Followers

Friday 3 May 2013

ఆత్మ- పరమాత్మ



ఆత్మ, పరమాత్మ అనే పదాలను తరచుగా ఆధ్యాత్మిక ప్రసంగాల్లో వింటూ ఉంటాము. అనేకమంది స్వామీజీలు లేదా ఆధ్యాత్మికవేత్తలు ఆత్మ, పరమాత్మల గురించి వారి ఆధ్యాత్మిక ప్రసంగాల్లో వివరిస్తుంటారు. కానీ వారికి ఉండే భాషా పరిజ్ఞానం సామాన్య ప్రజానీకానికి ఉండదేమో, అందువల్లే ఎన్నో కొన్ని గంటలపాటు వారి ప్రసంగాలు విన్నప్పటికీ ఆత్మపరమాత్మ అంటే అర్ధం ఎవ్వరూ చెప్పలేక పోతున్నారు. ఇక్కడ అందరికీ అర్ధమయ్యేలా ఈ విషయంపై చర్చించుకోవాలంటే...

ఆత్మ, పరమాత్మ అనేవి రెండూ ఒకదానికి మరొకటి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. ఒకే ఆబ్జెక్ట్‌కు ఉండే రెండు నామార్ధాలే అవి. అది ఎలా అంటే పరమాత్మ అంటే భగవంతుడు. ఆత్మ ఆయన యొక్క ప్రతి బింబం. అంటే ప్రతి జీవిలో ఉన్నది ఆయన ప్రతి బింబమని ప్రతి ఒక్కరూ భావించవచ్చు. ఇదే విషయాన్ని కురుక్ష్త్రే సంగ్రామ సమయంలో భగవానుడు శ్రీ కృష్ణుడు, తన భకాగ్రేసరుడైన అర్జునకు వివరించాడు. ‘‘అర్జునా! ఈ సమస్త సృష్టి యందునూ ప్రతియొక జీవిలోనూ నేను నిండియున్నాను. నా యొక్క ప్రతి స్వరూపమే ఆత్మస్వరూపాన ఆయొక్క జీవులన్నింటిలోనూ నిండియున్నది.

కనుక అర్జునా! సంశయింపకుము, చంపెడి వాడెవ్వడు, చచ్చెడి వాడెవ్వడు, అంతయూ నేనే, ఇది అంతా నా యొక్క చిద్విలాసము, నీ యొక్క భౌతికస్వరూపము ద్వారా ధర్మ సంస్థాపన చేయుచున్నాను, నీ యందునూ నేనే నిండియున్నాను, నీ యొక్క విధిని నీవు నిర్వర్తింపుము, పాప పుణ్యముల ఫలితమును నాపై వదిలి వేయుము. నీ సంశయమును దీర్పనెంచి నా యొక్క విశ్వరూపమును ప్రదర్శించుచున్నాను’’ అంటూ అర్జునుని యొక్క సందేహములను తీర్చు క్రమంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తద్వారా సమస్త ప్రాణకోటికీ ఆత్మపరమాత్మల యొక్క స్వరూప, స్వభావాలను విస్పష్టంగా చెప్పడం జరిగింది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునునకు ఉపదేశించిన విధంగా నీవు, నేను, జంతువు, క్రూరమృగాలు, క్రిమి, కీటకాదులనే భేదంతో నిమిత్తం లేకుండా భగవంతుడి ప్రతి స్వరూపం ప్రతి ఒక్కరిలోనూ నిండియున్నది. అది ఎలా అంటే... ఇక్కడ ఆత్మ, పరమాత్మ అంటే వేరుకాదు. సాధారణ వ్యావహారిక భాషలో చెప్పుకోవాలంటే ఉదాహరణకు అద్దంలో చూచుకొనే మనిషి అసలు స్వరూపమైతే, అద్దంలో కనబడేది ప్రతిబింబ స్వరూపం. ఎప్పుడైతే మానవుడు అద్దం ముందు నిలబడతాడో ప్రతి బింబం రూపేణా అతడే అద్దంలో కనబడతాడు. ఎప్పుడైతే మానవుడు అద్దం ముందు నుండి తొలగుతాడో, అప్పుడు అతడి ప్రతిబింబం తొలగిపోతుంది. అదే విధంగా జీవి యొక్క అసలు స్వరూపం భగవంతుడు అయినట్లయితే ఆయన ప్రతి రూపమే ఆత్మ. దానినే జీవియొక్క ప్రాణం లేదా జీవంగా పేర్కొనవచ్చు. ఎప్పుడైతే ఐహిక దేహమనే అద్దం నుండి ఆత్మ అనే భగవంతుడి ప్రతి బింబం తొలగి పోతుందో అప్పుడే జీవికి మరణం సంభవిస్తుంది. 

Popular Posts