Followers

Tuesday 14 May 2013

రామాయణంలో రత్నాలు వేదవేద్యుడురాముడు -వేదమే రామాయణం(Ramayanam lo Rathnalu)





"వేద వేద్యే పరే పుంసీ జాతే ధశరధాత్మజే వేదప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా." వేదములచేత తెల్పబడిన శ్రీ మన్నారాయణుడే శ్రీ రాముడని, వేదమే ప్రాచేతసునిచే (వాల్మీకినే ప్రాచేతసుడు.అంటారు.) రామాయణంగా రచింప బడెను అని పై శ్లోకం తెల్పు తుంది.
"ఋక్షకుడు" రామనామాన్నిజపిస్తూ ,తపోమగ్నుడై ఉంటాడు.అతనిపై "వల్మీకం" అనగా పుట్ట ఏర్పడుతుంది.కనుకనేఋషియై వాల్మీకిగా కీర్తి గాంచాడు.పుట్టగా ఉన్నపుడు వరుణుడు వానకురిపిస్తాడు. పుట్టమన్ను కరిగి వాల్మీకి బైటపడతాడు. వరుణుడికి ప్రచేతసుడు అనిపేరు.కనుకనే వాల్మీకికి "ప్రాచేతసుడు" అని నామాంతరం. అట్టిప్రాచేతసుడు ఋషియై, కవియై"నానృషీఃకురుతేకావ్యం"అన్నట్లుగా నారదుని ఉపదే శం తో,బ్రహ్మ వరప్రభావంతో సీతారాముల జీవిత గాధని,"పౌలస్త్యవధ,సీతాయాశ్చరితం" అన్న నామాంతరాలతో లిఖించి ,మానవజీవనగమనాల్ని ,ప్రమాణాలని,అత్యున్నత శిఖరాలకు తీసికొనివెళ్ళింది రామాయణం. ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఉత్తమకావ్యంగా రచింప బడిన రామాయణం వేదస్వరూపమే అనుటలో సందేహం లేదు.
వేదం ప్రభు సమ్మితం.రాజు వలే అన్ని చెప్పి చేయిస్తుంది. "సత్యం వద,ధర్మం చర.యాన్యనవద్యన కర్మాణి,తాని సేవితవ్యాని,నో యితరాణీ.సర్వే జనాః సుఖినోసంతు,సర్వే సంతు నిరామయాః ,సర్వే భద్రాణీపశ్యంతు ,మా కశ్చిత్ ధుః ఖ మాప్నుయాత్." అని వేదం బోధిస్తుంది. మానవ జీవితాలను సన్మార్గంలో నడిపించే ఇట్టి అమూల్య వాక్యాలు యన్నో వెదాలలో మంత్ర రూపంలో ఉన్నాయి.వాటిని మనకి సులభంగా బొధించడానికి రామాయణం వంటికావ్యాలు పుట్టాయి .
రాముడు ఆ వే ద వాక్యాలని ఆచరించి చూపాడు.కనుకనే రామాయణం వేదం అన్నారు. వేదానికి , రామాయణానికి ఉన్న సారూప్యతని తెలిసికొందాం."సత్యంవద. సత్యాన్నప్రమదితవ్యం." అని అంటుంది వేదం. అనగా సత్యమే మాటాడు.సత్యమార్గం నుండి మరలకు.అని అర్ధం.రాముడు సత్యవాక్య పరిపాలనాదక్షుడు."అధ ధర్మాత్మా సత్య సంధశ్చ రమో దాశరధిర్యధి." అని కీర్తిస్తాడు వాల్మీకి.
సత్య సంధత కోసమే మానవునిగా అన్ని కష్టాలు పడ్డాడు రాముడు.వనవాస ప్రారంభంలో భరతుడు, వశిష్టుడు,మంత్రి సుమంత్రుడుమొదలగు వారు ఎంతమంది,ఎంతచెప్పినా రాజ్యానికి తిరిగి పోక, తండ్రికిచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు. తండ్రి మరణించాడు. వరం కోరిన కైక స్వయంగా రమ్మని పిలిచింది.భరతుడే వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని వేడుకొన్నడు. ముఖ్యులైన పెద్దలు కూడా తప్పు లేదు రమ్మంటారు. తమ్ములు సేవిస్తుంటే , హాయిగా సీతతో సుఖాలనుభవిస్తూ ,రాజ్యాన్ని పరిపాలించవచ్చు. సత్యం కోసం రాముడు రాజ్యసుఖాలని తృణప్రాయంగా యెంచి తృణీకరిస్తాడు .ఇట్టి సత్యసంధత రఘువంశరాజుల చరిత్రకే కలికి తురాయి అయింది. అందుకే అతడు"రఘు రాముడయ్యాడు." సంధర్భం కాకున్నా ఇక్కడరాముని ముత్తాత గారైన రఘుమహారాజు గొప్పతనాన్ని చాటిచెప్పే ఒక అద్భుత విషయాన్ని తెలుసుకొందాం.
