ్యమి, నక్షత్రాల్లో అశ్విని మొదటిది. అంటే ఉగాది ...కాలచక్రం ఒక ఆవృతం పూర్తిచేసి మళ్లీ మొదలయ్యే రోజన్నమాట. అందుకే, ఇది కాలానికి సంబంధించిన అతిముఖ్యమైన పండుగ. ఉగాది తెలుగువారు కొత్త సంవత్సరాదిగా జరుపుకుంటారు.
కొత్త ఏడాదికి ప్రారంభ దినమైన ఈరోజున వేకువ జామున లేచి నువ్వుల నూనె రాసుకుని తలంటుస్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి నగలు, ఆభరణాలు ధరించాలి. తర్వాత మామిడి, వేప ఆకులతో ఇంటికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవలసింది ఉగాది పచ్చడి.
ఉగాది నాడు వేపపువ్వు, బెల్లం, మామిడి, చింత, ఎండు మిరప ఇలా చాలా వాటిని కలిపి పచ్చడి తయారు చేసుకుని స్వీకరించాలి. ఇలా షడ్రుచులు కలుపుకొని పచ్చడి చేయడంలో కూడా అర్థముంది. బెల్లం అంటే తీపి సుఖానికీ, లాభానికీ, ప్రేమకూ, విజయానికి సంకేతం. వేప అంటే చేదు దుఃఖానికీ, నష్టానికీ, ద్వేషానికీ అపజయానికీ సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖదుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడానికి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.
ఉగాది నాటి సాయంత్రం తప్పక చేయాల్సింది పంచాంగ శ్రవణం. ఖగోళ, జ్యోతిష శాస్త్రాలు ఉండే పంచాంగ శ్రవణం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ ఉగాదిన మనం విజయనామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ప్రభవ, విభవ ఇలాంటి 60 సంవత్సరాల్లో ఇది 27వది. మన పెద్దలు చెప్పిన ప్రకారం ఉగాదిని ఆచరిస్తే ఆయురారోగ్యాలూ వస్తాయి.

Popular Posts