Followers

Monday 30 September 2013

విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక


మనం నివసించే ఈ విశ్వం, సౌరమండలం, భూమి ఇవన్ని అనేక అద్భుతాలకి నిలయాలు. మనిషి మేధస్సు ఎంత పురోగతిని సాధించినా తెలుసుకోవలసిన విశ్వ రహస్యలు ఎన్నో మిగిలే వుంటాయి. ఈ అద్భుత ప్రపంచం గురించి ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. హబుల్ టెలెస్కోప్ ని ప్రయోగించి రోదసిలో జరిగే అనేక అంతుచిక్కని నక్షత్రమండలాలని, వాటిలో జరిగే ప్రక్రియల్ని కనుగొంటున్నారు. కాని మనకి తెలియని, మనం మరిచిపోయిన మరొక విషయం ఏమిటంటే, మహా తపో శక్తి సంపన్నులయిన మన మహర్షులు, యోగులు సకల చరాచర సృష్టికి మూల స్తానమయిన మహాశక్తి కేంద్రాన్ని దర్శించారు. అది కూడా ఎటువంటి టెలెస్కోపులు, పరికరాలు లేకుండానే. దీనికి సజీవ సాక్ష్యం శ్రీ విష్ణు సహస్ర నామం.

మనం వుంటున్న సౌర కుటుంబం, పాలపుంత (Milkyway Galaxy) చుట్టు 200 మిలియన్ల సంవత్సరాలకి ఒకసారి ప్రదక్షిణ చేస్తూ ఉంది. ఈ పాలపుంత మధ్య భాగం అనేక కోట్ల నక్షత్రాలతో కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్ని వెదజల్లుతూ ఉంటుంది. అది ఎంత అద్భుతమయిన వెలుగంటే, మనం ఒక సూర్యుడి వైపే పూర్తిగా చూడలేము. అటువంటిది కొన్ని కోట్ల సూర్య సమానమయిన కాంతిని మన నేత్రాలు చూడలేవు. ఆ నక్షత్రాలు కూడా ఒక దానికొకటి బాగా దగ్గరగా వుంటాయట. మన వున్న ఈ సౌర కుటుంబం పాల పుంతకి ఒక పక్కగా వుండడం వల్ల మనకు దాని కేంద్ర భాగాన్ని చూసే అవకాశం లేదు. అందువల్లనే భూమి మీద వున్న వారికి రాత్రి వేళ అక్కడొ నక్షత్రం ఇక్కడో నక్షత్రం కనిపిస్తూ వుంటాయి. కాని పాలపుంత మధ్య భాగంలో మాత్రం ఏ సమయంలోనయినా ఒకేలా అత్యంత ప్రకాశవంతంగా వుంటుంది. సకల విశ్వానికీ మూలాధారమయిన శక్తి అక్కడి నుండే ప్రవహిస్తు వుంటుంది. అన్ని జీవరాశులలో ప్రవహించే ఈ శక్తికే మన వారు "విష్ణు" అని, "నారాయణ" అని నామకరణం చేసారు. అటువంటి విష్ణువు వుండేది పాల సముద్రం అంటారు. విష్ణు సహస్ర నామంలో "క్షీరో ధన్వత్ ప్రదేశే" అన్న మాటకి అక్కడ పాలు వుంటాయని కాదు. ఆ లోకం అత్యంత ప్రకాశవంతంగా ఎటుచూసినా పాల వంటి స్వచ్చమయిన కాంతులు వెదజల్ల బడుతూ వుంటుంది అని అర్ధం. "విశ్వం విష్ణు " అనే పదానికి అర్ధం ఈ విశ్వమతా విష్ణు స్వరూపమే అని. ఈ ప్రపంచం మొత్తం, ఆయనలోనిదే. విష్ణువుకి నాలుగు చేతులు వుంటాయని "చతుర్భుజహ" అనే నామం చెబుతుంది. విశ్వంలో వుండే ఎక్కువ శాతం స్పైరల్ గెలాక్సీలకి నాలుగు భుజాలుంటాయి. ఈ క్రింది ఫోటొ గమనించండి. అదే విష్ణువు యొక్క స్వారూపం. "భుజగ శయనం" అనే మాటకి అర్ధం విష్ణువు పాము మీద పడుకుంటాడని కాదు. పాలపుంత మధ్యలో జరిగే అనేక చర్యల్లో భాగంగా అత్యంత వేడి, పొగలు, మనవూహకి కూడా అందనంత వేగంగా, పాము బుసలు కొట్టిన మాదిరిగా పైకి ప్రవహిస్తూ వుంటాయి. అందుకే విష్ణువు పవళించే ఆది శేషుడికి పదివేల తలలుగా పోల్చారు మన మహర్షులు.



భూమి మీద వుండే ప్రాణులన్నీ విష్ణువు యొక్క నాభి నుంచి పుట్టిన కమలం నుండి పుట్టిన బ్రహ్మ ద్వార సృష్టించబడ్డాయని అంటారు. ఆయనకి అందుకే "పద్మనాభుడు" అనే పేరు పెట్టారు. నిజానికి ఈ పద్మం అనేది విశ్వం యొక్క మధ్య భాగంలో అనేక చర్యల ఫలితంగా ఏర్పడ్డ మేఘాలు మొదలయినవి ఆ నాభి ప్రాంతం నుండి కొన్ని కోట్ల కిలో మీటర్ల ఎత్తుకి ప్రయానించి అక్కడ చల్లబడి పువ్వు ఆకారంలో ఏర్పడి, అక్కడ జరిగే మరిన్ని చర్యలద్వారా క్లిష్టమయిన కార్బన్ గొలుసుకట్టు ఏర్పడి, వాటి యొక్క ఒక అజ్ఞాత విధానంలో ప్రాణం అనేది పుట్టి, అది ఈ విశ్వమంతా చేయబడుతుందని భావించవచ్చా? బహూశా అదే బ్రహ్మ స్వరూపమయి వుండవచ్చు. సృష్టించేది బ్రహ్మ అయినా గాని, ప్రాణులకి నిరంతరం శక్తి సరఫరా అయ్యేది మాత్రం విష్ణు లోకం నుంచే అనేది మనం అర్ధం చేసుకొవచ్చు అనుకుంటాను.


అదే కాకుండా విష్ణు సహస్ర నామంలో మరొక చోట "సహస్ర మూర్థా విశ్వాత్మా, సహస్రాక్ష సహస్ర పాత్" అని వుంటుంది. అంటే విష్ణువు యొక్క వైభవాన్ని వర్ణించడానికి మాటలు రాక ఆయన్ని దర్శించిన మహర్షులు "కొన్ని వేల చేతులు, కొన్ని వేల ఆకారాలు, కొన్ని వేల పాదాలు కనిపించినట్లుగా వర్ణించారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో అద్భుతాలు విష్ణు సహస్ర నామంలో వున్నాయి. బహుశా అవన్ని చదివి, మానసికంగా దర్శించగలగడం ఈ జన్మకి సాధ్యమవుతుందో లేదో తెలియడం లేదు.

Popular Posts