వశిష్ఠుని అనుమతితో "నందిని"అనే ధేనువుని సేవించి ఆగోమాత వరంతో దిలీపునికి కుమారుడిగా జన్మించిన వాడు రఘు మహారాజు.తండ్రి తదుపరిరాజ్యాన్ని ధర్మ సమ్మతంగా పరిపాలిస్తూ నాలుగు దిక్కులలో ఉండే శతృరాజులను జయించి .వారి సంపదను " విశ్వజిత్" అనే యజ్ఞం చేసి వారికే తిరిగి ఇచ్చివే సిన త్యాగశీలి రఘువు. అట్టి రఘువు వద్దకు ఒక రోజు "వరతంతు" మహాముని శిష్యుడైన "కౌత్సుడు"వస్తాడు. అప్పుడు రఘువు మట్టి పాత్రలతో నీళ్ళుతీసుకొని వెళ్ళీ అతిధి మర్యాదలు చేసి,కౌ త్సుని రాకకి కారణం అడుగుతాడు.సమస్త సంపదలను దానమిచ్చి, కేవలం మట్టిపాత్రలతో మిగిలిన రఘువుని యాచించడానికి మనసురాక ఊ రుకొంటాడు.
రఘువు నిర్భంధించిన మీదట తనరాకకి కారణం ఇలాచెపుతాడు."తాను గురువు గారైన వరతంతు మహామునివద్ద పదునాల్గు విద్యలు నేర్చుకొని,గురు దక్షిణ కోరుకోమని గురువుగారిని నిర్భంధించగా "పదునాల్గు వి ద్యలకి సమానంగా పదునాల్గు కొట్ల సంపదని కోరెననీ ,అది నిన్ను కో రి గురువుకు ఇవ్వదలచానని,కాని నీవద్ద ఏ మి లేదని చూసి ,ఊరు కొన్నాను ." అనిచెప్తా డు. అప్పుడు రఘువు మూడురోజులు తన అతిధి గృహంలో ఉండమని,కొరిన ధనం ఇస్తానని వెడుకొంటాడు.వెంటనే ధనం కోసం కుభేరుడిమీదకి దండ యాత్ర ప్రకటిస్తాడు.ఇది తెలిసి కుబేరుడు ఆ రాత్రి ధనవర్షం కురుపించి ధనాగారం నింపుతాడు.
మరునాడు కౌ త్సుని ఆధనమంతా తిసుకోమంటాడు రఘువు. అపుడు తనకు పదునాల్గు కోట్లు చాలని,ఎక్కువ వద్దని కౌత్సుడు, ఈధనం అంతానికోసమే మొత్తం తీసుకొమ్మని రఘువు వాదులాడుకోగా వారిద్దరి ధర్మ గుణానికి దేవతలు సంతసించి పుష్ప వర్షం కురిపిస్తారు. అట్టి రఘుమహారాజు వంశంలోపుట్టినరాముడు రఘురాముడై,జగదభి రాముడై కీర్తిగాంచుతాడు. ఇక ప్రస్తుతాంశం. "ధర్మం చర.ధర్మాన్నప్రమదితవ్యం"అంగా ధర్మం ఆచరించు,ధర్మ మార్గం నుండిమరలకు,అందివేదం."రమోవిగ్రహవాన్ ధర్మః"ఆకారం దాల్చిన ధర్మగుణమే రాముడు.రామాయణంలో రాముడు అణువణు వునా ధర్మాన్ని ఆచరించి చూపాడు. ధర్మాన్ని నిలపడానికి తాటకిని వధిస్తాడు,యాగాన్ని రక్షిస్తాడు,అరణ్య వాసం చేస్తాడు,వాలిని చంపి సుగ్రీవునితో మిత్ర ధర్మాన్ని పాటిస్తాడు,పితృసమానుడైన జటాయువు అంత్య క్రియలు చేస్తాడు,కబంధుడికి,శబరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు,రాక్షస సం హారంచేసి మునులని రక్షిస్తాడు,అవతార ప్రయోజనమైన రావణుని చంపి, సకల లోకాలకి శాంతిని కలిగిస్తాడు. రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించి " ధర్మో రక్షతి రక్షితః " అన్న దానికి ప్రమాణంగానిలుస్తాడు.కనుక" రామాయణం వేదమే,రాముడువేద వేద్యుడే" అనుటలో సందేహమే లేదు. స్వస్తి.

Popular Posts